iDreamPost

ఆ రూ. 50 కోట్లు పర్యావరణ పునరుద్ధరణ, పరిహారానికి వాడాలి: ఎల్జీ పాలిమర్స్ కేసులో ఎన్జీటి కీలక ఆదేశాలు

ఆ రూ. 50 కోట్లు పర్యావరణ పునరుద్ధరణ, పరిహారానికి వాడాలి: ఎల్జీ పాలిమర్స్ కేసులో ఎన్జీటి కీలక ఆదేశాలు

ఎల్జీ పాలిమర్స్ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) కీలక ఆదేశాలు ఇచ్చింది. చట్టబద్ధ అనుమతి లేకుండా ఎల్జీ పాలిమర్స్‌ మళ్లీ ప్రారంభం కాకూడదని, చట్టబద్ధ అనుమతి వచ్చాక ప్రారంభించేందుకు మేమే అనుమతి ఇస్తామని తెలిపింది. ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ డిపాజిట్‌ చేసిన రూ.50 కోట్లను పర్యావరణ పునరుద్ధరణ, పరిహారానికి వాడాలని ఎన్జీటీ ఆదేశించింది. ఎల్జీ పాలిమర్స్‌ కేసుకు సంబంధించి ఎన్జీటీ లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు పర్యావరణ పునరుద్ధరణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. కేంద్ర పర్యావరణ శాఖ, పిసిబి నుంచి ఒక్కొక్కరు, విశాఖ కలెక్టర్‌తో కమిటీ ఏర్పాటు చేయాలని.. రెండు నెలల్లోగా కమిటీ పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కమిటీకి కేంద్ర పర్యావరణ శాఖ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించాలని సూచించింది.

బాధితులకు పరిహారం ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించేందుకుగానూ మరో కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. రెండు వారాల్లో కమిటీని ఏర్పాటు చేసి రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది.

లాక్‌డౌన్ తర్వాత అనుమతి లేకుండా పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు బాధ్యులైన వారిని గుర్తించి ఏపి సిఎస్‌ చర్యలు తీసుకోవాలని సూచించింది. తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను రెండు నెలల్లోగా ఇవ్వాలని ఆదేశించింది.

ఇలాంటి ప్లాంట్లలో పర్యావరణ నిబంధనల తనిఖీకి నిపుణుల కమిటీ వేయాలని, ఆ కమిటీ తనిఖీలు చేసి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సుమోటోగా కేసు స్వీకరించే అధికారం ఎన్జీటికి ఉందని, పర్యావరణానికి హాని కలిగినప్పుడు మౌనంగా కూర్చోలేమని ఎన్జీటి తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి