iDreamPost
android-app
ios-app

mlc elections – స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు హవా. ఆరుకు ఆరు సీట్లు కైవసం!

mlc elections –  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు హవా. ఆరుకు ఆరు సీట్లు కైవసం!

తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద ఉత్కంఠ నెలకొంది.. తెలంగాణ‌లో ఈ నెల 10వ తేదీన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించారు అధికారులు. స్థానిక సంస్థల కోటాలో కరీంన‌గర్‌ జిల్లాలో రెండు స్థానా‌లకు, ఉమ్మడి మెదక్‌, ఆది‌లా‌బాద్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానా‌నికి పోలింగ్ నిర్వహించగా 12 గంట‌ల లోపు పూర్తిస్థాయి ఫ‌లితాలు వెల్లడి అయ్యే అవ‌కాశం ఉందని ముందే వెల్లడించారు.

ఉమ్మడి క‌రీంన‌గ‌ర్‌ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా, 10 మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎల్. ర‌మ‌ణ‌, భానుప్రసాద్ రావు పోటీలో ఉన్నారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలో అత్యధికంగా 99.70 శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది. ఖ‌మ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి.. టీఆర్ఎస్ నుంచి తాత మధుసూదన్, కాంగ్రెస్ పార్టీ నుంచి రాయల నాగేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాసరావు, కొండూరు సుధారాణి పోటీలో ఉన్నారు. ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో 96.09 శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ నుంచి ఎంసీ కోటిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు న‌గేష్‌, ల‌క్ష్మయ్య, వెంక‌టేశ్వర్లు, ఈర్పుల శ్రీశైలం, బెజ్జం సైదులు, కొర్ర రామ్‌సింగ్ పోటీలో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 97.01 శాతం నమోదైంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నుంచి దండె విఠ‌ల్, స్వతంత్ర అభ్యర్థి పుష్పారాణి బ‌రిలో ఉండగా జిల్లాలో 91.78 శాతం పోలింగ్‌ న‌మోదైంది.

కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాళ్లల్లో ఆదిలాబాద్‌లో ఆరు, కరీంనగర్‌లో 9, మిగతా చోట్ల ఐదు టేబుళ్ల చొప్పున ఏర్పాటు చెశారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్‌ హవా ముందు నుంచి కనిపించింది. నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్‌ అభ్యర్థి కోటిరెడ్డి గెలుపొందగా, ఖమ్మంలో టీఆర్ఎస్‌ అభ్యర్థి తాతామధు గెలుపు.. 247 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మెదక్‌లో టీఆర్ఎస్‌ అభ్యర్థి యాదవరెడ్డి 286 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆదిలాబాద్‌లో టీఆర్ఎస్‌ అభ్యర్థి దండె విఠల్‌ విజయం సాధించారు. కరీంనగర్‌లోని 2 స్థానాలలో ఎల్‌.రమణ, భానుప్రసాద రావు విజయం సాధించారు. అలా మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్ఎస్‌ విజయం సాధించింది. కరీంనగర్‌లోని 2 స్థానాలు, ఆదిలాబాద్‌, ఖమ్మం, నల్గొండ, మెదక్‌ స్థానాల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు.