iDreamPost
android-app
ios-app

జగనన్న బాణం అంటూ షర్మిళ చేసిన సాహసోపేత పాదయాత్రకు 8ఏళ్ళు

  • Published Oct 18, 2020 | 3:02 PM Updated Updated Oct 18, 2020 | 3:02 PM
జగనన్న బాణం అంటూ షర్మిళ చేసిన సాహసోపేత పాదయాత్రకు 8ఏళ్ళు

వైఎస్‌ షర్మిల, ఈ రాష్ట్రంలో పరిచయం అవసరం లేని పేరు. మహానేత వైయస్సార్ కూతురిగా , సీఎం జగన్ చెల్లెలుగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కష్ట సమయాల్లో అండగా నిలబడి జవసత్వాలు నింపిన ఉక్కు మహిళ గా పేరు సంపాదించిన మహానేత తనయ. తండ్రి మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిన ప్రజా సంక్షేమాన్ని ప్రశ్నిస్తూ, అలాగే తమ కుటుంబం పై నాటి ప్రతిపక్షం , అధికారపక్షం కలిసి చేస్తున్న కుట్రలని నిలదీస్తూ ఆమె 2012 లో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగించిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు నేటితో 8ఏళ్ళు.

వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు అడుగులకు మడుగులెత్తిన వారే ఆయన మరణానంతరం తమ కుటుంబం పై కుట్రలకు తెరలేపారు. రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న తమ కుటుంబ పెద్దను పోగొట్టుకుని పుట్టెడు దుఖంలో ఉండి కూడా తన తండ్రి మరణ వార్త విని గుండె పగిలి అసువులు బాసిన వారి కుటుంబ సభ్యులని పరామర్శించి తమకు అండగా ఉంటామని ఒక నైతిక బరోసా ఇచ్చేందుకు ప్రారంభించిన జగన్ ఓదార్పు యాత్ర పై మొదలైన కుట్రలు చివరికి మహానేత కుటుంబంలో చిచ్చు పెట్టే వరకు వెళ్ళాయి. అయితే ఈ పరిణామాలతో తీవ్ర మనోవేదన చెందిన జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి 2011 మార్చ్ 12న ఇడుపులపాయలో మహానేత సమాది సాక్షిగా సొంతంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు.

మహానేత తనయుడుగా జగన్ పెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టికి తొలి ఉప ఎన్నికల్లోనే ప్రజల నుండి వచ్చిన ఆదరణను చూసి సహించలేని నాటి కాంగ్రెస్ పెద్దలు తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా దివంగతులైన మహానేత వైయస్సార్ పేరును కుట్రపూరితoగా ఎఫ్ఐఆర్ లో చేర్చడంతో ఆయనను అభిమానించే 17 మంది కాంగ్రెస్ శాసన సభ్యులు ఒక పార్లమెంట్ సభ్యుడు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. అయితే ఉప ఎన్నికల్లో జగన్ ను కట్టడి చేసి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధులను ఓడించగలిగితే ఇక రాష్ట్రంలో ఆ పార్టీ ఉండదనే దుర్భుద్దితో సరిగ్గా ఎన్నికలకు 15 రోజుల ముందు విచారణ పేరుతో జగన్ ను పిలిచి అరెస్టు చేసి కాంగ్రెస్ తన నియతృత్వ పోకడను బయట పెట్టుకుంది.

ఈ పరిణామాల నేపధ్యంలో అన్న ఆదేశాల మేరకు రాజకీయ అడుగులు వేసిన షర్మిళ ఉప ఎన్నికల్లో ప్రచార భాద్యతలు చేపట్టి 17 నియోజక వర్గాలులో దాదాపు 10వేల కిలోమీటర్లు బస్సులో తిరుగుతూ అభ్యర్ధుల తరుపున ప్రచారం చేసి అత్యంత కష్ట సమయంలో పార్టీకి అండగా ఉండి అభ్యర్ధుల ఘన విజయానికి దోహదపడ్డారు. ఆ తరువాత 90 రోజుల్లో రావాల్సిన బెయిల్ జగన్ కు రాకపోవడం మరో పక్క ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం , అధికార పక్షంగా ఉన్న కాంగ్రెస్ ప్రజా సమస్యలను గాలికి వదిలి మూకుమ్మడిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసేందుకు కుట్రలు తీవ్రతరం చేయడంతో జగన్ ఆదేశాల మేరకు అధికార ప్రతిపక్షాల కుట్రలను ఎండగడుతూ , తన తండ్రి ప్రారంభించిన ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మంగళం పాడిన కాంగ్రెస్ ని ప్రజల పక్షాన్న ఉండి ప్రశ్నిస్తూ షర్మిళ చేసిన పాదయాత్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయాణంలో ఒక మైలు రాయిగా చెప్పుకోవచ్చు.

2012 అక్టోబర్ 18న ఇడుపులపాయలో జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రారంభం అయిన షర్మిల పాదయాత్ర మహానేత వైయస్సార్ చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్రను తలపించేలా దగ్గర దగ్గర 10 నెలల పాటు 3112 కిలోమీటర్లు కొనసాగి 2013న ఆగస్టు 4న ముగిసింది. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 14 జిల్లాలు, 116 నియోజకవర్గాల గుండా 230 రోజుల పాటు ఒక మహిళగా తాను చేసిన పాదయాత్ర దేశ చరిత్రలోనే తొలిసారి అవడం గమనార్హం. నాడు వైయస్సార్ , ఆతరువాత షర్మిల , తదనంతరం వైయస్ జగన్ ఒకే కుటుంబం నుండి ముగ్గురు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కుంటూ రాష్ట్ర ప్రజల హృదయాలు గెలుచుకునేలా పాదయాత్రలు చేయడం ఆ తరువాత ప్రజా మద్దతుతో విజయతీరాలను అందుకోవడం రాష్ట్ర ప్రజలతో ఆ కుటుంబానికి ఉన్న ప్రత్యేక అనుభందంగా చూడొచ్చు .