iDreamPost
android-app
ios-app

ఎన్టీఆర్ పేరు పెడితే థ్యాంక్స్ కూడ చెప్పరా బాబు?

  • Published Jan 27, 2022 | 1:10 PM Updated Updated Mar 11, 2022 | 10:21 PM
ఎన్టీఆర్ పేరు పెడితే థ్యాంక్స్  కూడ చెప్పరా బాబు?

ఎన్టీఆర్ …….

తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడిగా , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయనకి భారతరత్న ఇవ్వాలని సుదీర్ఘకాలంగా చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ వస్తోంది . ఎన్టీఆర్ కి ఆ గౌరవం కల్పించే విషయంలో చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదని , తనకు అధికారం లేనప్పుడు సానుభూతి కోసం , అధికారంలోకి రావటానికి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎన్టీఆర్ పేరు వాడుకొని ఇలాంటి డిమాండ్స్ చేయటమే తప్ప నిజానికి ఎన్టీఆర్ కు అలాంటి అరుదైన గౌరవప్రపత్తులు దక్కడం బాబుకి సుతారమూ ఇష్టం లేదని దివంగత ఎన్టీఆర్ అభిమానులు , శ్రేయోభిలాషుల బలమైన అభిప్రాయం . గతంలోకి చూస్తే ఇందుకు చాలా దృష్టాంతాలు కనపడతాయి .

ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ని టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు , నందమూరి కుటుంబసభ్యుల అండతో పదవీచ్యుతుణ్ణి చేసి అధికారం లాక్కున్న బాబు అందుకు చెప్పుకొన్న కారణాలు ఏవైనా వెన్నుపోటు దారుడిగా చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు . అంతటితో ఆగక తెలుగుదేశం పార్టీ గుర్తుని , ఆస్తుల్ని , బ్యాంకు ఖాతాల్ని కోర్టు ద్వారా ఎన్టీఆర్ కి చెందకుండా తాను స్వాధీనం చేసుకొన్న రోజు తీవ్ర క్షోభకి గురై మరణించడంతో బాబు అధికారం పదిలమైనా ఆయన చావుకు కారణమయ్యాడన్న అపప్రధ మూట గట్టుకున్నాడు .

ఈ ఘటనల తర్వాత 1999 ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ పేరు వాడుకున్న బాబు అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ పేరు ఎక్కడా కనపడకూడదు టీడీపీ అంటే తన పేరు మాత్రమే వినబడాలన్న కృత నిశ్చయానికి వచ్చాడని నాడు పలు వార్తలొచ్చాయి . ఇందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్టీఆర్ చిత్రపటం తీసి బాబు చిత్రపటాలు పెట్టించడం జరిగింది , టీడీపీ పార్టీ కార్యక్రమాల గురించి వివరిస్తూ పార్టీ అంతర్గతంగా పంపిణీ చేసే పుస్తకాలలో సైతం ఆ సంవత్సరం ఎన్టీఆర్ పేరు లేకుండా పంచడంతో పార్టీలో తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో వాటిని వెనక్కు రప్పించి ఎన్టీఆర్ ఫోటోతో పునర్ముద్రణ చేయించారు .

ఇహ పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహం స్థాపించాలని , ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని టీడీపీ చాలా కాలం పాటు డిమాండ్ చేస్తూ వచ్చింది కానీ 1995 నుండి 2004 వరకూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా..  విగ్రహ ఏర్పాటు , భారతరత్న అంశాలు కార్యాచరణలోకి తీసుకు రావటానికి ఆసక్తి చూపలేదు . బాలయోగి స్పీకర్ గా ఉన్నప్పుడు టీడీపీ ఎంపీల ద్వారా ప్రతిపాదించినా పలు వివాదాలు సాకుగా చూపి ఏర్పాటుకు చిత్తశుద్ధి చూపకపోవడంతో చాలాకాలం పెండింగ్ లో ఉన్న ఈ అంశం ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్యాచరణకు నోచుకొంది . ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటనలో బాబుతో పాటున్న దగ్గుబాటి దంపతులు తర్వాత బాబుతో విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఎన్టీఆర్ తనయ దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెస్ తరపున పార్లమెంట్ సభ్యురాలయ్యారు . కాంగ్రెస్ ఎంపీగా ఆమె చొరవ తీసుకొని విగ్రహం ఏర్పాటుకు స్పీకర్ మీరా కుమారి నుండి అనుమతులు సాధించి తన స్వంత ఖర్చుతో 2013 మే 28 ఎన్టీఆర్ జయంతి నాడు విగ్రహ ప్రతిష్టాపన చేశారు . ఈ కార్యక్రమానికి బాబు ఆయన ప్రధాన అనుచరగణం దూరంగా ఉండటమే కాక కనీసం అభినందనలు కూడా తెలపలేదు .

