iDreamPost

2 కోట్ల ఆఫర్ – నో చెప్పేసింది

2 కోట్ల ఆఫర్ – నో చెప్పేసింది

పరిశ్రమలో దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవడమనేది ఎప్పుడూ వినిపించే సామెత. అందుకే సినిమాలు వెబ్ సిరీస్ లే కాకుండా హీరో హీరోయిన్లు యాడ్స్ లో నటించడం పరిపాటి. అంత స్టార్ డం, వేల కోట్ల ఆస్తులున్న షారుఖ్ ఖాన్ – అక్షయ్ కుమార్ – అజయ్ దేవగన్ లు తప్పని తెలిసినా ఒక పాన్ మసాలా కంపెనీ ఉత్పత్తులను జస్ట్ సుపారీ పేరుతో ఎలా ప్రమోట్ చేశారో చూశాం. ఆదాయం కోసం మంచి ప్రోడక్ట్స్ ని మన దగ్గరా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్, నాగార్జున లాంటి వాళ్ళు ఎండార్స్ చేయడం కొత్తేమి కాదు. పవన్ కళ్యాణ్ సైతం ఒకప్పుడు పెప్సీ కోసం ప్రకటన చేశారు. ఇటీవలే చిరంజీవి రియల్ ఎస్టేట్ యాడ్ ఒకటి చేయడం చూశాం.

ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం సాయిపల్లవి. ఒక శాటిలైట్ టీవీ తమ ఛానల్ లో వచ్చే సీరియల్స్, ప్రోగ్రాంస్ కోసం డిజైన్ చేసిన స్పెషల్ ప్రోమోస్ లో నటించమని ప్రతిపాదన పెట్టిందట. దానికి గాను అక్షరాలా రెండు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా ఆఫర్ చేశారట. అయితే తనకు సినిమా తప్ప ఇతర విషయాలేవీ అవగాహన లేదని, అలాంటప్పడు కేవలం డబ్బు కోసమే ఒప్పుకునే ప్రసక్తే లేదని సున్నితంగా నో చెప్పేసిందట. ఇదంతా విరాట పర్వం ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు జరిగిన లావాదేవీగా చెబుతున్నారు. పెద్దగా కాల్ షీట్స్ అవసరం లేని ఇలాంటి ప్రపోజల్ కి సాయిపల్లవి నో చెప్పడం నిజంగా ఆశ్చర్యం కలిగించేదే.

సినిమాలను సెలెక్టివ్ గా ఎంచుకునే సాయిపల్లవి తెలుగు నుంచి చాలా కథలు వెళ్లినా ఏదీ ఒక పట్టాన ఒప్పుకోలేదు. లవ్ స్టోరీ తర్వాత టాలీవుడ్ లో చేసిన స్ట్రెయిట్ మూవీ విరాటపర్వమే. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ నక్సల్ బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ డ్రామాలో బావ ప్రేమ కోసం ఉద్యమంలో చేరిన విప్లవకారిణిగా కొత్తగా కనిపించనుంది. ఇప్పటికే ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ మధ్య చిరంజీవి భోళాశంకర్ లో చెల్లెలు పాత్ర అడిగితే తను నో చెప్పిన సంగతి తెలిసిందే. తర్వాత అది కీర్తి సురేష్ కు వెళ్ళింది. మొత్తానికి సాయిపల్లవి తన కెరీర్ ప్లానింగ్ డబ్బు కోసం కాదని, క్వాలిటీ కోసమేనని మరోసారి ఈ ఉదంతం ద్వారా తేల్చి చెప్పేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి