iDreamPost
android-app
ios-app

ఇంతకీ జాంబీ హీరో ఎవరు

  • Published Aug 08, 2020 | 6:29 AM Updated Updated Aug 08, 2020 | 6:29 AM
ఇంతకీ జాంబీ హీరో ఎవరు

హాలీవుడ్ సినిమాల్లో జాంబీ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది కానీ తెలుగులో మాత్రం ఇప్పటిదాకా ఈ ప్రయత్నాలు చేసిన వాళ్ళు తక్కువే. కొన్నేళ్ల క్రితం యాంకర్ రష్మీతో కామెడీ టచ్ తో ఓ మూవీ తీశారు కానీ అది ఎవరూ గుర్తించనంతగా ఫ్లాప్ అయ్యింది. సీరియస్ గా ట్రై చేసిన వాళ్ళు అయితే లేరు. ఇప్పుడు అ!, కల్కి దర్శకుడు ప్రశాంత్ వర్మ జాంబీ రెడ్డి అనే వెరైటీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో కరోనా బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుందట. రాజశేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్న జాంబీ రెడ్డికి మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు. అయితే సౌత్ లో ఇదే మొదటి సినిమా కాదు.

ఆ మధ్య 2016లో జయం రవి హీరోగా మిరతన్ అనే సినిమా వచ్చింది. తెలుగులో యమపాశం పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. అయితే ఇది డిజాస్టర్. కాకపోతే ఇంగ్లీష్ మూవీని స్ఫూర్తిగా తీసుకుని చాలా డిఫరెంట్ గా భయపెట్టేలా తీశారు. ఒక వైరస్ వల్ల మాములు మనుషులు వికృత రూపాల్లోకి మారిపోయి అవతలి వాళ్ళను కొరకడం లేదా గాయపరచడం ద్వారా తమలాగే తయారుచేయడం జాంబీ కాన్సెప్ట్ లోని మెయిన్ పాయింట్. ఆంగ్లంలో ఇలాంటివి ఇప్పటిదాకా లెక్కలేనన్ని వచ్చాయి. తెలుగులో మాత్రం నిజంగా కొత్తే. కాకపోతే టైటిల్ జాంబీ రెడ్డి అని పెట్టడం మాత్రం వెరైటీగా ఉంది. ఆ మధ్య సమరసింహారెడ్డితో మొదలుపెట్టి ప్రతి ఫ్యాక్షన్ సినిమాకు రెడ్డి ని ట్యాగ్ పెట్టుకుని సొమ్ములు చేసుకోవడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఏకంగా హారర్ మూవీకి ఇలా పెట్టడం పట్ల మిశ్రమ స్పందన దక్కుతోంది. అయినా అటెన్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక సామజిక వర్గం పేరుని వాడుకోవడం ఎంతవరకు సబబనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే టైటిల్ రోల్ ఎవరు చేస్తున్నారు, మిగిలిన తారాగణం ఏంటి అనే వివరాలు మాత్రం బయటికి రాకుండా టీమ్ చాలా జాగ్రత్త పడుతోంది. షూటింగ్ అయినా జరుగుతోందా లేదా అనే సమాచారం లేదు. కరోనా వైరస్ మీద సినిమా తీసిన మొదటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాగా ప్రశాంత్ వర్మ దానికి హారర్ థీమ్ ని లింక్ చేసి ఇంకో విధంగా ప్రెజెంట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అ! సీక్వెల్ కి టైం పట్టేలా ఉండటంతో ప్రశాంత్ వర్మ ఈ జాంబీ రెడ్డిని స్టార్ట్ చేశారు. కల్కి ఆశించిన ఫలితం సాధించలేకపోవడంతో ఇది ఖచ్చితంగా హిట్ చేయాలనే టార్గెట్ తో ఉన్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు రాబోతున్నాయి