మాట మాట్లాడితే 40ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఈ పెద్దమనిషి నోరు విప్పితే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు..అసలు ఈ పెద్దమనిషి కి బుద్ది…జ్ఞానం ఉందా అని ప్రతి పక్ష నేత చంద్రబాబు పై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. గురువారం అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఇంగ్లీష్ మాధ్యమంపై చర్చ సందర్భగా చంద్రబాబు మాట్లాడుతూ తాము ఇంగ్లీష్ కు ఎప్పుడు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 2017లో టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఇంగ్లీష్ ను ప్రమోట్ చేయడానికి లండన్ బ్రిటిష్ కౌన్సిల్ తో MOU చేసుకున్నామని, తద్వారా 1.8 లక్షల మందికి ఇంగ్లీష్ పై శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. అయితే అప్పట్లో ఈ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు తమ పిల్లలు, కుటుంబ సభ్యులు ఇంగ్లీష్ మీడియంలో లేరా అని ప్రశ్నించారు. గతంలో మేము చేసిన దాన్నే జగన్ కొనసాగిస్తున్నాడని అన్నారు. తాము ఇంగ్లీష్ కు వ్యతిరేకం కాదని, అయితే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మీడియం పై ఆప్షన్ ఇవ్వాలని మాత్రమే డిమాండ్ చేసున్నామని అన్నారు. అయితే వైఎస్సార్సీపీ సభ్యులు మాత్రం వారు ఒక్కరే ఇంగ్లీష్ ను ప్రేమిస్తున్నట్లు చెపుతున్నారని ఆరోపించారు. అంతే కాదు అధ్యక్షా ఇంగ్లీష్ ను కనిపెట్టింది కూడా జగన్ అనేలా కలరింగ్ ఇస్తున్నారని అన్నారు. గతంలో సాక్షిలో మాతృ భాషను చంపేస్తున్నారు అని కథనాలు కూడా వచ్చాయన్నారు. పైగా మాట్లాడితే మీకు ఎంత మంది భార్యలు అని హేళన చేస్తారని అన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన సీఎం జగన్ చంద్రబాబు కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ పెద్దమనిషికి అసలు బుద్ది…జ్ఞానం ఉందా…ఏం మాట్లాడుతున్నాడు…జగన్ అనే వ్యక్తి ఏ రోజైనా ఇంగ్లీష్ మీడియం ను వ్యతిరేకించినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. వారు ప్రభుత్వంలో ఉన్నపుడు 40 వేల ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడానికి చేత కాక ఇప్పుడు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో చంద్రబాబు నారాయణ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల బలోపేతానికి కృషి చేశారు కానీ ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి, ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడానికి కృషి చేసిన పాపాన పోలేదని అన్నారు. మాట్లాడితే 40ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు. ఎందుకయ్యా నీ 40 ఏళ్ల అనుభవం, సిగ్గుతో తలదించుకోవాలని చురకలంటించారు. ఈ సంద్భంగా చంద్రబాబు సాక్షి కథనాన్ని చూపించే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా సీఎం జగన్ చంద్రబాబు పై మండి పడ్డారు.
మాట్లాడితే గతంలో సాక్షిలో వచ్చిన కథనాలను పరిగణలోకి తీసుకుని అసెంబ్లీలో చర్చ జరగాలని చంద్రబాబు అంటారు. చంద్రబాబు కి బుద్ది…జ్ఞానం ఉంటే ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయరని అన్నారు. అలా అయితే గతం లో ఈనాడు లో వచ్చిన కథనాలపై చర్చ పెడితే ఈ అసెంబ్లీ సమావేశాలు సరిపోవని, చర్చలు జరుగుతూనే ఉంటాయి అని మండి పడ్డారు. దీంతో టీడీపీ సభ్యులు చంద్రబాబు తో జతకలసి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అదే స్థాయిలో వైఎస్సార్సీపీ సభ్యులు కూడా కేకలు వేయడం తో సభలో కాస్త గందర గోళం నెలకొంది. అయితే చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు సీఎం జగన్ వైపు సీరియస్ గా చూడడంతో…ఏ ఉరిమి చూస్తున్నారు…ఏమి చెప్పండీ అంటూ సీఎం జగన్ వారిపై ఒకింత అగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై మంత్రి ఆదిములం సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, గతంలో బ్రిటిష్ కౌన్సిల్ తో ఒప్పందం చేసుకుని కేవలం 30 వేల మందికి మాత్రమే శిక్షణ ఇచ్చి..ఇప్పుడు లక్ష మందికి శిక్షణ ఇచ్చామని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ ఆంశం పై విచారణకు ఆదేశిస్తున్నామని అన్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉంటే విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు.