హైదరాబాద్ వేదికగా దేశమంతా విస్తరించాలని ప్రణాళిక వేస్తున్న మజ్లీస్ పార్టీ రాజకీయ అడుగులు క్రమంగా బీజేపీ “బి” టీమ్ ముద్ర వేసుకునేలా కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి కచ్చితంగా మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఎంఐఎం పార్టీ పని చేస్తోంది అన్న విపక్షాల విమర్శలకు క్రమంగా బలం చేకూరుతోంది.
ఈసారి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏకంగా 100 స్థానాల్లో పోటీ చేస్తామని మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పడం, వెనువెంటనే ఉత్తరప్రదేశ్లో ఓం ప్రకాష్ రాజ్ భర్ నేతృత్వంలోని సుహాలదేవ్ భారతీయ సమాజ్ పార్టీ తో పొత్తు ప్రకటించడం వెనుక కచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మేలు చేసే కుట్ర దాగి ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలోనూ బిజెపి నాయకుడు సాక్షి మహారాజ్ బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేయడం తమకు బాగా లాభించిందనీ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీహార్ ఫార్ములానే ఉత్తరప్రదేశ్లో కూడా అమలు చేయడానికి ఎంఐఎం పార్టీని రంగంలోకి దింపారు అనేది కాంగ్రెస్ పక్షాల మాట.
మజ్లీస్ పార్టీ కీ తెలుగు రాష్ట్రాలు తర్వాత ప్రధానంగా బాగా కలిసి వచ్చింది మహారాష్ట్ర. అక్కడ అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుని ఒక ఎంపీ సీటు గెలిచి, అదే ఊపుతో దేశమంతా విస్తరించాలి అని ఎంఐఎం పార్టీ ప్రయత్నించింది. దీనిలో భాగంగా పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఎంఐఎం పార్టీ తన అభ్యర్థులను రంగంలోకి దింపింది. బీహార్లో ఎంఐఎం పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయి. 2020లో బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 5 సీట్లు సాధించిన ఎంఐఎం పార్టీ ఉత్తరాదిలో కూడా అద్భుతమైన పట్టు సాధించింది అని అంతా భావించారు. అదే ఊపుతో గుజరాత్లోని గోద్రా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఐఎం అక్కడ సైతం ముగ్గురు కౌన్సిలర్లను గెలిపించుకోగలిగింది.
దేశంలోని ముస్లింలంతా ఎంఐఎం పార్టీని తమ పార్టీ అనుకుంటున్నారు అన్న భావన వస్తున్న సమయంలోనే పశ్చిమబెంగాల్ ఎన్నికలు ఆ పార్టీ ఆశలను ఆవిరి చేశాయి. జమ్ము కాశ్మీర్ తర్వాత దేశంలోనే అత్యధికంగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే పశ్చిమబెంగాల్లో ఎంఐఎం పార్టీకి చుక్కెదురైంది. జనాభాలో సుమారు 35 శాతం మంది ముస్లింలు ఉండే పశ్చిమ బెంగాల్లో ఎంఐఎం పార్టీ ఒక్క సీటు గెలుచుకోలేకపోయింది. ఇక్కడ ముస్లిం ఓటర్లు అంతా తృణమూల్ వైపే మొగ్గు చూపారని పలు సంస్థల సర్వేల్లో తేలింది. ఒకవేళ ఎంఐఎం పార్టీ కనుక పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ హవా చూపి మంచి సీట్లు సాధించగలిగితే, ముస్లిం ఓట్లలో భారీగా కోత పడి ఉండేదని, ఆ నష్టాన్ని ముందే కనిపెట్టి మమతాబెనర్జీ చక్కగా దానికి విరుగుడు వేశారని విశ్లేషకులు చెబుతున్నారు. లేకుంటే భారతీయ జనతా పార్టీ ఓట్ల చీలిక వల్ల లాభపడేది అన్నది విశ్లేషకుల లెక్క.
ఇప్పుడు 2022 మొదట్లో జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మీద దేశంలోని అందరి చూపు ఉంది. మరోసారి అధికారంలోకి వచ్చి ఉత్తరప్రదేశ్లో తమ ప్రభవం నిలుపుకోవడానికి బిజెపి శతవిధాలా ప్రయత్నిస్తోంది. 2024 లో జరగబోయే లోక్సభ ఎన్నికలకు ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు చాలా కీలకం. అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో గెలుపు మీదనే దేశ రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. అలాంటి చోట జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి కచ్చితంగా విజయం సాధించాలని బిజెపి భావిస్తోంది. దీనిలో భాగంగానే ఎంఐఎం పార్టీని రంగంలోకి దింపి భారీగా ముస్లిం ఓట్లను చీల్చాలని బిజెపి ప్రణాళిక వేయడంలో భాగంగానే మజ్లీస్ పార్టీ బి టీం గా 100 స్థానాల్లో బరిలోకి దిగబోతోంది అని కాంగ్రెస్ పక్షాలు ఆరోపిస్తున్నాయి.
ముస్లింలు అధికంగా ఉన్న నియోజక వర్గాల్లోనే ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి అక్కడ స్వింగ్ లో ఉన్న పార్టీ కీ అది నష్టమే. పైగా ఐదేళ్లలో ప్రజావ్యతిరేకత, కోవిడ్ నష్టనివారణ చర్యలు తీసుకోవడంలో యోగి ప్రభుత్వం పై ఉన్న ఆరోపణలు ప్రతిపక్షాలకు బలం చేకూరుస్తాయి. దీని నష్టనివారణ చర్యల్లో భాగంగానే ఎంఐఎం పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ముస్లిం ఓట్లను చీల్చి ఎందుకు రంగంలోకి దిగనుంది అని ఉత్తరప్రదేశ్లోని బిజెపియేతర పక్షాలు ఆరోపిస్తున్నాయి.
మరోవైపు దేశమంతా జాతీయ పార్టీగా విస్తరించాలని తామేమి అనుకోవట్లేదు అని చెబుతూనే ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్ని రాష్ట్రాల ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వ్యూహాత్మకంగా పక్కకు తప్పుకుంటే, మరికొన్ని రాష్ట్రాల్లో భారీగా పోటీకి నిలుపుతున్నారు. పార్టీ క్రమక్రమంగా విస్తరించడానికి ఆయన వ్యూహాలు చక్కగా ఉపయోగపడినా, ప్రస్తుతం ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు మాత్రం సమాధానం చెప్పాల్సి ఉంది.