iDreamPost

చంద్రబాబు వెనుకే నిమ్మగడ్డ.. ‘యూ టర్న్‌’

చంద్రబాబు వెనుకే నిమ్మగడ్డ.. ‘యూ టర్న్‌’

యూ టర్న్‌.. ఏపీ రాజకీయాల్లో ఈ పదం ఆపాదించుకునే పూర్తిస్థాయి అర్హతలు ఉన్న నాయకుడిగా చంద్రబాబును చెబుతుంటారు ఆయన ప్రత్యర్ధులు. దాదాపుగా చెప్పిన అన్ని మాటల్లోనూ రెండో మాట కూడా ఉండడంతో అప్పట్లో ఈ యూటర్న్‌కు పెద్దగానే పబ్లిసిటీ కల్పించేసారు. ఇప్పుడు చంద్రబాబు బాటలో ఆయన వెనుకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కూడా నడుస్తున్నారన్న సెటైర్‌లు సోషల్‌ మీడియా వేదికగా జోరుగానే విన్పిస్తున్నాయి.

రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్య్ర సంస్థే అయినప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ సహాయ, సహకారాలు ఎన్నికల నిర్వహణకు అవసరం ఉండకుండా ఉండదు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఈసీ వ్యవహరించనది భిన్న రీతిలో నిమ్మగడ్డ వ్యవహారం నడుస్తుందన్న ఆరోపణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన వ్యవహారశైలి కూడా ఉంటోంది.

ఎన్నికలు వాయిదా వేసే సమయానికి రాష్ట్రంలో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. కానీ నిమ్మగడ్డ పదివేల నుంచి 750కి కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు తగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు ఎన్నికలు పెట్టేయొచ్చంటూ అఫిడవిట్‌ సమర్పించడం చంద్రబాబుతో పాటు నిమ్మగడ్డ కూడా యూటర్న్‌ తీసుకుంటున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నప్పటికీ ఎన్నికలు రద్దు నాటికంటే ఎక్కువ కేసులే నమోదవుతున్నాయి కదా? అని అధికార పక్షం అడుగుతున్న ప్రశ్నకు నిమ్మగడ్డ నుంచి సమాధానం మాత్రం రావడం లేదంటున్నారు. అంతే కాకుండా మధ్యలో వదిలేసిన స్థానిక సంస్థల ఎన్నికలను పక్కన పెట్టేసి పంచాయతీ ఎన్నికలంటో మరో కొత్తపల్లవిని నిమ్మగడ్డ తెరపైకి తీసుకురావడంతో యూటర్న్‌ను నిమ్మగడ్డకు కూడా ఖరారు చేసేస్తూ సోషల్‌ మీడియాలో విసుర్లు జోరుగానే విన్పిస్తున్నాయి.

బహిరంగంగానే ఒకరికొకరు తోడుగా చంద్రబాబు, నిమ్మగడ్డలు కలిసే యూటర్న్‌ తీసుకుంటున్నారంటున్నారు. సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరమే కల్పిస్తే.. అప్పుడెందుకు నిలిపివేసారు? ఇప్పుడెందుకు పెడతానంటున్నారు? అన్న ప్రశ్నలకు అసలు నిమ్మగడ్డ నుంచి సమాధానం వస్తుందా? అన్న సందేహం కూడా లేకపోలేదు. ప్రతిపక్షాలు చేయాల్సిన పనిని రాజ్యాంగ వ్యవస్థలో ఉండి తానే చేసేస్తున్నాడని నిమ్మగడ్డను మంత్రి కొడాలి నాని వంటివారు దుమ్మెత్తిపోసేస్తున్నారు. అయినప్పటికీ తనధోరణి తనదేనన్న రీతిలో నిమ్మగడ్డ వ్యవహారం సాగిపోతోంది. ఏతా వాతా చెప్పొచ్చేదేంటంటే యూ టర్న్‌ను ఇప్పుడు ఒక్క చంద్రబాబకే ఆపాదిస్తే నిమ్మగడ్డ ఊరుకునే అవకాశమే లేదంటున్నారు. మరి దీనిపైనైనా నిమ్మగడ్డ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి