Idream media
Idream media
విప్లవాత్మక పథకాలతో నేరుగా నగదు బదిలీ చేస్తూ పేద, మధ్యతరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను మార్చిన జగన్ సర్కార్ మరో కీలక పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు బీమా భరోసా కల్పించేందుకు నిర్ణయించింది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఏ విధంగానైనా మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండేందుకు వైఎస్సార్ బీమా పథకాన్ని రూపాందించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా జారీ చేసింది.
రాష్ట్రంలో రేషన్కార్డు ఉన్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించింది. రాష్ట్రంలో 1.50 కోట్ల రేషన్కార్డు ఉన్న కుటుంబాలున్నాయి. వీరందరికీ బీమా సౌకర్యం కల్పించనుంది. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఆయా కుటుంబాల వివరాలు సేకరించి ఈ పథకం అమలు చేయనుంది. 18 – 70 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ఈ పథకం వర్తించనుంది. 18–50 ఏళ్ల వారు ప్రమాదవశాత్తు మరణిస్తే లేదా శాశ్వత అంగవైకల్యం పొందితే ఐదు లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. సహజంగా మరణిస్తే రెండు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందిస్తారు. 51–70 ఏళ్ల వారు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం సంభవించినా మూడు లక్షల రూపాయలు ఆ వ్యక్తి కుటుంబానికి అందించనున్నారు. కుటుంబానికి ఆధారమైన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ బీమా పథకం వర్తింపజేయనున్నారు.
గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజలకు బీమా పథకం వర్తింజేశాయి. అయితే ఈ పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవడంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా ఇందుకు అయ్యే ఖర్చును భరించాలని నిర్ణయించింది. బీమా వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఓ భరోసా వస్తుందని జగన్సర్కార్ యోచిస్తోంది.