టీడీపీ అధికారం కోల్పోయిన 2004 నుండి దాదాపు ప్రతి ఏటా మహానాడు వేదికగానో , ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించే సందర్భంగానో ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేయటమో , లేదా మీడియా ముఖంగా డిమాండ్ చేయటమో తప్ప తాను కేంద్రంలో చక్రం తిప్పుతున్నానని చెప్పుకొన్న రోజుల్లో కానీ , రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కానీ బాబు చేసిన ప్రయత్నాలు శూన్యం. ఎన్టీఆర్ మరణించిన తర్వాత గడిచిన 27 ఏళ్ళల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎన్టీఆర్ జన్మస్థలం అయిన కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టే ప్రయత్నం చేయలేదు .

తన హయాంలో తన పరిధిలో ఉన్న జిల్లాకు పేరు పెట్టే అంశాన్ని ఊహలోకి కూడా రానీయని బాబు 2019 ఎన్నికల ముందు మరో సందర్భంలో ఎన్టీఆర్ పేరు కనుమరుగు చేసే ఉద్దేశ్యం వ్యక్తపరుస్తూ అడ్డంగా దొరికిపోయారు . ఏబీఎన్ ఛానెల్ ఎండీ రాధాకృష్ణకి ఇంటర్వ్యూ ఇచ్చేముందు ఇరువురి అంతర్గత చర్చల్లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతూ ఎన్నికల తర్వాత “వాడి” పేరు తొలగించాలి అని ఎన్టీఆర్ నుద్దేశించి అన్న వ్యాఖ్యల వీడియో లీకవ్వడంతో ఎన్టీఆర్ పట్ల బాబు కపట వైఖరి మరోసారి బయటపడింది .

పిల్లనిచ్చిన ఎన్టీఆర్ అందుకు ప్రతిఫలంగా తన ముఖ్యమంత్రి పదవిని , స్థాపించిన పార్టీని , ప్రతిష్టాత్మకంగా ఎంచుకున్న గుర్తుని , ఆస్తిపాస్తుల్ని, బ్యాంక్ ఖాతాల్ని అన్నిటినీ కోల్పోయి దుర్మరణం పాలయ్యారు దివంగత నందమూరి తారక రామారావు . మరోవైపు ఆయన ద్వారా అన్నీ పొందిన బాబు మాత్రం నేటికీ ఆయన పేరు , ప్రతిష్టలతో పాటు రాజకీయ అవసరాల మేరకు ఆయన కుటుంబ సభ్యుల్ని సైతం ఇప్పటికీ వాడుకొంటూ ఆయనకు దక్కాల్సిన గౌరవ మర్యాదల విషయంలో కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నాడని చెప్పొచ్చు .

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన రాష్ట్రవ్యాప్త పాదయాత్ర సందర్భంగా కృష్ణాజిల్లా వాసుల కోరిక మేరకు తాను అధికారంలోకి వచ్చాక జిల్లాల పునర్విభజనలో కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానన్న జగన్ ఇచ్చిన మాట నిలుపుకొంటూ విభజన తర్వాత విజయవాడ కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు తీర్మానించి ప్రకటన చేశారు . పేరుకి జిల్లా కేంద్రం అయినా రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో ఒకటైన విజయవాడ విభజిత ఆంధ్రప్రదేశ్ కి అనధికారిక రాజధాని అని చెప్పొచ్చు . అలాంటి జిల్లాకు తమ పార్టీ వ్యవస్థాపకుని పేరు తీర్మానించి ప్రకటించిన వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు అభినందిస్తాడు అనుకోలేము . కనీసం హర్షం వ్యక్తం చేయడం గానీ , పార్టీ తరుపున ధన్యవాద తీర్మానం చేస్తాడా అనేది అనుమానమే .

టీడీపీ వ్యవస్థాపకుడు అయిన నందమూరి తారక రామారావు మరణం తర్వాత ఆయనకి తగు గౌరవ మర్యాదలు ఏమైనా దక్కాయంటే అది టీడీపీయేతర ప్రభుత్వ హాయాల్లోనే తప్ప ఆయన స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చి ప్రస్తుతం బాబు నాయకత్వంలో ఉన్న టీడీపీ పార్టీ నుండి ఆయనకు తగు గౌరవ మర్యాదలు దక్కలేదన్నది ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్న కఠోర వాస్తవం …..