iDreamPost

విద్యార్థులకు ఏటా రూ. 1.25 లక్షల స్కాలర్‌షిప్‌ ఇచ్చే పథకం.. ఆగస్టు 10 వరకే అవకాశం

  • Published Aug 03, 2023 | 2:08 PMUpdated Aug 03, 2023 | 2:08 PM
  • Published Aug 03, 2023 | 2:08 PMUpdated Aug 03, 2023 | 2:08 PM
విద్యార్థులకు ఏటా రూ. 1.25 లక్షల స్కాలర్‌షిప్‌ ఇచ్చే పథకం.. ఆగస్టు 10 వరకే అవకాశం

పేద, ధనిక అనే తేడా లేకుండా బడుగు, బలహీన వర్గాల వారి పిల్లలు సైతం చక్కగా చదువుకోవాలని.. వారికి నాణ్యమైన విద్య అందించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను తీసుకొచ్చాయి. అంతేకాక ఆర్థికంగా వెనకబడిన కులాలు, ఇతర వెనకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పాఠశాల విద్యార్థులను ప్రోత్సాహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక స్కాలర్‌షిప్‌ పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా వెనకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతి ఏటా రూ.75 వేల నుంచి 1.25 లక్షల రూపాయల వరకు స్కాలర్‌షిప్‌ అందజేస్తోంది. మరి ఈ పథకం ఏంటి అంటే.. పీఎం యశస్వి యోజన. మరి ఈ పథకానికి ఎవరు అర్హులు.. ఎలా అప్లై చేసుకోవాలి వంటి పూర్తి వివరాలు..

9వ త‌ర‌గ‌తి నుంచి 11వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థులంద‌రూ ఈ పీఎం యశస్వి యోజన ప‌థ‌కానికి అర్హులే. 11వ త‌ర‌గ‌తి అంటే ఇంట‌ర్మీడియట్ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్న‌వారు, సీబీఎస్ఈ ప్ల‌స్ వన్ చ‌దువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులవుతారు. 9వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఏడాదికి రూ.75 వేలు, 11వ త‌గ‌తి విద్యార్థికి రూ.1.25ల‌క్ష‌ల వరకు ఉప‌కార‌వేత‌నం అందిస్తారు. ఈ పథకానికి అప్లై చేసుకునే విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం ఏడాదికి 2.50 లక్షల రూపాయలకు మించకూడదు.

ఎంపిక ఎలా..

ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించి, ఇందులో మెరిట్ ప్ర‌కారం విద్యార్థుల‌ను ఎంపిక చేస్తారు. కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తుంది. హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో పరీక్ష ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం ఎలా..

ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే విద్యార్థులు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్ర‌భుత్వ ఉన్న‌త విద్యాశాఖ, నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్ పోర్ట‌ల్‌ను ఏర్పాటు చేసింది. ఇదే https://yet.nta.ac.in/frontend/web/site/login ఆ వెబ్‌సైట్‌. ఈ పథకానికి అర్హులైన విద్యార్థులు.. ఈ వెబ్‌సైట్‌కు వెళ్లి అప్లై చేసుకోవాలి.

ఎలా అప్లై చేయాలంటే..

  • ముందుగా విద్యార్థులు పైన చెప్పిన అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
  • వెబ్‌సైట్‌లో రిజిస్ట‌ర్ లింక్‌పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీ పేరు, ఈ-మెయిల్‌, డేటాఫ్‌ బర్త్‌, పాస్‌వ‌ర్డ్‌ను ఎంటర్‌ చేసి.. మీకు ఒక లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్‌ ఫామ్‌ను ద‌ర‌ఖాస్తు ఫార‌మ్‌ను పూర్తి చేసి, త‌రువాత దాని కాపీని ప్రింట్ తీసి పెట్టుకోవాలి.

లాస్ట్‌ డేట్‌, పీజ్‌, ఎగ్జామ్‌ డేట్‌..

ఈ నెల అంటే ఆగ‌స్టు 10వ తేదీలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. ఆ రోజు రాత్రి 11.50 నిమిషాల వ‌ర‌కు ఈ వెబ్‌సైట్ దరఖాస్తు చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం కుదరదు. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్‌ 29న పరీక్ష నిర్వహిస్తారు. మార్పులు ఉంటే వెబ్‌సైట్‌లో తెలియజేస్తారు.

అప్లై చేయడానికి ఏ ఏ సర్టిఫికెట్లు కావాలి..

  • 9వ త‌ర‌గ‌తి విద్యార్థులు 8వ త‌ర‌గ‌తి పాసైన‌ట్లు నిర్ధారించే స‌ర్టిఫికెట్‌
  • 11వ త‌ర‌గ‌తి విద్యార్థులయితే 10వ త‌ర‌గ‌తి పాసైన‌ స‌ర్టిఫికెట్‌
  • విద్యార్థి మొబైల్ నెంబ‌రు
  • విద్యార్థి ఆధార్ నెంబ‌రు
  • కుటుంబ వార్షికాదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం (ఇన్‌కం సర్టిఫికెట్‌)
  • కుల ధ్రువీక‌ర‌ణ పత్రం (క్యాస్ట్‌ సర్టిఫికెట్‌)
  • విద్యార్థి ఆధార్ అనుసంధానిత బ్యాంకు అకౌంట్‌ డీటెయిల్స్‌
  • పాస్‌పోర్టు సైజు ఫోటో
  • విద్యార్థి సంత‌కం. ఫొటో తీసి స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి