iDreamPost
android-app
ios-app

విశాఖ టీడీపీ.. రెండు రోజుల్లో ఏం జ‌ర‌గ‌బోతోంది?

విశాఖ టీడీపీ.. రెండు రోజుల్లో ఏం జ‌ర‌గ‌బోతోంది?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల అనంత‌రం తెలుగుదేశం పార్టీలో గుబులు మొద‌లైంది. పార్టీల ర‌హితంగా జ‌రిగిన‌ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అస‌లు లెక్క‌ల‌ను ప‌క్క‌న‌బెట్టి సొంత లెక్క‌ల‌తో ప‌రువు కాపాడుకునే ప్ర‌య‌త్నం చేసినా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆ ప‌ప్పులు ఉడ‌క‌లేదు. దీంతో పార్టీ ప‌రిస్థితి తేట‌తెల్లం కావ‌డంతో నేత‌లు చేజారిపోతారేమోన‌న్న భ‌యం ప‌ట్టుకుంది. టీడీపీకి చెందిన వారు వైసీపీ నేత‌ల‌ను స్నేహ‌పూర్వ‌కంగా క‌లిసినా, మ‌ర్యాదపూర్వ‌కంగా మాట్లాడినా ఎందుకు క‌లిశారు, ఏం జ‌ర‌గ‌బోతోంది అన్న ఆందోళ‌న అంత‌టా క‌నిపిస్తోంది. విశాఖ‌ప‌ట్ట‌ణంలో అది బ‌య‌ట‌ప‌డింది. కొంత మంది టీడీపీ కార్పొరేట‌ర్లకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేను ఎందుకు క‌లిశారో రెండు రోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించింది. పార్టీ ఏదైనా వారు విశాఖ‌ పాల‌క‌వ‌ర్గ స‌భ్యులు. వారు ఎమ్మెల్యేను క‌ల‌వ‌డం నేర‌మా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇటీవ‌లే విశాఖ కార్పొరేష‌న్ పాల‌క‌వ‌ర్గం ప్ర‌మాణ‌స్వీకారం చేసింది. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. తండ్రీ కొడుకులు ఇద్ద‌రూ ఎంత ఆవేశంగా మాట్లాడినా ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు. సిగ్గులేదా.. పౌరుషం లేదా.. అని నోరుపారేసుకున్న బాబుకు చుక్కలు చూపించారు. పంచాయతీ ఎన్నికల ఓటమి రుచించక నగర ప్రజలపై ఆక్రోశాన్ని వెళ్లగక్కిన తండ్రీ కొడుకులకు బుద్ధి చెప్పారు. కార్యనిర్వాహక రాజధాని విశాఖపై విషం కక్కుతున్న తెలుగుదేశానికి జీవీఎంసీ ఎన్నికల్లో కోలుకోలేని షాకిచ్చారు. మొత్తం 98 వార్డులకు గాను 30 వార్డులకే టీడీపీని పరిమితం చేశారు. 58 స్థానాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టారు. సంక్షేమం, అభివృద్ధికే మేయర్‌ పీఠాన్ని కట్టబెట్టారు. పాల‌క‌వ‌ర్గం కూడా కొలువుదీరింది. విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన గొలగాని వెంకట హరి కుమారి విశాఖ మేయర్ గా భాద్యతలు స్వీకరించారు. కార్పొరేట‌ర్ గా ఎన్నికైన స‌భ్యులంద‌రూ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు, ఇత‌ర నాయ‌కుల‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకుంటున్నారు. వీరిలో తెలుగుదేశానికి చెందిన కార్పొరేట‌ర్లు కూడా ఉంటున్నారు.

ఇదే క్ర‌మంలో గాజువాక నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే తిప్ప‌ల నాగిరెడ్డి ఇంటికి వెళ్లి కొంద‌రు తెలుగుదేశం కార్పొరేట‌ర్లు క‌లిశారు. ఆయ‌న‌కు పుష్ప‌గుచ్చం ఇచ్చారు. ఎమ్మెల్యేను క‌లిసిన వారిలో 67వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు, 75కు చెందిన పులి ల‌క్ష్మీభాయి, గంధం శ్రీ‌నివాస‌రావు (76వ డివిజ‌న్), రౌతు శ్రీ‌నివాస‌రావు (79వ డివిజ‌న్), లేళ్ల కోటేశ్వ‌ర‌రావు (86వ డివిజ‌న్), బొండా జ‌గ‌న్నాథం (87వ డివిజ‌న్), మొళ్లి ముత్యాలు (88వ డివిజ‌న్) ఉన్నారు. కార్పొరేట‌ర్లుగా గెలిచిన అనంత‌రం మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఎమ్మెల్యేను క‌లిసిన‌ట్లుగా వారు చెబుతున్నారు. అయితే, దీన్ని తెలుగుదేశం సీరియ‌స్ గా ప‌రిగ‌ణించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మీరు ఎమ్మెల్యేను ఎందుకు క‌లిశారు, పుష్ప‌గుచ్చం ఎందుకు ఇచ్చారు.. రెండు రోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని వారికి విశాఖప‌ట్ట‌ణం అర్బ‌న్ జిల్లా తెలుగుదేశం పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ కార్పొరేట‌ర్లు ఏం తెలుగుదేశానికి ఏం స‌మాధానం చెబుతార‌నేది ఆస‌క్తిగా మారింది.