iDreamPost

వీడియో: టీమిండియాలో చోటు దక్కలేదని కన్నీళ్లు పెట్టుకున్న క్రికెటర్‌

  • Published Jul 06, 2023 | 4:43 PMUpdated Jul 06, 2023 | 4:43 PM
  • Published Jul 06, 2023 | 4:43 PMUpdated Jul 06, 2023 | 4:43 PM
వీడియో: టీమిండియాలో చోటు దక్కలేదని కన్నీళ్లు పెట్టుకున్న క్రికెటర్‌

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు జట్టు ఎంపికపై విమర్శలు వస్తుంటే.. మరో వైపు మహిళా క్రికెట్‌లోనూ వివాదం రాజుకుంది. బంగ్లాదేశ్‌తో వన్డే, టీ20 సిరీస్‌ కోసం ఎంపిక చేసిన టీమ్‌లో స్టార్‌ క్రికెటర్‌ శిఖా పాండేకు చోటు దక్కలేదు. ఈ విషయంపై భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌ ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా జట్టులో చోటు దక్కకపోవడంపై ఎదురైన ప్రశ్నకు పాండే సమాధానామిస్తూ.. ‘టీమిండియాలో స్థానం దక్కలేదని నిరాశ చెందకపోతే నేను మనిషే కాను. నాకు చోటు దక్కకపోవడం వెనుక ఉన్న కారణం ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు.’ అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.

గతంలో కూడా టీమిండియాలో స్థానం కోల్పోయిన శిఖా పాండే సౌతాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌తో తిరిగి టీమ్‌లో వచ్చారు. బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సైతం శిఖా పాండే అద్భుతంగా రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడిన పాండే ప్రధాన వికెట్‌ టేకర్‌గా నిలిచారు. అయినా కూడా టీమిండియాలో ఆమెకు స్థానం దక్కకపోవడంపై క్రికెట్‌ అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన పురుషుల జట్టులో రుతురాజ్‌ గైక్వాడ్‌, రింకూ సింగ్‌, జితేష్‌ శర్మలకు చోటు దక్కకపోవడంపై ఎంతటి విమర్శలు వస్తున్నాయో.. మహిళల టీమ్‌లో శిఖా పాండే లేకపోవడంపై కూడా అంతే స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి