iDreamPost

బాబు అవినీతి చిట్టా మొత్తం విప్పిన సోము వీర్రాజు

బాబు అవినీతి చిట్టా మొత్తం విప్పిన సోము వీర్రాజు

గత వారం రొజుల నుండి చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస రావుతో పాటు లోకేష్ కి అత్యంత సన్నిహితులైన పత్తిపాటి పుల్లారావు తనయుడు పత్తిపాటి శరత్, లోకేష్ మరో సన్నిహితుడు కిలారి నరేశ్, కడపజిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి కి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లొ సోదాలు నిర్వహించిన IT డిపార్ట్మెంట్ ఈ సోదాల్లో రెండు వేల కోట్ల రుపాయాల పైగా నిధులు అక్రమంగా విదేశాలకు తరలించారని ప్రాధమికంగా గుర్తించామని అధికారికంగా ప్రెస్ నోట్ విడుదల చేసిన నేపధ్యంలో

తెలుగుదేశం నేతల పై జరిగిన ఐటి దాడులపై బీజేపీ ఎమ్మెల్సీ తీవ్రంగా స్పందించారు. అయన మీడియా తో మాట్లాడుతూ చంద్రబాబు అవినీతిని తవ్వడానికి బుల్‌డోజర్లు కావాలని ఎద్దేవా చెశారు.

గత ప్రభుత్వంలో పోలవరం కాంట్రాక్ట్ ప్యాకేజి లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. పోలవరం కుడి, ఎడమ కాలువల్లో మిగిలిపోయిన పనుల కోసం ఒక ప్యాకేజ్‌గా ప్రారంభించారు. దాని విలువ 15 కోట్లు అయితే అప్పటి ముఖ్యమంత్రి అనుమతితో దానిని ఏకంగా 90 కోట్లకు పెంచి పనులు చేశారన్నారు.

ఈ దెశంలో చట్టానికి డొరకకుండా అవినీతిని ఎలా చేయాలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలిసినంతగా భారతదేశంలో ఎవరికీ తెలీదనీ సోము వీర్రాజు చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఐటి సోదాల్లో ప్రాధామికంగా జరిపిన విచారణ లోనే 2 వేల కోట్లు రుపాయాల అక్రమాలు బయటపడితే, ఇంకా పూర్తి స్థాయి లో విచారిస్తే ఇది ఎన్ని వేల కోట్లకు వెళుతుందనే అంచనా ఊహలకందదని సోము వీర్రాజు అభిప్రాయ పడ్డారు.

తెలుగుదేశం పార్టీ వాళ్లు దీనిని దాచడానికి పడరాని పాట్లు పడుతున్నారని, పదేళ్లు చంద్రబాబు పీఏ గా పని చేసిన శ్రీనివాస్‌కు, తెలుగుదేశానికీ సంబంధం ఎంటని ప్రశ్నించడం హాస్యాస్పదంగా వుందన్నారు.

చంద్రబాబు కు సంభంధం లేకపోతే ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి పీఎస్‌ ఇంట్లో ఇంత డబ్బు ఎలా దొరుకుతుంది. ఇన్ని లాకర్స్‌కు సీల్‌ వేయడమేంటి? పీఎస్‌ శ్రీనివాస్‌ సత్యహరిశ్చంద్రుడైతే చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ల సహాయం లేకుండా ఇన్ని లాకర్లకు సీల్‌ వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు .

ఇదే సమయంలో గత ప్రభుత్వ హయంలో నీరు-చెట్టు కార్యక్రమం పనుల్లో 25 వేల కోట్ల అవినీతి జరిగిందని, అదే సమయంలో స్వచ్ఛభారత్, గృహనిర్మాణశాఖలలో జరిగిన అవినీతిపై ఇప్పుడు విజిలెన్స్‌ ఎంక్వయిరీ జరుగుతోంది.

