iDreamPost
iDreamPost
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేస్తున్న పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రవేశ పెట్టిన ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాయాలు, వలంటీర్, రేషన్ పంపిణీ వ్యవస్థ వంటి విప్లవాత్మక కార్యక్రమాలపై అధ్యయనం చేసేందుకు పలు రాష్ట్రాల నుంచి అధికారుల బృందాలు రావడం గమనార్హం.
కేరళ మంత్రి ప్రశంసలు..
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న రేషన్ డోర్ డెలివరీ విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కేరళ పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్ మెచ్చుకున్నారు. కేరళలో ఈ విధానాన్ని ప్రవేశ పెట్టే ఆలోచనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ విధంగా ఇంటింటికీ రేషన్ పంపిణీ దేశంలో ఏ రాష్ట్రంలో జరగడం లేదని అన్నారు. బియ్యం పంపిణీ వ్యవస్థ, ధాన్యం సేకరణ, అర్హుల ఎంపిక, క్వాలిటీ కంట్రోల్,మార్క్ఫెడ్, ఆర్బీకేల పనితీరును ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన బాగుందని, సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందించడం గొప్ప ఆలోచన అని అన్నారు.
వలంటీర్ వ్యవస్థకు అప్పట్లో ..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వలంటీర్ వ్యవస్థ కరోనా కష్టకాలంలో దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది. కరోనా రోగులను గుర్తించడానికి ఇంటింటికీ వెళ్లి సర్వే చేయడం, ఏఎన్ఎంలతో కలిసి వైద్య సేవలు అందించడం, హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి నిత్యావసర వస్తువులు అందించడం దేశం దృష్టిని ఆకర్షించాయి. కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలకు బంధువులే ముందుకు రాని వేళ ఆ బాధ్యతను కూడా నిర్వహించి వలంటీర్ లు మానవత్వం చాటుకున్న ఉదంతాలు కోకోల్లలు.
Also Read : Jagan Launches 3 Scheme Today – నేడు అన్నదాతలకు పండగ.. ఒకే రోజు మూడు పథకాల లభ్ది
ఆర్బీకేలకు జాతీయ స్థాయిలో..
గతంలో రైతు భరోసా కేంద్రాలు పనితీరుకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. ఈ ఆలోచన వినూత్నంగా ఉందని పలువురు వ్యవసాయ రంగ నిపుణులు మెచ్చుకున్నారు. వీటి పనితీరును అధ్యయనం చేసేందుకు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ)తో పాటు నీతి ఆయోగ్ కూడా ఆసక్తి కనబరిచింది. ఇటీవల వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఢిల్లీ వెళ్లి ఆ సంస్థల అధికారుల ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్బీకేల ఆలోచన అద్భుతం అని, వీటిని జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు లోతైన చర్చ, అధ్యయనం అవసరం అని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. ఆర్బీకేల పనితీరుపై ఐక్యరాజ్యసమితికి నివేదిస్తామని ఎఫ్ఏఓ భారత ప్రతినిధి తోమియో షిచిరీ చెప్పారు. విత్తు నుంచి విపణి వరకు రైతులకు సాగు సాయం అందించేలా ఈ విధానాన్ని రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం..
ముఖ్యమంత్రి మానస పుత్రికలయిన సచివాలయ, వలంటీర్, ఇంటికే రేషన్ పంపిణీ వ్యవస్థలు ఇలా పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రతిపక్షం విమర్శలు పట్టించుకోకుండా ముందు చూపుతో పలు పథకాలను ప్రవేశపెట్టి జనహితమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నందునే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందనడంలో అతిశయోక్తి లేదు.
Also Read : YS Jagan – ఇన్నాళ్ళూ ఒక లెక్క.. ఇకపై మరో లెక్క