iDreamPost
android-app
ios-app

చంద్రబాబుకి మింగుడుపడని జగన్ ఎత్తులు, కొత్త జిల్లాలపై కక్కలేక మింగలేని చందంగా టీడీపీ

  • Published Jan 30, 2022 | 2:18 AM Updated Updated Mar 11, 2022 | 10:20 PM
చంద్రబాబుకి మింగుడుపడని జగన్ ఎత్తులు, కొత్త జిల్లాలపై కక్కలేక మింగలేని చందంగా టీడీపీ

జగన్ రాజకీయ వ్యూహాలకు చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యమంత్రి ఎత్తులకు ప్రధాన ప్రతిపక్షం తేలిపోతోంది. తనకన్నా అనుభవజ్ఞులు లేరని చెప్పుకున్న టీడీపీ అధినేత తలలు పట్టుకుంటున్నారు. వేగంగా పావులు కదుపుతున్న తీరుతో కకావికలం అయిపోతున్నారు. చివరకు టీడీపీ అభిమానులు సైతం జగన్ నిర్ణయాలను ఆహ్వానిస్తుంటే చంద్రబాబుకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి వచ్చింది. ఆఖరికి రెండు రోజుల తర్వాత ఓ ప్రకటన ఇచ్చి కొత్త జిల్లాల విషయంలో కక్కలేక మింగలేక అన్న చందంగా మారిన తమ వైనాన్ని చాటుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజన ఈనాటిది కాదు. ఆ మాటకొస్తే మాత్రం వందేళ్ల క్రితం బ్రిటీష్ హయాంలో ఏర్పడిన జిల్లాలే తప్ప కొత్తగా పునర్విభజన సమగ్రంగా జరగలేదు. బ్రిటీష్‌ కాలంలో 11 జిల్లాలుగా ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఆ తర్వాత 1970లో ప్రకాశం జిల్లా విభజన జరిగింది. నెల్లూరు, గుంటూరు తో పాటుగా కర్నూలు పరిధిలో ఉన్న ప్రాంతాలను కూడా కలిపి ప్రకాశం జిల్లాగా నామకరణం జరిగింది. చివరిసారిగా ఏపీలో 1979లో కొత్త జిల్లా ఏర్పడింది. విశాఖ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను శ్రీకాకుళం జిల్లా పరిధిలోకి వచ్చే కొన్ని ప్రాంతాలను కలిపి విజయనగరం జిల్లా ఏర్పాటయ్యింది. ఆ తర్వాత కొత్త జిల్లాల ప్రతిపాదనలు వచ్చినా ఆచరణ రూపం దాల్చలేదు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 2015లో చంద్రబాబు ప్రభుత్వం ఓ ప్రయత్నం చేసింది. అందుకు అనేక కారణాలు ప్రచారం కాగా చివరకు 13 సంఖ్య శ్రేయస్కరం కాదని మరో కొత్త జిల్లా ఏర్పాటు ద్వారా రాష్ట్రాన్ని 14 జిల్లాలుగా మార్చాలని కూడా కొందరు ప్రస్తావించారు. దానికి తగ్గట్టుగా రంపచోడవరం కేంద్రం ఏజెెన్సీ మండలాలతో కలిపి జిల్లా ఏర్పాటు చేయాలని ఆలోచించారు.. అప్పట్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీలో విలీనం చేసి ఏడు మండలాలతో పాటుగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 11 మండలాలను కలిపి 19 మండలాల కొత్త జిల్లా ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేశారు. దానిని టీడీపీ నేతలే అడ్డుకున్నారు. ఏజెన్సీ జిల్లా అయితే గిరిజన పట్టు పెరుగుతుందని, తమ భూములకు రక్షణ ఉండదని, 1/70 చట్టాన్ని బూచిగా చూపించి ఈ వ్యవహారం నిలుపుదల చేశారు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది.

జిల్లాల విభజన ద్వారా పాలనా వికేంద్రీకరణ ఆవశ్యాన్ని జగన్ గుర్తించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టారు. ప్రజామద్ధతు పొందారు. అధికారంలోకి రాగానే ప్రయత్నాలు చేశారు. దానికి జనగణన మూలంగా కొంత జాప్యం జరిగిందన్నది వాస్తవం. నిజానికి జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికలకు ముందే జిల్లాల విభజన జరిగితే ఏ సమస్యా ఉండదని జగన్ ఆశించారు.కానీ అనుకోని అడ్డంకులతో అది అనివార్యంగా పరిషత్ ఎన్నికల తర్వాత తెరమీదకు వచ్చింది. 2020 నుంచే దానికి కసరత్తులు చేశారు.. పలు ప్రతిపాదనలు సేకరించారు. అంతిమంగా ఎన్నికలకు ముందు చెప్పిన అంశాన్ని అమలులోకి తెస్తున్నారు. ఆ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా వంటివి ఎన్నికల ముందు చెప్పినట్టుగా చేస్తున్నారు.

జిల్లాల ఏర్పాటు ఎన్నికల హామీలో భాగంగా అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానిస్తే, ఆయన పార్టీ అధినేత, సొంత బావ చంద్రబాబు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కొత్తరాగం అందుకున్నారు. హడావిడిగా చేశారంటూ సన్నాయి నొక్కులు నొక్కతున్నారు. 2017 నుంచి వైసీపీ చెబుతున్నది, 2019 నుంచి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది మరచిపోయి ఆయన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు వంటివి తాను చేయలేనివి కూడా జగన్ చేస్తున్నారనే సంగతి అంగీకరించడానికి ఆయన సతమతమవుతున్నారు. కానీ చంద్రబాబు అంగీకారంతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ అభిమానులు, సామాన్యులు సైతం జగన్ చొరవను అభినందించడం టీడీపీ నేతలకు మింగుడుపడే అవకాశం లేదు.