iDreamPost

ఆఫ్ఘానిస్తాన్ లో శాంతి.. అమెరికా – తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం

ఆఫ్ఘానిస్తాన్ లో శాంతి.. అమెరికా – తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం

ఆఫ్ఘానిస్తాన్ లో దాదాపు రెండు దశాబ్దాలపాటు సాగిన యుద్ధానికి అమెరికా ముగింపు పలుకుతూ తాలిబన్లతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. 2001 సెప్టెంబరు 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్‌పై ఒసామా బిన్ లాడెన్ నాయకత్వంలోని అల్‌ఖైదా ఉగ్రవాదులు మెరుపు దాడులకు పాల్పడటంతో అఫ్గన్‌‌లో అమెరికా సేనలు, సంకీర్ణ బలగాలు సంయుక్తంగా వారిపై పోరాటం ఆరంభించాయి. అప్పటి నుంచి గత పందొమ్మిదేళ్లుగా అఫ్గనిస్థాన్ బాంబులు, తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది.

ఈ యుద్ధానికి తెరదించుతూ అమెరికా-తాలిబన్ల మధ్య శనివారం శాంతి ఒప్పందం కుదిరింది. ఖతార్‌లోని దోహాలో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి జల్మీ ఖాలిల్జాద్‌, తాలిబన్ల ప్రతినిధి ముల్లా బరదర్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో, ఖతార్‌ ఉప ప్రధాని షేక్‌ మహ్మద్‌బిన్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌, ఖతార్‌లో భారత రాయబారి కుమారన్‌తోపాటు పలు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

తాజా, ఒప్పందం ప్రకారం అఫ్గన్‌లో తాలిబన్లు ఉగ్రకార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి, తమ ప్రాంతాల్లో ఇతర ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పించరాదు. మరోవైపు అమెరికా, దాని మిత్రదేశాల సేనలను 14 నెలల్లోగా అఫ్గనిస్థాన్ పూర్తిగా ఉపసంహరించుకోవాలి. తొలిదశలో 135 రోజుల్లో 8,600 మంది సైనికులను అమెరికా ఉపసంహరిస్తుంది. కానీ, ఈ ఒప్పందం కార్యరూపం దాల్చాలంటే తాలిబన్లు, అఫ్గన్‌ ప్రభుత్వం మధ్య మార్చి 10న జరిగే చర్చలు విజయవంతం కావాలి. ఇరు వర్గాల మధ్య రాజకీయ ఒప్పందం కుదిరితే యుద్ధం ముగుస్తుంది.

మార్చి 10న నార్వే రాజధాని ఓస్లోలో అఫ్గన్‌ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పరస్పర నమ్మ కం కుదిరేలా తమ వద్ద ఉన్న బందీలను విడుదల చేయనున్నారు. ఐదువేల మంది తాలిబన్లను ప్రభుత్వం.. వెయ్యి మంది అఫ్గన్ సైనికులను తాలిబన్లు విడుదల చేయనున్నారు. శాంతి ఒప్పందం కుదిరిన రోజే తాలిబన్లు దేశవ్యాప్తంగా తమ సైనిక కార్యకలాపాలను నిలిపివేశారు.

11/9 దాడుల తర్వాత అఫ్గన్‌లోని తాలిబన్లపై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు, నాటో బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ యుద్ధం కోసం అగ్రరాజ్యం ఇప్పటివరకు లక్ష కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. దాదాపు 2,400 మంది అమెరికా సైనికులు, వేలాది మంది తాలిబన్లు, ఆఫ్ఘన్‌ సైనికులు, లక్షలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 25 లక్షల మంది శరణార్థులుగా మారగా, మరో 20 లక్షల మంది వివిధ ప్రాంతాలకు ప్రాణభయంతో వలస వెళ్లారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆఫ్ఘానిస్తాన్ లో శాంతి వెల్లివిరుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి