iDreamPost
android-app
ios-app

YS Jagan – అవ్వాతాతలకు నూతన సంవత్సర కానుక

  • Published Jan 01, 2022 | 6:39 AM Updated Updated Jan 01, 2022 | 6:39 AM
YS Jagan – అవ్వాతాతలకు నూతన సంవత్సర కానుక

పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారం, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పెంచిన వైఎస్సార్ పింఛన్ కానుక శనివారం నుంచి పంపిణీ చేయనున్నారు. దీన్ని తమకు నూతన సంవత్సర కానుకగా సీఎం జగన్ అందిస్తున్నట్టు అవ్వాతాతలు భావిస్తున్నారు.

నేటి మధ్యాహ్నం నుంచి పంపిణీ

2021 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి నెలా ఒకటవ తేదీ తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతోంది. అయితే నేటి నుంచి పింఛన్‌ మొత్తం రూ.2,500కు పెరిగిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో సీఎం లాంఛనంగా ప్రారంభించిన అనంతరం అన్ని చోట్ల 11.30 గంటల తర్వాత వలంటీర్లు పంపిణీ మొదలు పెడతారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

టీడీపీ హయాంలో ఇలా..

గత ప్రభుత్వంలో ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు నెలల ముందు వరకూ రూ.1000 చొప్పున పింఛన్‌ పంపిణీ జరిగింది. అప్పట్లో అర్హత ఉన్న వారికి పింఛను మంజూరుకు జన్మభూమి కమిటీలు తీవ్ర ఇబ్బందులు పెట్టేవి. మంజూరు అయిన పింఛను డబ్బులు ప్రతి నెలా తీసుకోవడానికి నడవలేని స్థితిలో ఉండే అవ్వాతాతలు కూడా గంటల తరబడి ఆఫీసుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండేది.

ఇప్పుడు పింఛను లబ్ధిదారులెవరూ ఇంటి నుంచి కాలు కదపాల్సిన అవసరం లేదు. వలంటీర్లే ప్రతి నెలా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేస్తున్నారు. డోర్‌ డెలివరీ పద్ధతిలో పెన్షన్లు అందించడం అన్నది దేశంలోనే తొలిసారి. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ల పంపిణీకి రూ.1,570 కోట్లు ఖర్చు చేస్తోంది. 62 లక్షల మంది లభ్ది పొందుతున్నారు.

గత తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు చేసింది. కేవలం రూ.400 కోట్లు మాత్రమే. 39 లక్షల మంది మాత్రమే లభ్ది పొందేవారు. అప్పటి ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీకి ఏడాది మొత్తం వ్యయం రూ.5,500 కోట్లే.

ఒకే ఏడాదిలో ఏకంగా 23 లక్షల మందికి..

ఆసరా కోరుకునే వారికి సామాజిక భద్రత కల్పించే పింఛన్ల అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చూపించే ఉదారతను ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉదహరించాల్సిందే. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అప్పట్లో రూ.75గా ఉండే పింఛన్‌ను 2006 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి రూ.200కు పెంచారు. 2008లో ఒకే ఏడాదిలో ఏకంగా 23 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. అప్పట్లో ఇదే విషయాన్ని కాగ్‌ రిపోర్టు సైతం పేర్కొంది. కొత్తగా పింఛన్ల మంజూరులో, లబ్ధిదారుల ఇబ్బందుల పరిష్కారం విషయంలో అప్పటి రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉదారత చూపిస్తే, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కూడా అదే తరహాలో మేలు చేస్తోంది. 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు రెండేళ్లలో 18,44,812 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ప్రతి నెలా పింఛన్ల పంపిణీకి రూ.1,570 కోట్లకు పైనే వెచ్చిస్తూ.. ఏటా రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.45 వేల కోట్లు అని అధికార వర్గాలు తెలిపాయి.

లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత

అర్హత ఉన్న అందరికీ పింఛన్‌ అందించాలన్న లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికలోనూ అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేస్తోంది. రాజకీయ జోక్యానికి, ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి తావులేని విధానం ప్రవేశ పెట్టింది. కులం, మతం, వర్గం చూడకుండా అర్హులను ఎంపిక చేస్తోంది. సామాజిక తనిఖీ కోసం జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. అర్హత ఉంటే దరఖాస్తు చేసుకున్న 21 రోజులకే మంజూరు ప్రక్రియ పూర్తి కావాలన్న నిబంధన తీసుకొచ్చారు. ఒకవేళ దరఖాస్తు తిరస్కరించినా.. మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.