iDreamPost

TDP కోసం పని చేయనని ఆరోజే చంద్రబాబుకు చెప్పాను: ప్రశాంత్‌ కిషోర్‌

  • Published Jan 23, 2024 | 11:57 AMUpdated Jan 23, 2024 | 11:57 AM

Prashant Kishor-TDP: రానున్న ఎన్నికల్లో ప్రశాంత్‌ కిషోర్‌ తమ పార్టీ కోసం పని చేయనున్నారంటూ ప్రచారం చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలకు.. ఆయన భారీ షాక్‌ ఇచ్చారు. ఆ వివరాలు..

Prashant Kishor-TDP: రానున్న ఎన్నికల్లో ప్రశాంత్‌ కిషోర్‌ తమ పార్టీ కోసం పని చేయనున్నారంటూ ప్రచారం చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలకు.. ఆయన భారీ షాక్‌ ఇచ్చారు. ఆ వివరాలు..

  • Published Jan 23, 2024 | 11:57 AMUpdated Jan 23, 2024 | 11:57 AM
TDP కోసం పని చేయనని ఆరోజే చంద్రబాబుకు చెప్పాను: ప్రశాంత్‌ కిషోర్‌

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ-జనసేనల మధ్య పొత్తు కుదిరింది.. కానీ ఇంకా సీట్ల పంపకం అంశం కొలిక్కి రాలేదు. ఇదిలా ఉండగానే పొలిటికల్‌ స్ట్రాటజిస్టు ప్రశాంత్‌ కిషోర్‌.. టీడీపీ కోసం పని చేస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. దీనికి తగ్గట్టుగానే.. కొన్ని రోజుల క్రితం ప్రశాంత్‌ కిషోర్‌.. చంద్రబాబుతో సమావేశం అవ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

దాంతో టీడీపీ కేడర్‌ ప్రశాంత్‌ కిషోర్‌ తమ పార్టీ కోసం పని చేస్తున్నాడని ప్రచారం మొదలు పెట్టింది. ఈ క్రమంలో తాజాగా ప్రశాంత్‌ కిషోర్‌ టీడీపీకి భారీ షాక్‌ ఇచ్చాడు. తాను ఆ పార్టీ కోసం పని చేయడం లేదంటూ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు..

I told Chandrababu that I will not work for TDP

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే సార్వ‌త్రిక‌ ఎన్నికల్లో భాగంగా తాను తెలుగుదేశం పార్టీకి పని చేయడం లేదని స్పష్టం చేశారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్‌ టీడీపీకి పని చేసే విషయంపై స్పందిస్తూ.. ఈ అంశంపై కుండబద్దలు కొట్టారు. కొన్ని రోజుల క్రితమే తాను టీడీపీకి పని చేయనని చంద్రబాబు చెప్పానని వెల్లడించి షాక్‌ ఇచ్చారు ప్రశాంత్‌ కిషోర్‌.

విజయవాడలో చంద్రబాబుతో భేటీ వెనుక ఏం జరిగిందనే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. చంద్రబాబుతో సమావేశం కోసం ఇద్దరికి స్నేహితుడైన ఓ నాయకుడు కోరాడని చెప్పారు. అయితే తాను పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా వర్క్ చేయడం లేదని చెప్పినప్పటికీ.. ఒకసారి చంద్రబాబుతో సమావేశమై ఇదే విషయాన్ని బాబుకు చెప్పాలని ఆ కామన్‌ ఫ్రెండ్‌ కోరడంతో తాను.. విజయవాడ వెళ్లి చంద్రబాబును కలిశానని చెప్పుకొచ్చాడు ప్రశాంత్‌ కిషోర్‌.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి మద్దతుగా పని చేశానని.. కానీ ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజిస్టుగా పని చేయడం లేదన్నారు ప్రశాంత్ కిషోర్‌. ఇదే విషయాన్ని చంద్రబాబుతో చెప్పానన్నారు. రాబోయే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన పాత్ర ఉండదని ఈ సందర్భంగా ప్రశాంత్‌ కిషోర్‌ స్పష్టం చేశారు. ఎవరికి అనుకూలంగా పని చేయబోనని తెలిపారు. దాంతో ప్రశాంత్‌ కిషోర్‌ తమ పార్టీ కోసం పని చేస్తున్నాడంటూ ఇన్నాళ్లు టీడీపీ చేసుకుంటున్న ప్రచారం అవాస్తవం అని తేలింది.

నెల రోజుల క్రితం పొలిటికల్ స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. ప్రత్యేక విమానంలో లోకేశ్‌ వెంట విజయవాడ చేరుకున్న ప్రశాంత్ కిషోర్‌.. బాబుతో దాదాపు గంటకుపైగా చర్చలు జరిపారు. దీంతో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రశాంత్ కిషోర్ పని చేయబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆ ఊహగానాలన్నింటికీ ప్రశాంత్ కిషోర్‌ ఫుల్‌ స్టాప్ పెట్టారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి