iDreamPost
android-app
ios-app

ఆర్టీసీ సమ్మె – హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మె – హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు స్వస్తి పలకాలని, వారితో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయ సమ్మతం అవునో కాదో పక్కనబెడితే.. దసరా పండుగకు ముందు సమ్మె ప్రారంభించి ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురి చేశారని ఆర్టీసీ జేఏసీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ నెల 5 నుంచి సమ్మె మొదలైతే ఇప్పటివరకు చర్చలు జరిపేందుకు ఎందుకు చొరవ చూపలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరేమైనా బ్రిటిష్‌ పాలనలో ఉన్నారా.. మీ ఇద్దరి మధ్య ఏమైనా టగ్‌ ఆఫ్‌ వార్‌ ఆట జరుగుతోందా అంటూ ధర్మాసనం ఇరు పక్షాలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎస్మా ప్రయోగించినా, సమ్మె చట్ట విరుద్ధమని హైకోర్టు ప్రకటించినా పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవాలని హైకోర్టు పరోక్షంగా ఆర్టీసీ జేఏసీని హెచ్చరించింది. సమ్మె వల్ల ప్రయాణికులు ఇబ్బందుల పాలవుతున్నారని, వెంటనే సమ్మె విరమించేలా మధ్యంతర ఆదేశాలివ్వాలని, ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన సమస్యల సాధనకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటుకు వీలుగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం రీసెర్చ్‌ స్కాలర్‌ ఆర్‌.సుబేందర్‌సింగ్‌ దాఖలు చేసిన పిల్‌పై మంగళవారం వాదనలు జరిగాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ సందర్భంగా ఇరుపక్షాలకు పలు సూచనలు చేసింది.

ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వాదిస్తూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కార్మికుల డిమాండ్‌ను ప్రభుత్వం అమలు చేయబోదని తేల్చిచెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇతర ప్రభుత్వరంగ సంస్థలు కూడా ఇదే డిమాండ్‌తో ముందుకు వస్తాయన్నారు. సమ్మె ప్రభావం ప్రయాణికులపై లేదని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని చెప్పారు. యూనియన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ ఆర్టీసీకి పూర్తిస్థాయి మేనేజింగ్‌ డైరెక్టర్‌ లేకపోవడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, కార్మికులు తమ సమస్యలను ఎవరి ద్వారా ప్రభుత్వానికి తీసుకెళ్లాలో తెలియని అయోమయంలో ఉన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆర్టీసీకి ఎండీని నియమించే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని అదనపు ఏజీ చెప్పడంతో ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భుత్వంలో ఎంతో మంది ఐఏఎస్‌ అధికారులు ఉంటారని, వారిలో ఒకరిని ఆర్టీసీ ఎండీగా నియమించేందుకు వ్యవధి కావాలనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించింది.

జీతం ఇవ్వాలని రిట్‌ 

ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పనిచేసిన సెప్టెంబర్‌ జీతాలు చెల్లించేలా ఆర్టీసీ యాజమాన్యానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన మరో పిటిషన్‌ మంగళవారం హైకోర్టు విచారణకు వచ్చింది. దీన్ని హైకోర్టు బుధవారం న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి విచారించారు. పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించాలని, వాటిని నిలుపుదల చేసే అధికారం ఆర్టీసీ యాజమాన్యానికి లేదని పిటిషనర్‌ న్యాయవాది వాదించారు. ఆర్టీసీ సమ్మెపై ధర్మాసనం విచారణ జరుగుతోందని, కాబట్టి ఈ రిట్‌పై విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

సెలవుల పొడిగింపుపై రిట్‌.. 

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం దసరా సెలవుల్ని పొడిగిస్తూ జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ హైకోర్టులో రిట్‌పిటిషన్‌ దాఖలైంది. విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన రిట్‌లో వెంటనే విద్యాసంస్థలు తెరిచేలా ఉత్తర్వులివ్వాలని హైకోర్టును కోరారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.