iDreamPost

లంచంతో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికి.. నోట్లను తినేశాడు!

లంచంతో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికి.. నోట్లను తినేశాడు!

లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు చిక్కిన ఓ రెవెన్యూ అధికారి వింత పని చేశాడు. రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికినా కూడా తన అతి తెలివి ప్రదర్శించాడు. ఏకంగా లంచం తీసుకున్న నోట్లని నోట్లో వేసుకుని, నమిలి మింగేశాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లోని కత్నిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్య ప్రదేశ్‌లోని కత్నికి చెందిన పట్వారీ గజేంద్ర సింగ్‌ అక్కడి రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నాడు. గజేంద్ర లంచాలు తినడానికి బాగా రుచిమరిగాడు.

తన ఆఫీసుకు వచ్చే వారి దగ్గర ఇష్టం వచ్చినట్లు లంచం తీసుకునే వాడు. గజేంద్రపై లోకాయుక్త స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ టీంకు చాలా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఓ వ్యక్తిని మారు వేషంలో గజేంద్ర దగ్గరకు పంపారు. గజేంద్రను ఓ పని చేసి పెట్టమని ఆ మారు వేషంలో ఉన్న అధికారి అడిగాడు. పని చేసి పెట్టాలంటే 4500 రూపాయల డబ్బులు ఇవ్వాలని గజేంద్ర అన్నాడు. ఆ వచ్చిన వ్యక్తి గజేంద్ర అడిగిన మొత్తం ఇచ్చాడు. గజేంద్ర ఆ డబ్బుల్ని తీసుకుని, లెక్కపెట్టుకుంటున్న సమయంలో మిగిలిన అధికారులు అక్కడికి వచ్చారు.

దీంతో గజేంద్ర కంగుతిన్నాడు. ఆ వెంటనే తేరుకుని అతి తెలివిగా ఆలోచించాడు. ఆధారాలు నాశనం చేయటానికి లంచం డబ్బుల్ని నమిలి, మింగేశాడు. అయితే, అధికారులు అతడ్ని వదల్లేదు. ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. తర్వాత స్టేషన్‌కు తరలించారు. గజేంద్ర డబ్బుల్ని నోట్లో వేసుకుని నములుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి