అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలను ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో కూడా అమలు చేస్తూ వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణపై ఒక కీలక నిర్ణయం తీసుకుంది.అంతేకాక వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకై కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు అంశాలపై పూర్తి అధ్యయనం చేసి విధివిధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని తాజాగా సమావేశం అయిన కేబినెట్ ఏర్పాటు చేసింది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన.. మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్ ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ తాజాగా నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం 7289 కోట్లతో … మన ఊరు మన బడి అనే ఒక ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ ప్రభుత్వం విద్యావ్యవస్థ బాగుకోసం అమలుచేస్తున్న నాడు-నేడు కార్యక్రమానికి దగ్గరగా కనిపిస్తోంది.
అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పాఠశాల రూపురేఖల్ని పూర్తిగా మార్చేసేందుకు నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విడతలవారీగా పాఠశాలలను ఎంపిక చేసుకుని వాటిని ఆధునీకరించారు. అలానే వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది.
అంతేకాక ఇప్పటికే అన్ని తరగతుల్లోనూ ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టింది. ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టిన కొత్తలో తెలుగు భాషను నాశనం చేస్తున్నారు అని ప్రతిపక్ష పార్టీలన్నీ దుమ్మెత్తిపోశాయి. కానీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రతి విద్యార్థి ఆంగ్లభాషలో కూడా నైపుణ్యం సాధించాలని ఉద్దేశంతో జగన్ అవిరామ కృషిచేసి ఇంగ్లీష్ మీడియం ను స్కూల్స్ లో ప్రవేశ పెట్టగలిగారు. ఆ తర్వాత వైయస్ జగన్ బాటలోనే కర్ణాటక సహా రాజస్థాన్ లాంటి కొన్ని రాష్ట్రాలు తమ గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెడుతూ నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కూడా ఆ బాటలోనే పయనిస్తుండటంతో జగన్ నిర్ణయానికి మద్దతు పెరిగినట్లు అయింది.