iDreamPost
android-app
ios-app

పనబాక… తికమక!

పనబాక… తికమక!

గుర్రాన్ని చెరువు వరకు తీసుకువెళ్ళగలం కానీ… నీళ్లు తాగించలేం అనేది సామెత. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిపోతున్న పనబాక లక్ష్మి విషయంలో ఇదే గుర్తొస్తోంది. మొదటి నుంచి పోటీకి అయిష్టత గానే ఉన్న ఆమె ప్రస్తుతం ఎన్నికల సన్నద్ధత పార్టీ కార్యకలాపాలకు విషయంలోనూ దూరంగా ఉంటున్నారు. కనీసం తిరుపతి లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని టీడీపీ ఇన్చార్జి లను సైతం… ఆమె సమావేశం అవ్వడం, కలవడం లేదా కనీసం ఫోన్లో అయిన మాట్లాడ్డం ఇప్పటివరకు జరగలేదు. దీంతో ఉప ఎన్నికల నోటిఫికేషన్కు సమయం దగ్గర పడుతున్న కొద్ది తెలుగు తమ్ముళ్లలో కొత్త రకమైన భయం బయలుదేరింది. అసలు పనబాక లక్ష్మి పార్టీ వ్యవహారాల్లో సైతం అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తుండడం, మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ పెడుతూ తిరుపతి ఉప ఎన్నికల్లో గెలవాలని సూచనలు చేయడం చూస్తూ చిత్తూరు జిల్లా టిడిపి నేతలు ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు.

వస్తారా ఉంటారా?

పనబాక లక్ష్మీ పార్టీ మార్పు మీద గతంలో ఊహాగానాలు చెలరేగాయి. ఆమె పార్టీ మారతారని బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. దాని తర్వాత టిడిపి నాయకులు నెల్లూరుకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పనబాక ఇంటికి వెళ్లి మరి మంతనాలు చేసి ఎంపీ అభ్యర్ధిగా పనబాక లక్ష్మి బరిలో నిలిచేలా చూశారు. దాని తర్వాత సైతం ఆమె అంత పోటీకి సిద్ధంగా లేనట్లు తెలియడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకు ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంట్లో శుభకార్యం ఉంది కాబట్టి కాస్త దూరంగా ఉంటామని, పోటీ చేయాలని ఆసక్తి లేదని, కొన్ని రోజులపాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటామని అప్పట్లో పనబాక లక్ష్మి చెప్పారు. దీంతో చంద్రబాబు సైతం చేయగలిగింది ఏమి లేక అప్పటివరకూ ఆగారు.

ఇంట్లో శుభాకార్యం అయిన స్పందన ఏది?

డిసెంబర్లో పనబాక దంపతుల ఇంట్లో శుభకార్యం పూర్తయింది. కూతురికి వివాహం జరిపించారు. దాని తర్వాత పార్టీ కార్యకలాపాల్లో ఎన్నికల సన్నద్ధతలో పూర్తిగా దృష్టి పెడతారని అనుకున్నా పనబాక లక్ష్మీ తర్వాత సైతం అంతా ఆసక్తిగా లేకపోవడంతో మళ్లీ టిడిపి పార్టీలో తిరుపతి అభ్యర్ధి మార్పు మీద ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీంతో పాటు ఎప్పటికప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఈ విషయంలో నెల్లూరు జిల్లా నాయకులతో టచ్ లో ఉండి ఫాలోఅప్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది అన్నది ఆయన ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న ఇప్పటికీ పనబాక దంపతుల చర్యల్లో మార్పు మాత్రం లేదు.

ఇప్పటి వరకూ టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ సమావేశాలు పెట్టడం తప్పితే… తిరుపతి నియోజకవర్గ టిడిపి నాయకులు ఎవరూ కనీసం సమావేశం కూడా కాని పరిస్థితి ఉంది. అభ్యర్థిగా బరిలో ఉండాల్సిన పనబాక లక్ష్మి దీనికి పూర్తిగా సమ సిద్ధంగా లేకపోవడంతో పాటు, పోటీ పైన అయిష్టత చూపుతున్నారని ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. దీంతోనే పార్టీ సమావేశాలు ఇప్పటివరకు నిర్వహించలేదని, ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఏదో తూతూ మంత్రంగానే ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే సగటు టిడిపి కార్యకర్తలు మాత్రం తిరుపతి లోక్సభ పరిధిలో ఏం జరుగుతుందో… పార్టీ కార్యక్రమాలు ఎందుకు స్తంభించిపోయాయి అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.