iDreamPost
iDreamPost
ఏపీలో రాజకీయం ప్రస్తుతం మతం చుట్టూనే తిరుగుతోంది. జనంలో ఉధృతంగా ఉన్న అధికార పక్షాన్ని తట్టుకుని నిలబడేందుకు ఏ చిన్నపాటి ఆసరానైనా పట్టుకునేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రతిపక్షాల నోట పదేపదే మతం మాట విన్పిస్తోంది. సున్నితమైన అంశం, లోతుగా చర్చించేంత ధైర్యం ఎవ్వరూ చేయకపోవడం కూడా ప్రస్తుతం ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాయన్న అభిప్రాయం కూడా విన్పిస్తోంది.
ఆలయాల్లో జరుగుతున్న ఘటనల నేపథ్యంలో ప్రారంభమైన ఈ ధోరణి ఇప్పుడు తిరుపతిలో డిక్లరేషన్ వరకూ వచ్చిచేరింది. అన్యమతస్తులు డిక్లరేషన్ ఇచ్చే స్వామివారి దర్శనం చేసుకోవాలని అన్నది ప్రతిపక్ష పార్టీలు ఏకధాటిగా చెబుతున్న మాట. అయితే ఇప్పుడు ప్రతిపక్షం, గతంలో అధికార పక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వామివారి దర్శనం చేసుకుంటే అక్కర్లేని డిక్లరేషన్, ఇప్పుడే ఎందుకు కావాల్సి వస్తోంది? అన్నది అధికార పార్టీ నాయకుల ప్రశ్న. డిక్లరేషన్ ఇవ్వడమా? ఇవ్వకపోవడమా? అన్న ప్రశ్నను పక్కన పెడితే మతం ఆధారంగానే జనంలోకి చొచ్చుకుపోవాలన్న భావనతో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు ఇప్పుడు ఇదే పెద్ద ఆధారంగా కన్పిస్తోందన్నది నిర్వివాదాంశం.
ఏపీలో పలు ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనల తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు శక్తివంచన లేకుండా కృషి చేసారన్నది రాజకీయవర్గాల అభిప్రాయం. అయితే అందుకు ధీటుగానే జగన్ ప్రభుత్వం కూడా స్పందించి, తగు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే తమకు అనుకూలమైన దారులను వెతికే క్రమంలో ఉన్న ప్రతిపక్షాలకు ఇప్పుడు జగన్ మతం గుర్తుకు వచ్చిందన్నది వారి వాదన.
అయితే ప్రస్తుతం ఆయా పార్టీలు లేవనెత్తుతున్న మతం అంశం ఎవరికి ప్రయోజనం అన్న చర్చకూడా సాగుతోంది. తాము అధికారంలో ఉండగా దాదాపు నలభైవరకు హిందూ ఆలయాలు, మత సంబంధమైన కట్టడాలనుకూల్చేసిన వ్యక్తి ఇప్పుడు హిందూ మతం గురించి, సంప్రదాయాల పరిరక్షణ గురించి మాట్లాడడం ప్రజలు ముక్కునవేలేసుకుని వింటున్నారు. అదే సమయంలో అధికారం మత్తులో అప్పుడు వారు చేస్తున్న పనులను ‘మిత్రపక్షం’ పేరిట అడ్డుకోకుండా ఇప్పుడు హిందూత్వ అజెండాను మెడమీదకెత్తుకుని సిద్ధమైపోతున్నవారి ఆశలను గురించి కూడా చర్చించుకుంటున్నారు. తద్వారా ఏప్రయోజనాలకాశించి ప్రతిపక్షాలు ఇప్పుడీ నినాదాన్ని పైకెత్తుకుని కార్యాచరణకు దిగుతున్నాయన్నది ప్రజలకు అర్ధం కాని విషయమేమీ కాదు.
పైగా ప్రతిపక్షాలను పెద్దగా జనం పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం కూడా రాజకీయవర్గాలో ఉంది. గతంలో ఆయా పార్టీలు ఇచ్చిన పిలుపులకు ప్రజల నుంచి స్పందన రాకపోవడాన్ని ఇందుకు నిదర్శనంగా ఉదహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మైకుచించుకుని గగ్గోలు పెడుతున్న ప్రతిపక్షాల చిత్తశుద్ధిని ప్రజలు ఇంకా శంకిస్తున్నారన్న ఇషయాన్ని ఆయా పార్టీలు గుర్తించాలన్న సూచన ప్రజల నుంచి విన్పిస్తోంది.