iDreamPost
android-app
ios-app

పోటా పోటీ భేటీలు.. బెజవాడ టీడీపీలో సెగలు

  • Published Jul 14, 2021 | 5:44 AM Updated Updated Jul 14, 2021 | 5:44 AM
పోటా పోటీ భేటీలు.. బెజవాడ టీడీపీలో సెగలు

గతం నుంచే వర్గాలుగా చీలిపోయిన బెజవాడ తెలుగుదేశంలో తాజాగా రెండు వర్గాలు నిర్వహించిన సమావేశాలు పార్టీలో అసమ్మతి సెగలు రేపుతున్నాయి. బెజవాడ టీడీపీలో ఎంపీ కేశినేని నాని ఒకవైపు, బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా మరోవైపు వర్గాలుగా చీలిపోయి గత కొంత కాలంగా ఆధిపత్య పోరు కొనసాగిస్తూ తలనొప్పులు తెస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పార్టీ అధినేత చంద్రబాబు మౌనం వహిస్తున్నారు. దీంతో పార్టీలోని వర్గాలు మరింత రెచ్చిపోతున్నాయి. ఎంపీ కేశినేని తన కుమార్తె శ్వేతను ప్రమోట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఈ వివాదాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.

వీరి సమావేశం.. వారి భేటీ

నీటి సమస్యపై చర్చ పేరుతో నగరంలోని కేశినేని భవన్లో ఎంపీ కేశినేని నాని పార్టీ కార్పొరేటర్లతో ఒక సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థలో టీడీపీకి 14 మంది కార్పొరేటర్లు ఉండగా ఆరుగురు డుమ్మా కొట్టారు. వీరంతా బొండా, బుద్ధా వర్గాలకు చెందినవారు. మరోవైపు కేశినేని టార్గెట్ గా ఇటీవల బొండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలు బొండా స్వగృహంలో రహస్యంగా భేటీ అయ్యారు. ఇంతకాలం కేశినేనికి సన్నిహితంగా ఉన్న కొమ్మారెడ్డి పట్టాభి కూడా ఈ భేటీలో పాల్గొనడం విశేషం. కేశినేనిని ఎలా ఎదుర్కోవాలి. వచ్చే ఎన్నికల్లో ఆయనకు అవకాశం దక్కకుండా ఏం చేయాలి.. పార్టీని ధిక్కరిస్తున్నారని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలన్న దానిపై వీరు సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ రెండు సమావేశాలతో బెజవాడ టీడీపీ రాజకీయాలు మరోసారి కాక పుట్టిస్తున్నాయి.

ఎంపీ తనయ పర్యటనలపై ఆగ్రహం

తన కుమార్తె శ్వేతను బెజవాడ మేయర్ చేయాలని ప్రయత్నించి విఫలమైన కేశినేని.. వచ్చే ఎన్నికల్లో ఆమెను విజయవాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా లేదంటే బెజవాడ ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగా శ్వేత వెస్ట్, సెంట్రల్ తోపాటు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తూ హడావుడి చేస్తున్నారు. ఆమె పర్యటనలపై ప్రత్యర్థి వర్గీయులు అభ్యంతరం చెబుతున్నారు. ఎంపీగా కేశినేని ఎక్కడైనా పర్యటించవచ్చు, కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు గానీ.. ఆయన కుమార్తె ఏ హోదాలో పర్యటిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ అగ్రహంతోనే కేశినేని భవన్లో ఇటీవల నిరసన దీక్ష చేపట్టినప్పుడు.. ఆ దీక్షలు మీ ఈస్ట్ నియోజకవర్గంలో జరుపుకోండి అని బొండా, బుద్ధా వర్గీయులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

అలాగే సెంట్రల్లో శివాలయం ధ్వజ స్తంభ ప్రతిష్ట, వెస్ట్ లో 45వ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయ ప్రారంభ కార్యక్రమాల్లోనూ ఇరువర్గాల మధ్య రచ్చ జరిగింది. మున్సిపల్ ఎన్నికల సందర్బంగా తన కుమార్తె శ్వేతను మేయర్ అభ్యర్థిగా ఎంపీ నాని ఏకపక్షంగా ప్రకటించడం తో విభేదాలు మొదలయ్యాయి. రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు, సవాళ్లతో రచ్చకెక్కాయి. ప్రచారానికి అధినేత చంద్రబాబు వచ్చిన సమయంలోనే ఇవి జరగంతో ఆయన తీవ్రంగా హెచ్చరించారు. సర్దుబాటు చేయడానికి ప్రయత్నించారు. అయినా ఇప్పటికీ అంతర్గత కలహాలు చల్లారక పోగా మరింత ముదురుతున్నాయి. విజయవాడ నగరపాలక సంస్థను చేజిక్కించున్న వైఎస్సార్సీపీ, రాష్ట్ర ప్రభుత్వం నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు గుమ్మరించి పలు పనులతో దూసుకుపోతుంటే.. టీడీపీ అంతః కలహాలతో దిగజారుతోందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.