క్రికెట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వన్డే వరల్డ్ కప్ మహాసంగ్రామం ఆరంభానికి మరికొన్ని రోజులే మిగిలి ఉంది. ఈసారి కప్ ఎలాగైనా నెగ్గాలని అన్ని జట్లు కృతనిశ్చయంతో ఉన్నాయి. భారత్ వేదికగా జరిగే ఈ ప్రపంచ కప్ బహుశా 50 ఓవర్ల ఫార్మాట్లో చివరిదని అంటున్నారు. టీ20 క్రికెట్ హవా నడుస్తుండటం, వన్డేలకు ఆదరణ తగ్గుతుండటం.. నెక్స్ట్ ఫ్యూచర్ అంతా పొట్టి ఫార్మాట్దేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ప్రపంచ కప్ను కైవసం చేసుకోవాలని టాప్ టీమ్స్ సమాలోచనలు చేస్తున్నాయి. దాయాది పాకిస్థాన్ కూడా భారత గడ్డ మీద జరిగే మెగా టోర్నీలో విన్నర్గా నిలవాలని కోరుకుంటోంది. ఈ క్రమంలో భారత్కు వచ్చేందుకు సిద్ధమైన పాక్ జట్టుకు వీసా సమస్య ఎదురైన విషయం తెలిసిందే.
ఎట్టకేలకు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీసా సమస్య తీరింది. వరల్డ్ కప్ కోసం వచ్చే పాక్ టీమ్కు లైన్ క్లియర్ అయింది. ఆ జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి భారత వీసాలు మంజురైనట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్థారించింది. పాకిస్థాన్ బృందానికి వీసాలు ఇచ్చేందుకు ఇండియన్ గవర్నమెంట్ ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించింది. 48 గంటల్లో భారత్కు బయల్దేరాల్సి ఉన్నా తమ వీసాలు మంజూరు కాకపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై సోమవారం పాక్ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది.
పాక్ జట్టు వీసాల విషయంలో సోమవారం సాయంత్రానికి పరిస్థితి చక్కబడింది. ప్రపంచ కప్కు ముందు దుబాయ్లో రెండ్రోజుల పాటు తమ టీమ్కు ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని పీసీబీ ప్లాన్ చేసింది. అయితే వీసా సమస్య కారణంగా దీన్ని రద్దు చేసుకుంది. తాజా షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం లాహోర్ నుంచి బయల్దేరే పాకిస్థాన్ జట్టు దుబాయ్ మీదుగా సాయంత్రానికి నేరుగా హైదరాబాద్కు చేరుకుంటుంది. దాయాది జట్టు శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్తో తొలి వామప్ మ్యాచ్ ఆడనుంది.