Idream media
Idream media
గత ఎన్నికల్లో అమెరికన్ల ప్రయోజనాలే ముఖ్యంగా లోకల్ నినాదాన్ని ఎత్తుకుని విజయం సాధించారు డొనాల్ట్ ట్రంప్. అధికారపగ్గాలు చేపట్టగానే ఆ దిశగానే అడుగులు వేశారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో అమెరికన్లకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా వీసాల జారీ విషయంలో కఠినతర నిబంధనలు తీసుకొచ్చారు. తాజాగా కొవిడ్ కారణంగా అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపొతుండటంతో.. పని ఆధారిత వీసాల జారీని తాత్కాలికంగా నిలిపి వేయాలని భావించారు. తద్వారా అమెరికన్ల మెప్పు పొందేందుకు మరోసారి ప్రయత్నించారు. కానీ కొంతకాలంగా ట్రంప్ వ్యాఖ్యల్లో మార్పు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో పరిశోధన రంగంలో సేవలు అందిస్తున్న భారతీయులను తొలిసారిగా గుర్తించి ప్రశంసించారు. అంతేకాకుండా ప్రధాని మోదీ.. తనకు మంచి మిత్రుడని.. విపత్కర సమయంలో వెంటిలేటర్లను విరాళంగా ఇచ్చి భారత్కు అండగా ఉంటానని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఇద్దరూ భారతీయ అమెరిక్ ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తుండడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది.
ఈ మార్పు వెనుక..
అనూహ్యంగా ట్రంప్ భారతీయ అమెరికన్ లను పొగడడం. పదే పదే మోదీ ప్రస్తావన తెస్తుండడం.. వెనక రాబోయే ఎన్నికల నేపథ్యంలో భారతీయ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ట్రంప్ ఈ వ్యాఖ్యాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాలో దాదాపు 40 లక్షల మంది ఇండియన్ అమెరికన్లు ఉన్నారు. ఇందులో దాదాపు 25లక్షల మందికి అమెరికాలో ఓటు హక్కు ఉంది. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా.. అమెరికాలో కరోనా వైరస్ విలయతాండం చేస్తన్న వేళ.. కరోనాను కట్టడి చేయడానికి డొనాల్డ్ ట్రంప్ సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ట్రంప్ మాత్రం.. తాను సమర్థవంతమైన చర్యలు తీసుకున్నానని పదేపదే వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ట్రంప్.. మాటలను ప్రజలు నమ్ముతున్నారా లేదా అనే దానిపై సీఎన్ఎన్ నేషనల్ పోల్ నిర్వహించింది. ఇందులో ప్రతి పది మంది అమెరికన్లలో దాదాపు ఆరుగురు ట్రంప్ చెబుతున్న సమాచారాన్ని నమ్మడం లేదని తేలింది. కరోనా నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న చర్యలపై గుర్రుగా ఉన్న అమెరికన్లు.. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయను వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అదే జరిగితే.. భారతీయుల ఓట్లు కీలకం అవుతాయి. భారతీయ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగానే ఇండియన్-అమెరికన్ల కృషిని ట్రంప్ ప్రశంసించాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.