iDreamPost

కరోనా కేసులు పెరుగుతున్నాయి…కరోనా కట్టడికి ఏం చేద్దాం? : 21 రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ

కరోనా కేసులు పెరుగుతున్నాయి…కరోనా కట్టడికి ఏం చేద్దాం? : 21 రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ

దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) కేసులు పెరుగుతున్నాయని, కరోనా కట్టడికి ఏం చేద్దామని 21 రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అడిగారు.
లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతూ రోజురోజుకీ పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా.. తొలి రోజు దేశంలో కొవిడ్‌ ప్రభావం పెద్దగా లేని 21 చిన్న, ఈశాన్య, హిమాలయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలకులతో ప్రధాని మాట్లాడనున్నారు.

పంజాబ్, అస్సాం, కేరళ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం రాష్ట్రాలు, పుదుచ్చేరి, చండీగఢ్, లఢక్, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఆయా ప్రాంతాల్లో కరోనా ప్రభావం, ఆర్థిక కార్యకలాపాలు వంటి అంశాలపై ముఖ్యమంత్రులను అడిగి ప్రధాని తెలుసుకుంటున్నారు.

కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ఈ నెలాఖరుకు ముగియనున్న నేపథ్యంలో జూన్‌ 30 తర్వాత ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కూడా ప్రధాని మోడీ చర్చించారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ దేశంలో ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని అన్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్‌ లేకుండా ప్రజలు బయటకు వెళ్లకూడదని అన్నారు.

‘’కొవిడ్‌ మరణాల సంఖ్య దేశంలో తక్కువగానే ఉంది. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం తప్పనిసరి. మాస్కులు ధరించకుండా ప్రజలు బయటకు వెళ్లకూడదు. మాస్కు ధరించడం మీతోపాటు మీ పక్కవాళ్లకూ మంచిది. సబ్బు, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం మరవకూడదు. అందరూ ఇంటి పరిసరాలను గమనించి నడుచుకోవాలి” అని ప్రధాని మోడీ అన్నారు.

“దేశంలో పారిశ్రామిక ఉత్పాదకత మెరుగుపడింది. ఎగుమతులు పూర్వస్థితికి వచ్చాయి. పరిశ్రమలకు తక్షణం రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లకు సూచించాం. సత్వర రుణాలిస్తే ఉత్పత్తి ప్రారంభమై ఉపాధి లభిస్తుంది. సంస్కరణలతో వ్యవసాయ రంగం వృద్ధి చెందింది’’ అని పేర్కొన్నారు.

అలాగే,  దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 15 పెద్ద రాష్ట్రాల ముఖ్యమంత్రులతో  ప్రధాని బుధవారం సమీక్షించనున్నారు. దేశంలో కరోనా మొదలైన నాటి నుంచి ఇలా ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడటం ఇది ఆరోసారి.

ఇదివరకు నిర్వహించిన సమావేశాల్లో ఎక్కువ మంది ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం రాలేదు. దీనిపై గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుత వీడియో కాన్ఫరెన్స్ లో అందరికీ మాట్లాడే అవకాశం కల్పించి, ప్రతి ఒక్కరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు.

అందుకోసమే రెండు దఫాలుగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే కరోనా విజృంభిస్తున్న రాష్ట్రాలు, తక్కువ ఉన్న రాష్ట్రాలుగా విభజించి పరిస్థితులను తెలుసుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి