iDreamPost

ప్రియమణికి ‘దగ్గుబాటి’ బొనాంజా

ప్రియమణికి  ‘దగ్గుబాటి’  బొనాంజా

ఇప్పుడంటే ఫామ్ లో లేదు కానీ ఇండస్ట్రీకి ఎంటరైన మొదట్లో ప్రియమణి కెరీర్ బాగానే సాగింది. అతి తక్కువ టైంలోనే జూనియర్ ఎన్టీఆర్ సరసన యమదొంగలో మెయిన్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. రాజమౌళి లాంటి దర్శకుడితో చేసినా ఆ తర్వాత తనకు పెద్దగా బ్రేక్ రాకపోవడంతో పోటీలో నెగ్గుకు రాలేక కొంత వెనుకబడింది. ఇటీవలి కాలంలో హిందీ వెబ్ సిరీస్ లలో నటిస్తున్న ప్రియమణి ఇప్పుడు దగ్గుబాటి కాంపౌండ్ నుంచి డబుల్ బంపర్ ఆఫర్ కొట్టేసింది.

వెంకటేష్ హీరోగా తమిళ బ్లాక్ బస్టర్ అసురన్ రీమేక్ గా రూపొందుతున్న నారప్పలో ప్రియమణి వెంకీకి జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది బాబాయ్ తో ముచ్చట. ఇక అబ్బాయి రానా నటిస్తున్న విరాటపర్వంలోనూ ఓ కీలక పాత్ర చేస్తోంది. సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో ప్రియమణిది నక్సలైట్ పాత్రట. దీనికి తగ్గట్టు ప్రత్యేకమైన వేషభాషలతో పాటు ఆహార్యం కూడా విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేశారట దర్శకుడు వేణు ఊడుగుల. 1992 కాలంలో ఉదృతంగా ఉన్న నక్సలైట్ ఉద్యమం బ్యాక్ డ్రాప్ లో విరాట పర్వం చాలా డిఫరెంట్ గా రూపొందుతుతోందని ఇప్పటికే టాక్ ఉంది. ఇప్పుడీ రెండు సినిమాలు కనక ప్రియమణికి వర్కౌట్ అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరింత బిజీగా మారిపోవచ్చు.

ఇక నారప్పలోనూ తనది కీలక పాత్రే. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మినహాయించి సినిమా మొత్తం ప్రియమణి ఉంటుంది. కరోనా గొడవ రాకపోయి ఉంటే నారప్ప వచ్చే నెల విడుదలయ్యేది. ఈ రెండు చిత్రాలు తనకు మేజర్ బ్రేక్ అవుతాయనే నమ్మకంతో ఉంది ప్రియమణి. ఇవి దగ్గుబాటి కాంపౌండ్ నుంచి అందులోనూ అబ్బాయి బాబాయ్ చిత్రాలు కావడం విశేషం. నారప్పతో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చాలా గ్యాప్ తర్వాత కం బ్యాక్ ఇస్తున్నారు. విరాటపర్వం డైరెక్టర్ వేణు ఊడుగులకు రెండో మూవీ. మొదటి చిత్రం నీది నాది ఒకే కథ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి