iDreamPost
android-app
ios-app

భారత్‌లో మళ్లీ టిక్ టాక్..?

భారత్‌లో మళ్లీ టిక్ టాక్..?

ఇటీవలి దేశ సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చైనాకు సంబంధించిన 59 యాప్ లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అందులో సెలబ్రిటీల ‌నుంచి సామన్యుల వరకు అందరి ప్రాచుర్యం పొందిన టిక్ టాక్ ఒకటి. దేశంలో టిక్ టాక్ అభిమానులు కోట్లలో ఉన్నారు. అలాంటి టిక్ టాక్ నిషేధానికి గురైంది. అయితే టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా సింగారీ లాంటి కొన్ని దేశీయ యాప్ లు వచ్చిన టిక్ టాక్ అంత ఆదరణ పొందలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ టిక్ టాక్ పునరుద్ధరణ జరుగుతుందా? అనే అనుమానం కలుగుతుంది. ప్రస్తుత పరిస్థితులు అందుకు అద్దం పడుతున్నాయి. టిక్ టాక్ పై నిషేధం విధించిన తరువాత, టిక్ టాక్ యాజమాన్యానికి కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. టిక్ టాక్ గురించి వివరించేందుకు. అలాగే ఇప్పుడు టిక్ టాక్ ప్రకటన చేసింది. ఇవన్నీ చూస్తేంటే త్వరలోనే టిక్ టాక్ రానున్నదనే అనుమానం కలగక మానదు.

ఇండియాలో టిక్ టాక్ కస్టమర్లకు చెందిన సమాచారాన్నంతా సింగపూర్ లో ఉన్న సర్వర్లలో దాచి వుంచామని టిక్ టాక్ సిఈఓ కెవిన్ మేయర్ వ్యాఖ్యానించారు. ఈ సమాచారాన్ని అందించాలని చైనా ప్రభుత్వం తమను కోరలేదని, ఒకవేళ కోరినా, దాన్ని ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

భారత జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రత దృష్ట్యా, చైనా యాప్ లను నిషేధించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వివరణ ఇవ్వాలని యాప్ సంస్థలకు నోటీసును కూడా ఇచ్చింది. మిగతా నిషేధించబడిన యాప్ లతో పోలిస్తే, అత్యధిక నష్టం టిక్ టాక్ కే సంభవించింది. ఈ నేపథ్యంలో కెవిన్ మేయర్ ఓ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించారు. సమీప భవిష్యత్తులో ఇండియాలోనే సర్వర్లను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారని సమాచారం.

తాము మరే దేశానికీ భారత కస్టమర్ల గురించిన సమాచారాన్ని, వారి డేటాను పంచుకోలేదని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతానికి టిక్ టాక్ కు ఊరట లభించే అవకాశాలు లేవని తెలుస్తోంది. 59 చైనా యాప్ లపై విధించిన నిషేధాన్ని తొలగించే ఆలోచనలో కేంద్రం లేదు. చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ అంశం జాతి భద్రతతో ముడిపడటంతో టిక్ టాక్ కు చట్టపరమైన ఊరట కూడా అంత సులువుగా లభించకపోవచ్చని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

టిక్ టాక్ కు ప్రత్యామ్నాయం హైదరాబాద్ డబ్ షూట్

టిక్ టాక్ యాప్ కు భారత్ లో ఎంత ప్రజాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు నిత్యం టిక్ టాక్ వీడియోలతో సందడి చేసేవాళ్లు. అయితే, సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా యాప్ లను భారత్ నిషేధించింది. వీటిలో టిక్ టాక్ కూడా ఉంది. దాంతో టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా వినోదం పంచే యాప్ ల వైపు భారత నెటిజన్ల దృష్టి మళ్లింది.

ఇప్పుడు తాజాగా ‘డబ్ షూట్’ అనే యాప్ ప్రజాదరణ పొందుతోంది. ఇది కూడా టిక్ టాక్ తరహాలో వీడియో యాప్. దీన్ని హైదరాబాద్ కు చెందిన ‘ఎం టచ్’ ల్యాబ్స్ అభివృద్ధి చేసింది. తాజా పరిణామాలపై ‘డబ్ షూట్’ సిఈఓ వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి ‘డబ్ షూట్’ ను డౌన్ లోడ్ చేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోందని వివరించారు. ఇటీవల కేంద్రం 59 చైనా యాప్ లపై నిషేధం ప్రకటించిన తర్వాత, ‘డబ్ షూట్’ యాప్ కు ఐదు లక్షలకు పైగా డౌన్ లోడ్లు వచ్చాయి.