Idream media
Idream media
ప్రపంచంలో కరోనా వైరస్ విజృంభించడంతో అందరూ మాస్క్ ధరించడం అనివార్యం అయింది. మాస్క్ ధరించకపోతే ప్రభుత్వాలు జరిమానా విధిస్తాయి. ఒక దేశంలో ఏకంగా ఆ దేశ ప్రధానే మాస్క్ వాడనందుకు లక్షల్లో జరిమానా కట్టాల్సి వచ్చింది. అలా కరోనా పుణ్యమా అని మాస్క్ తప్పనిసరి అయింది. అయితే ఇందులో కూడా స్టేటస్ ను బట్టే మాస్క్ లు వాడుతున్నారు. కొందరేమో ఎన్ 95 మాస్క్ లు వాడితే, మరికొందరి కాటన్ క్లాత్ తో చేసిన మాస్క్ లు వాడుతున్నారు. ఇంతవరకు ఒక ఎత్తైతే..ఒక వ్యక్తి ఏకంగా లక్షల రూపాయలు పెట్టి మాస్క్ తయారు చేయించాడు.
కరోనావైరస్ పుణ్యమా అని మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, హ్యాండ్వాష్ లోషన్లు నిత్య జీవితంలో భాగమయ్యాయి. మాస్క్ లేనిదే బయటకు వెళ్లడంలేదు. డాక్టర్లు కేవలం ఎన్-95 మాస్కులు వాడాలని సూచిస్తున్నప్పటికీ జనం ఎదో రకమైన మాస్క్ అయినా చాలులే అని ఫిక్స్ అయ్యారు. మాస్కులు లేక పోతే చిన్న టవల్స్ లేదా కర్చీఫ్, చున్నీలు ముఖాలకు చుట్టేసుకుని వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయితే, మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఓ ధనవంతుడు మాత్రం బంగారంతో మాస్కు చేయించుకుని వార్తల్లో నిలిచాడు. శ్వాస తీసుకోవడానికి ఆ మాస్కులకు చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉన్నాయి.
పుర్రెకో బుద్ధి, జీహ్వకో రుచి అన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు మార్కెట్లో మాస్కులు దొరికితే చాలనుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో… ఓ వ్యక్తి తనకోసం ఏకంగా రూ. 2.89 లక్షల విలువ చేసే బంగారు మాస్కు తయారు చేసుకున్నాడు. మహారాష్ట్రలోని పింప్రి-చింద్వాడ్ వాసి శంకర్ కురాడే చేసిన ఈ వినూత్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ మాస్క్ కోసం సుమారు అయిదున్నర తులాల బంగారం వాడినట్లు తెలుస్తోంది. బంగారంపై మక్కువతో ఆయన ఈ మాస్కు తయారు చేయించుకున్నట్లు తెలుస్తోంది. శంకర్ రోజూ 3 కిలోల బరువుండే బంగారు గొలుసులు, ఉంగరాలు తదితర ఆభరణాలు ధరిస్తాడు. బయటకు వెళ్లేప్పుడు కూడా బంగారు మాస్కునే ధరిస్తున్నాడు. దీంతో జనాలు అతడి మాస్క్ను చూసి నోరెళ్లబెడతున్నారు. అయితే, ఈ మాస్కు వైరస్ను కట్టడి చేస్తుందా లేదా అనేది కూడా అనుమానమే.
‘‘శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా దీనికి సూక్ష్మ పరిమాణంలో రంధ్రాలు ఉన్నాయి. ఈ మాస్కు సమర్థంగా పనిచేస్తుందో లేదో మాత్రం నాకు తెలియదు…’’ అని శంకర్ పేర్కొన్నాడు. ఈ నెల 1 నాటికి పింప్రి-చింద్వాడ్ ప్రాంతంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 3,284గా ఉంది. కరోనా కారణంగా ఇక్కడ 47 మంది ప్రాణాలు కోల్పోయారు.