iDreamPost
android-app
ios-app

టీడీపీకి తిరుపతి ఫలితాల టెన్షన్

  • Published Apr 24, 2021 | 6:35 AM Updated Updated Apr 24, 2021 | 6:35 AM
టీడీపీకి తిరుపతి ఫలితాల టెన్షన్

ప్రచారం చివరి దశలో చేయాల్సినంత రచ్చ చేశారు. ఫలితం దక్కలేదు. పోలింగ్ రోజూ దొంగ డ్రామాలు ఆడినా రక్తి కట్టలేదు. దాంతో రీపోలింగ్ రాగం అందుకున్నారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. అయినా ఈసీ వాటిని పట్టించుకోలేదు సరికదా.. మరోవైపు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు చురుగ్గా చేసుకుంటూ పోతున్నారు. దాంతో టీడీపీ రీపోలింగ్ ఆశలు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ పార్టీకి ఫలితాల టెన్షన్ పట్టుకుంది.

రాజకీయ రచ్చ

తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని టీడీపీ నాయకత్వానికి తెలుసు. అయినా గెలిచేస్తామని బిల్డప్ ఇస్తూ ప్రచారంలో నానా హంగామా చేశారు. పార్టీ సీనియర్ నేతలందరినీ నియోజకవర్గంలో మోహరించారు. మరోవైపు పార్టీ అధినేత ఏకంగా ఎనిమిది రోజులు అక్కడే మకాం వేస్తే.. ఆయన తనయుడు లోకేష్ ఏకంగా 15 రోజులకు పైగా తిష్ట వేశారు. తండ్రీకొడుకులిద్దరు వీధి వీధి తిరిగి ప్రచారం చేసినా ప్రజల్లో స్పందన లేకపోవడంతో రాజకీయ డ్రామాలకు తెర తీశారు. మొదట చంద్రబాబు తన సభపై రాళ్ళ దాడి చేశారంటూ చిన్న గులక రాయి పట్టుకొని ధర్నాలు, బైఠాయింపులతో రచ్చ చేశారు. ఆ తర్వాత లోకేష్ ఆ బాధ్యత తీసుకొని అలిపిరి వద్ద ప్రమాణాల ప్రహసనానికి తెర తీశారు.

అయితే ఇవేవీ వర్కవుట్ కాకపోవడంతో పోలింగ్ రోజు దొంగ ఓట్ల కలకలం సృష్టించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికుల బస్సులను అడ్డుకొని వారినే దొంగ ఓటర్లుగా చిత్రించి రభస చేశారు. ఎన్నికల కమిషన్ కు నేరుగా చంద్రబాబే ఫిర్యాదు చేశారు. తిరుపతి అసెంబ్లీ పరిధిలో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఈసీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది. ఆయన సూచన మేరకు తిరుపతి రిటర్నింగ్ అధికారి చక్రధర్ బాబు ఫిర్యాదులపై విచారణ జరిపారు. పోలింగ్ సజావుగా జరిగిందని, దొంగ ఓట్లు పొలయ్యే అవకాశమే లేదని, అసలు అటువంటి దాఖలాలు కూడా లేవని పేర్కొంటూ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. దాంతో టీడీపీ, బీజేపీలు ఇచ్చిన ఫిర్యాదులను ఈసీ పక్కన పడినట్లు ఢిల్లీ నుంచి సమాచారం అందడంతో టీడీపీ నేతలు హతాశులయ్యారు.

ఇప్పుడేం చేయాలి..!

తాజా పరిణామాలతో తెలుగుదేశం నేతలకు ఫలితాల టెన్షన్ పట్టుకుంది. ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు ముమ్మరం చేయడంతో ఇప్పుడు ఎం చేయాలని టీడీపీ నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ హైకోర్టు లో వేసిన పిటిషన్ వారి ఆశలను మిణుకు మిణుకుమనిపిస్తోంది. ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యి ఓట్ల లెక్కింపును పెండింగులో పెట్టిద్దామా అన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఓట్ల లెక్కింపు జరిగి.. ఘోర ఓటమి ఎదురైతే.. ఆ పాపాన్ని అధికార పార్టీపైకి నెట్టేసే అంశాల కోసం కూడా అన్వేషిస్తున్నారు.