iDreamPost
android-app
ios-app

ఎన్నికల వేళ ఆ ప్రముఖుల ట్విటర్ ఖాతాలు ఎవరు హ్యాక్ చేశారు..? ఎందుకోసం చేశారు..?

ఎన్నికల వేళ ఆ ప్రముఖుల ట్విటర్ ఖాతాలు ఎవరు హ్యాక్ చేశారు..? ఎందుకోసం చేశారు..?

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న ఏడాదిలోనే సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయారు. ప్రముఖ రాజకీయ ప్రముఖులు, టెక్నాలజీ మొఘల్స్, సంపన్నులే లక్ష్యంగా వారి అధికారిక ట్విట్టర్‌ ఖాతాలు ఏకకాలంలో సైబర్ దాడికి గురికావడం తీవ్ర కలకలం రేపింది. అమెరికాలో వచ్చే నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే పార్టీకి చెందిన సీనియర్ రాజకీయ నేతల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ కు గురవ్వడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది.‌ ఎన్నికల వేళ ఆ రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు ట్విట్టర్ ఖాతాలను ఎవరు చేశారు..? ఎందుకోసం దీనికి ఒడిగట్టారు..? దీనివల్ల వారికేం లాభం..? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రత్యేకించి బిట్‌కాయిన్‌కు మద్దతుగా హ్యాకర్లు ప్రముఖుల ఖాతాల్లో పోస్టులు పెట్టడంతో.. ఈ సైబర్ కరెన్సీ ముఠాలే హ్యాకింగ్‌కు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ పోస్టులన్నీ క్రిప్టో కరెన్సీకి సంబంధించినవే కావడం గమనార్హం. బిట్‌కాయిన్‌ సైబర్‌ నేరగాళ్లు చేసిన ఈ పనితో ట్విట్టర్‌ వణికిపోయింది. ‘‘వచ్చే 30 నిమిషాల్లో నాకు వెయ్యి డాలర్లు పంపండి. నేను తిరిగి 2 వేల డాలర్లు పంపుతాను’’అంటూ బిట్‌కాయిన్‌ లింక్‌ అడ్రస్‌ ఇస్తూ ప్రముఖుల అధికారిక ఖాతాలలో ట్వీట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆ ట్వీట్లు మూడు, నాలుగు గంటలసేపు ఉన్నాయి. హ్యాక్‌ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ట్విట్టర్‌ యంత్రాంగం పోస్టులన్నింటినీ తొలగించి తాత్కాలికంగా ఆ ఖాతాలను నిలిపివేసింది. భద్రతా పరమైన అంశాలను పరీక్షించి అకౌంట్లను పునరుద్ధరించింది.

హ్యాకింగ్ బారిన పడిన ప్రముఖల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్, మీడియా మొఘల్‌ మైక్‌ బ్లూమ్‌బర్గ్, అమెజాన్‌ సిఈఓ జెఫ్‌ బెజోస్, బిలియనీర్లు వారెన్ బఫెట్, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తోపాటు యాపిల్, ఉబర్‌ వంటి సంస్థల అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయి. వారి అధికారిక ఖాతాలలో హఠాత్తుగా అనుమానాస్పద పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. కాగా ట్విటర్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురైన విషయాన్ని తాము గుర్తించామనీ, దీనిపై విచారించి, పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని ట్విట్టర్ సపోర్ట్ వెల్లడించింది.

సోషల్‌ మీడియా చరిత్రలోనే అతి పెద్దదైన ఈ హ్యాకింగ్‌ ద్వారా బిట్‌కాయిన్‌ వాలెట్‌లోకి లక్షా12 వేలకు పైగా డాలర్లు వచ్చి చేరాయని అంచనా. ఒకసారి గుర్తు తెలియని వాలెట్లలోకి వెళ్లిన మొత్తాన్ని తిరిగి రాబట్టడం అసాధ్యమని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. ‘‘మా సంస్థకు ఇవాళ గడ్డుదినం. ఈ దాడి అత్యంత భయానకమైనది. ఏం జరిగిందో విచారించి ట్విట్టర్‌లో భద్రతాపరమైన లోపాలను పరిష్కరిస్తాం’’అని ట్విట్టర్‌ సీఈవో జాక్‌ డోర్సే ట్వీట్‌ చేశారు.  

బిట్‌కాయిన్‌ సొమ్ముల్ని రెట్టింపు చేసుకోండంటూ గతంలోనూ అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయి కానీ, ఇలా పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల ఖాతాలు హ్యాక్‌ కావడం ఇదే మొదటిసారి. దీనిని సమన్వయ సామాజిక ఇంజనీరింగ్‌ దాడిగా ట్విట్టర్‌ సపోర్ట్‌ టీమ్‌ అభివర్ణించింది. ట్విట్టర్‌లో అంతర్గతంగా ఉండే వ్యవస్థలు, టూల్స్‌ సాయంతో హ్యాకర్లు ట్విట్టర్‌ ఉద్యోగుల అడ్మినిస్ట్రేషన్‌ ప్రివిలేజెస్‌ సంపాదించారు. దాని ద్వారా ప్రముఖుల పాస్‌వర్డ్‌లు తెలుసుకొని మెసేజ్‌లు పోస్టు చేశారని ట్విట్టర్‌ సపోర్ట్‌ టీమ్‌ తెలిపింది. వీలైనంత త్వరగా డబ్బులు సంపాదించడమే వారి లక్ష్యమని ఇలాంటి స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.