iDreamPost

జేడీయూ పొమ్మంది.. ఆర్జేడీ రమ్మంటోంది..

జేడీయూ పొమ్మంది.. ఆర్జేడీ రమ్మంటోంది..

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌, బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ల ఎపిసోడ్‌ ముగియక ముందే ఆ రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన ప్రశాంత్‌ను అసెంబ్లీ ఎన్నికల ముందు తమ వైపు తిప్పుకునేందుకు ఆ రాష్ట్రంలో ప్రధానప్రతిపక్షం ఆర్జేడీ వేగంగా పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే బిహార్‌లో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ ఆహ్వానం పంపింది. ప్రశాంత్‌ కిషోర్‌ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కాగా, ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరతారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. అది ఇప్పుడు ఊపందుకుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుపై ఇ‍ప్పటికిప్పుడు తానేమీ మాట్లాడనని ప్రశాంత్‌ కిషోర్‌ చెబుతున్నారు. ఫిబ్రవరి 11న పట్నాలో జరిగే సమావేశంలో తన ప్రణాళికలు గురించి వెల్లడిస్తానని ఆయన తెలిపారు.

నితీష్‌, ప్రశాంత్‌ కిషోర్‌ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకోవడంతో..  ప్రశాంత్‌ కిషోర్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఎన్డీయేలో జేడీయూ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశాంత్‌ వ్యవరిస్తున్నారు. సిఏఏ, ఎన్ఆర్సి లను ప్రశాంత్ కిషోర్ బహిరంగంగా వ్యతిరేకించారు. ఇరుపార్టీల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉందని భావించిన ఇరు పార్టీల నేతలు ముందస్తు జాగ్రత్తగా ఆయన్ని తప్పించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి