Idream media
Idream media
దేనికైనా రాసి పెట్టి ఉండాలి.. ఈ మాట పెద్దలు ఊరికే అనరు. ఉజ్వలమైన భవిష్యత్, రాజయోగం పట్టాల్సిన వ్యక్తికి స్వయంకృపరాధం, తప్పటడుగుల వల్ల అవి దక్కకపోతే ఈ నానుడుని తెలుగు ప్రజలు ఉపయోగిస్తుంటారు. ఈ నానుడి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూకు అతికినట్లు సరిపోతుంది. వైసీపీ తరఫున గెలిచిన జ్యోతుల నెహ్రూ 2016లో టీడీపీలోకి ఫిరాయించకుండా ఉంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి లేదా మంత్రి అయ్యేవారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ పార్టీ ఫిరాయింపుతో ఆ సువర్ణ అవకాశం జ్యోతుల నెహ్రూ కోల్పోయి ఇప్పుడు సాధారణ వ్యక్తిగా మిగిలారు.
తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయ ఆరంగేట్రం చేసిన జ్యోతుల వెంకట అప్పారావు అలియాస్ నెహ్రూ.. 1994, 1999 ఎన్నికల్లో వరుసగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుంచి శాసన సభకు ఎన్నికయ్యారు. 2004లో ఓటమి చవిచూశారు. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి అభిమాని అయిన ఆయన కుమారుడు జ్యోతుల నవీన్ కుమార్ ప్రొద్బలంతో ప్రజా రాజ్యం పార్టీలో చేరి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. జగ్గంపేట నుంచే మళ్లీ పోటీ చేసినా ఓటమి తప్పలేదు. పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆ పార్టీ నాయకులు తమ దారి తాము చూసుకున్నారు. ఈ క్రమంలో నెహ్రూ వైసీపీలో చేరారు. పార్టీ ప్రకటన కూడా జగ్గంపేటలోనే వైఎస్ జగన్ ప్రకటించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, కాపు సామాజికవర్గం నేత కావడంతో సీఎం జగన్ జ్యోతుల నెహ్రూకు పార్టీలో సముచిత స్థానం ఇచ్చారు. వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పదవిని కట్టబెట్టారు.
2014 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నెహ్రూ దశాబ్ధం తర్వాత గెలుపు రుచి చూశారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ నెహ్రూకు జగన్ పెద్దపీట వేశారు. శాసన సభలో ఉప నేతగా నియమించారు. పార్టీలో జగన్ తర్వాత నెంబర్ 2 ఎవరంటే.. జ్యోతుల నెహ్రూ పేరు అప్పట్లో వినిపించేది. పార్టీలోనూ ఉన్నత స్థాయి పదవులు కల్పించారు. అయితే అధికారంపై ఉన్న మమకారంతో ఉజ్వల భవిష్యత్ను చేజేతులా నెహ్రూ నాశనం చేసుకున్నారని ఇప్పుడు ఆయన అనుచరులు వాపోతున్నారు. టీడీపీ పన్నిన ఉచ్చులో నెహ్రూ పడిపోయాడు. మంత్రి పదవిని ఆశ చూసిన టీడీపీ ఎన్నో ఎత్తులు వేసింది. నెహ్రూ టీడీపీలో ఉండి ఉంటే.. నా పదవి ఆయనదేనంటూ అప్పటి డిప్యూటీ సీఎం హోదాలో హోం మంత్రిగా ఉన్న కాపు సామాజికవర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్ప బహిరంగంగానే వ్యాఖ్యానించేవారు. ఆ ట్రాప్లో పడిన నెహ్రూ పార్టీ ఫిరాయించారు. తమ నేతకు మంత్రి పదవి వస్తుందని, విద్యుత్ శాఖను కేటాయించబోతున్నారంటూ ఆయన అనుచరులు అప్పట్లో చర్చించుకున్నారు.
అయితే ఏడాదికే నెహ్రూకు సీన్ అర్థం అయింది. బాబు వాడకం ఎలా ఉంటుందో తెలిసింది. మంత్రి పదవి కాదు కదా కనీసం పార్టీ కార్యక్రమాల్లోనూ ప్రాధాన్యం కూడా ఇవ్వలేదు. 2017 జూలైలో జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో నెహ్రూకు ఘోర అవమానం జరిగింది. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన చంద్రబాబు.. ప్రచార వాహనంపై ప్రశంగిస్తున్న సమయంలో కనీసం ఆయన పక్కన కాకపోయినా.. వాహనంపై చోటు కల్పించలేదు. చోటా మోటా నేతలు కూడా వాహనంపై చోటు దక్కగా.. ఎమ్మెల్యే అయిన నెహ్రూ.. ఆ సభలో జనాల్లో ఒకడిగా నిలబడి సాధారణ ఓటరు మాదిరిగా చంద్రబాబు ప్రశంగం వినాల్సి వచ్చింది.
మంత్రి పదవి ఆశలు వదిలేసుకున్న నెహ్రూ.. కనీసం తమ కుమారుడికైనా ఏదో ఒక పదవి ఇవ్వాలనే స్థితికి వచ్చారు. దీంతో జెడ్పీ చైర్మన్గా ఉన్న నామన రాంబాబు స్థానంలో నెహ్రూ కుమారుడు నవీన్ కుమార్ను చైర్మన్గా చేశారు. రెండున్నరేళ్ల కాలం నవీన్ ఆ పదవిలో కొనసాగారు. జడ్పీ చైర్మన్ అనే పేరు తప్పా.. నవీన్ అధికారం చెలాయించింది శూన్యమే.
తనతోపాటు తన తోడళ్లుడు అయిన పక్క నియోజకవర్గం ప్రత్తిపాడు ఎమ్మెల్యే తోట సుబ్బారావును కూడా టీడీపీలోకి తీసుకువెళ్లిన నెహ్రూకు 2019 ఎన్నికల్లో తాను చేసిన తప్పు ఏమిటి..? ఏం నష్టపోయానో అర్థం అయింది. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన నెహ్రూ, సుబ్బారావులు ఓటమి చవిచూశారు. వరుసగా రెండోసారి జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో వైసీపీ జెండా రెపరెపలాడింది. 2014లో తొలిసారి పోటీ చేసిన వైసీపీ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 స్థానాలకు గాను 5 నియోజకవర్గాల్లో గెలవగా.. 2019 మాత్రం 15 స్థానాల్లో విజయదుందుబి మోగించింది.
వైసీపీ ప్రభుత్వంలో తూర్పు గోదావరి జిల్లా నుంచి ముగ్గురు నేతలకు మంత్రి పదవులు దక్కాయి. మండపేట నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన పిల్లి సుభాష్ చంద్రబోష్కు కీలకమైన రెవెన్యూ, కాపు సామాజికవర్గానికి చెందిన కురసాల కన్నబాబుకు వ్యవసాయ శాఖ, అమలాపురం నుంచి గెలిచిన పినిపే విశ్వరూప్కు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పదవులు దక్కాయి. తనను నమ్మి వెంట నడచిన వారికి ఎప్పుడూ అగ్రస్థానం ఉంటుందని పిల్లి సుభాష్ చంద్రబోస్ విషయంలో మరోసారి జగన్ నిరూపించారు.
2014 ఎన్నికల్లో కాకినాడు రూరల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన కురసాల కన్నబాబు ఆ తర్వాత వైసీపీలో చేరారు. కన్నబాబు శక్తి సామర్థ్యాలను గుర్తించిన వైఎస్ జగన్ పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పజెప్పారు. జగన్ నమ్మకాన్ని నిలబెడుతూ సీనియర్ నేతలతో సమన్వయం చేసుకుంటూ కన్నబాబు పార్టీని జిల్లాలో నడిపించారు. రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్లో కీలక మంత్రిగా ఎదిగారు.
నెహ్రూ కానీ పార్టీలోనే ఉంటే.. ఈ సారి గెలిచేవారు. మంత్రి పదవి దక్కించుకునేవారని జిల్లా వాసులు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. నెహ్రూ పార్టీలోనే ఉండి ఉంటే.. కన్నబాబు ఎమ్మెల్యే పదవికే పరిమితం అయ్యేవారు. కానీ కన్నబాబు తీసుకున్న నిర్ణయం ఆయన్ను ఉన్నత పదవిలో కూర్చోబెట్టింది. ఇద్దరు నేతలు 2009లో పీఆర్పీ తరఫున పోటీ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కన్నబాబు, నెహ్రూలు వేర్వేరు దారుల్లో నడవగా.. కన్నబాబు నడిచిన దారిలో పూలు ఉండగా.. నెహ్రూ దారిలో ముళ్లు ఉన్నాయి. కన్నబాబు మంత్రి అవగా.. నెహ్రూ ఆ అవకాశం చేజేతులా కోల్పోయారు. అందుకే అంటారు.. దేనికైనా రాసి పెట్టి ఉండాలని..!