విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ బోర్డు పరీక్షల షెడ్యూల్ను కేంద్రం విడుదల చేసింది. మే 4 నుంచి జూన్ 10 వరకు సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు మార్చి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని జూలై 15న పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ గురువారం సాయంత్రం ప్రకటించారు. పరీక్షల డేట్ షీట్ను త్వరలో విడుదల చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు.
సాధారణంగా సీబీఎస్ఈ విద్యార్థులకు జనవరిలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరిలో పరీక్షలు ప్రారంభమై మార్చితో పూర్తవుతాయి. కానీ కరోనా కారణంగా సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. దీంతో పరీక్షలను వాయిదా వేయాలని,పరీక్షల సన్నద్ధతకు సమయం ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ మంత్రిని పలువురు విద్యార్థులు అభ్యర్దించడంతో వారి అభ్యర్ధన ప్రకారం పరీక్షలను వాయిదా వేసి మే 4 నుండి నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.