చంద్రబాబు హయంలో జరిగిన పోలవరం పనులపై స్పందిస్తూ ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీకి రూ.500 కోట్లు అడ్వాన్స్‌ ఇచ్చారు. దీన్ని ఇప్పటికి కూడా ప్రభుత్వం వెనక్కి రాబట్టలేకపోయింది. ఈ రూ.500 కోట్లు శ్రీనివాస్‌కు ఇచ్చిన సబ్‌కాంట్రాక్టు ద్వారా వెనక్కి వచ్చింది. పోలవరం లెఫ్ట్‌ కెనాల్‌లో 10 ప్యాకేజీలున్నాయి. వీటన్నింటినీ 10 కోట్ల పనుల్ని 50 కోట్లకి పెంచారని, 15 కోట్లుంటే 75 కోట్లు చేశారని చెప్పారు. కుడి, ఎడమ కాలువల కాంట్రాక్టు ధరల్ని పెంచారు. ఆ పెంచడం ద్వారా వచ్చిన డబ్బు శ్రీనివాస్‌ ద్వారా బయటికి వెళ్లిందని సోము మీడియా దృష్టి కి తీసుకొచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరిగిందని సోము వీర్రాజు పేర్కొన్నారు. రాయలసీమ ప్రాజెక్టుల కాలువలు వెడల్పు చేశామని చెప్పారు. అసలు వెడల్పు చేయకుండానే బిల్లులు డ్రా చేశారు. దీని విలువ రూ.5 వేల కోట్లు. ఈ పనులు జరిగి ఉంటే.. ఈ మధ్య కురిసిన వర్షాలకు రాయలసీమ సస్యశ్యామలమయి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

MGNREGS (నేషనల్‌ రూరల్‌ ఎంప్లాయిమెంట్‌ స్కీమ్‌) పథకం కింద ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఇచ్చింది. ఈ పనుల్లో లెక్కలేనంత అవినీతి జరిగింది. రూ.1 కోటితో పనులు జరగాలంటే రూ.40 లక్షల్లో పనులు చేసేవారు. ఈ డబ్బంతా శ్రీనివాస్‌ ద్వారానే కాకుండా.. పెద్దపెద్ద తిమింగలాల ద్వారా బయటకు వెళ్లిందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు .

జగన్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత పోలవరం, హైడ్రోపవర్‌ జనరేషన్‌ పనులను కలిపి ఒక్క ప్యాకేజీ కింద టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు ఈ టెండర్లలో రూ.800 కోట్లు తక్కువ కోట్‌ చేశారన్నారు.

అమరావతి పనుల పై స్పందిచిన వీర్రాజు చదరపు మీటర్‌కు రూ.10 వేలు ఖర్చు చేశారు. శాసనమండలిలో యూరినల్‌కు వెళితే పక్కన ఉన్న వ్యక్తి తగులుతుంటాడు. పై నుంచి నీళ్లు కారుతుంటాయని ఎద్దేవా చేశారు.

చిన్నబాబు ద్వారానే శ్రీనివాస్‌ చంద్రబాబు పీఎస్‌ అయ్యారని, ఎప్పుడైతే చిన్నబాబు వచ్చారో యనమల లాంటి బాబులందరూ దిల్లీ వెళ్లిపోయారని అన్నారు.

ఇన్‌కంటాక్స్‌ చేపట్టిన తనిఖీల్లో మంత్రుల పుత్రరత్నాలు, చిన్నబాబు స్నేహితులే దొరుకుతున్నారు. ప్రభుత్వంలో జరిగిన వ్యవహారం అంతా శ్రీనివాస్‌తో కనుసన్నలొనే నడిచింది. ఎవరు ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లాలి..,దానికి సంబంధించిన ట్రేడింగ్‌ ఎంత అనేది.. మంత్రుల కొడుకులు, చిన్నబాబు, శ్రీనివాస్‌ అందరూ కలిసి చర్చించుకునేవారని సోము ఆరోపించారు.

తాజా ఐటి దాడుల్లో గత ప్రభుత్వంలో పెద్ద వ్యక్తుల ప్రమేయం బయటపడిన నేపధ్యంలో ఇది ఇక్కడితో ఆగదని ఈ డొంక చాలా వరకు వెళ్తుంది. అంత ఈజీగా వదిలేస్తారు అనుకోవద్దని సోము వీర్రాజు హెచ్చరించారు. దేశ రాజకీయాలకే ఈ అవినీతి ఒక సవాల్‌ ఇది. దేశాన్ని మోసం చేసే ఇలాంటి వ్యక్తుల గురించి బీజేపీ చాలా గట్టిగా ఉంటుంది. అది మా బాధ్యతని బిజెపి ఎమ్మెల్సీ స్పష్టం చేశారు.

చివరిగా సోము వీర్రాజు మాట్లాడుతూ ఈ ఐటీ దాడులు ఎదో వైఎస్సార్‌సీపీకి లోకేశ్‌ బాబుకు సంబంధించిన విషయం కాదు. ఒక అవినీతి పరుడికి.. భారత ప్రభుత్వానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. దీనికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇంతటితో వదిలిపెట్టదని స్పష్టం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి