iDreamPost

రేషన్‌ డోర్‌ డెలివరీ.. రాయితీ వాహనాల కేటాయింపు ఇలా..

రేషన్‌ డోర్‌ డెలివరీ.. రాయితీ వాహనాల కేటాయింపు ఇలా..

ఇంటింటికి రేషన్‌ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని కొత్త ఏడాది ప్రారంభం నుంచి అమలు చేయాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌.. ఆ దిశ చర్యలను వేగవంతం చేసింది. రేషన్‌ డోర్‌ డెలివరికి రాష్ట్ర వ్యాప్తంగా 9260 వాహనాలు అవసరం అవుతాయని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ వాహనాలను ఆయా పంచాయతీల్లో ఉండే నిరుద్యోగు యువతకు కేటాయించాలని ప్రభుత్వం సంకల్పంచింది. రాయితీపై ఇచ్చే వాహనాలను అన్ని కులాల వారికి ఆయా కార్పొరేషన్ల ద్వారా అందజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

9,260 వాహనాలలో 2,300 ఎస్సీలకు, 556 ముస్లింలకు, 104 క్రిస్టియన్లకు కేటాయించాలని నిర్ణయించారు. మిగిలిన వాహనాలను బీసీ, ఓసీలకు ఇవ్వనున్నారు. ఈ వాహనాలను ఆయా కులాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా రాయితీపై ఇచ్చేందుకు ప్రభుత్వం అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 51,81,190 రూపాయల విలువ గల ఈ వాహనాన్ని 60 శాతం రాయతీ, పది శాతం లబ్ధిదారుడు వాటా, మిగతా 30 శాతం బ్యాంకు రుణం ద్వారా అందిస్తారు. 7వ తరగతి చదవి, 21–45 ఏళ్ల మధ్య ఉన్న వారు ఇందుకు అర్హులు.

లబ్ధిదారుల ఎంపిక కోసం మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారిగా నోటిఫికేషన్లు ఈ నెల 20వ తేదీన జారీ చేయనున్నారు. అదే రోజు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్‌ 4వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 50 శాతం మార్కుల ప్రాతిపదికన ఇంటర్వ్యూలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపికైన లబ్ధిదారులు జాబితాను డిసెంబర్‌ 5వ తేదీన ప్రకటిస్తారు. జనవరి నెల నుంచి రేషన్‌ డోర్‌ డెలివరీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తారు. ఏప్రిల్‌ నెల నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమం పైలెట్‌ ప్రాజెక్టుగా అమలవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి