iDreamPost
iDreamPost
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు అన్ని సామాజిక వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోంది. ప్రధానంగా ఎన్నికలకు ముందు ప్రకటించిన నవరత్నాలను నిర్దేశిత వర్గాల ప్రజలకు అందజేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఈ పథకాల్లో కొన్ని ఆయా సామాజిక వర్గాలకు ప్రత్యేకించినవి కాగా.. మరికొన్ని అన్నివర్గాలకు మేలు చేస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ ప్రభుత్వం ఏ వర్గానికి ఎన్ని పథకాలు అమలు చేస్తోంది..
ఆర్థికంగా ఎంత ప్రయోజనం చేకూరుస్తోందన్న వివరాలతో ప్రచారం చేసుకోవడం సహజం. గత టీడీపీ ప్రభుత్వం పథకాలు ప్రకటించినా అమలు చేయకుండానే ప్రచార ఆర్భాటాలకు కోట్లాది రూపాయలు వెదజల్లింది. కానీ ప్రస్తుత జగన్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా పథకాలు అమలు చేస్తోంది.. వాటినే ప్రచారం చేసుకుంటోంది. దీన్ని సహించలేని టీడీపీ నేతలు, వారికి డప్పు కొట్టే పచ్చ పత్రికలు ఇందులో రంధ్రాన్వేషణ చేస్తున్నాయి. కామన్ గా ఇచ్చినవి.. ఆయా వర్గాలకు ప్రత్యేకంగా ఇచ్చినవి కలిపి చెప్పడం ఘోర తప్పిదమన్నట్లు ప్రచారం చేస్తున్నాయి.
కలిపినంత మాత్రాన మేలు కాకుండా పోతుందా..
వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా రెండో ఏడాదీ మాట తప్పకుండా కాపునేస్తం పథకం కింద ఒక్కో మహిళ అకౌంట్లోకి రూ.15వేలు చొప్పున రూ.490 కోట్లు జమ చేసింది. ఈ సందర్బంగా రెండేళ్లలోనే హామీ ఇచ్చిన దానికంటే అధికంగా కాపు సామాజికవర్గానికి రూ.12,126 కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం పథకాలు, గణాంకాలతో సహా ప్రకటించింది. కానీ పచ్చ మీడియా కేవలం కాపు నేస్తం పథకాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకొని రూ.981 కోట్లే ఇచ్చి రూ.12,126 కోట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.కాపు నేస్తమే కాకుండా.. ఇంకా చాలా పథకాల కింద ఈ సామాజికవర్గానికి చేకూర్చిన లబ్ధిని లెక్కలోకి తీసుకోకూడదని వితండవాదం చేస్తున్నారు. అన్ని వర్గాలకు కామన్ గా అమలు చేస్తున్న పథకాల ద్వారా లబ్ది పొందుతున్న వారిలో కాపు సామాజిక వర్గీయులు గణనీయ సంఖ్యలోనే ఉన్నారు. అటువంటప్పుడు ఆ లబ్ధిని ఎందుకు పరిగణనలోకి తీసుకోకూడదో చెప్పడంలేదు.
కామన్ పథకాలు అయినంత మాత్రాన కాపులు లబ్ది పొందలేదా ?.. లబ్ది పొందినప్పుడు.. కోట్ల రూపాయల ప్రయోజనం అందినప్పుడు దాన్ని లెక్కలోకి తీసుకోకుండా ఎలా ఉంటారు?.. ఇదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చింది పిసరంత.. ప్రచారం కొండంత అన్నట్లు ఉండేది. అంతెందుకు కాపు ఉద్యమాన్ని చల్లార్చేందుకు అప్పట్లో చంద్రబాబు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఏటా రూ. 1000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఐదేళ్లలో రెండు వేల కోట్లకు మించి ఇవ్వలేదు. దాని పరిధిలో అమలు చేసిన ఉపాధి పథకాలను కేవలం టీడీపీ కార్యకర్తలకే మంజూరు చేశారన్నది వాస్తవం. కానీ జగన్ సర్కారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తోంది. కాపులకు ప్రత్యేకించిన పథకాలతో పాటు.. కామన్ పథకాల్లో రాజకీయ వివక్ష లేకుండా అర్హులందరికీ అందిస్తోంది. ఇంత చేస్తున్న ప్రభుత్వం.. వాటిని ప్రచారం చేసుకుంటే తప్పేముందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఆ పథకాలు టీడీపీ హయాంలో ఎక్కడున్నాయి?
కాపులకు మేలు చేసినట్లు ప్రభుత్వం చూపిన పథకాల్లో చాలావరకు టీడీపీ హయాంలో అమలు చేసినవేనని పచ్చ మీడియా భుజాన వేసుకొని మోస్తోంది. నవరత్నాల పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో సరికొత్త పథకాలను ఈ రెండేళ్లలో అమల్లోకి తెచ్చింది. రైతు భరోసా, కాపు నేస్తం, అమ్మ ఒడి, ఆసరా, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, విదేశీ విద్యా దీవెన, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీకి పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, వాహన మిత్ర, వైఎస్సార్ బీమా, జగనన్న చేదోడు, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ, సంపూర్ణ పశుపోషణ, గోరుముద్ద తదితర పథకాలకు ఆర్థిక సంక్షోభంలోనూ నిధులు ఇస్తోంది. వీటిలో చాలావరకు టీడీపీ హయాంలో లేని కొత్త పథకాలే. ఒకటీ ఆరా ఉన్నాయనుకున్నా వాటి ప్రయోజనాలను పెంచేలా ఉన్నతీకరించి జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది.
అమలు చేస్తున్న వాటి గురించే ప్రభుత్వం చెబుతోంది తప్ప నాటి టీడీపీ ప్రభుత్వం మాదిరిగా నిధులివ్వని, అసలు లేని పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పుకోవడం లేదు. ఈ పథకాల ద్వారా ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక ప్రభుత్వ ప్రకటనలపై రంధ్రాన్వేషణ చేస్తూ చిన్న విషయాలను భూతద్దంలో చూపిస్తూ యాగీ చేసినంత మాత్రాన పథకాల వల్ల లబ్ది పొందినవారి మనసుల నుంచి వాటిని తొలగించలేరన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.