సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతన్న ఆయనకు 15 రోజుల క్రితం కాలికి శస్త్ర చికిత్స జరిగింది. అది ఇన్ఫెక్షన్ గా మారడంతో హైదరాబాద్లోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆయన్ను గచ్చిబౌలిలోని మరో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మరణించారు. ముఖ్యమంత్రికి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా మెలిగిన రామలింగారెడ్డి మరణంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు .
దుబ్బాక మండలం చిట్టాపూర్నకు చెందిన రామలింగారెడ్డి 2004 లో మొదటి సారిగా దుబ్బాక నుంచి ఎమ్యెల్యేగా గెలుపొందారు..2008లో జరిగిన ఉప ఎన్నికలో దొమ్మాట నియోజకవర్గం నుంచి తెరాస తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 లో ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014, 2018 సార్వత్రిక ఎన్నికలలోనూ గెలుపొందారు. ప్రస్తుతం శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు.
టిఆర్ఎస్ నేతలు ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. సోలిపేట రామలింగారెడ్డి కి భార్య సుజాత, కుమారుడు సతీష్ రెడ్డి, కుమార్తె ఉదయశ్రీ ఉన్నారు.ఎమ్మెల్యే హఠాన్మరణంతో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుములుకున్నాయి.