iDreamPost
iDreamPost
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ వచ్చే నెల చివరి నుంచి లేదా నవంబర్ లో తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే టీమ్ దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటోంది. లాక్ డౌన్ కు ముందు ప్లాన్ చేసుకున్నట్టు కేరళకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇందులో విజయ్ సేతుపతి వదులుకున్న కీలకమైన పాత్ర ఎవరు చేస్తారన్న సస్పెన్స్ ఇప్పటిదాకా కొనసాగింది. ఆ మధ్య బాబీ సింహా అన్నారు. తర్వాత కిచ్చ సుదీప్ పేరు కూడా వినిపించింది. కానీ వాళ్ళు కాదని తేలిపోయింది. తాజాగా మాధవన్ ని గట్టిగా ట్రై చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కథను వినిపించారని కాకపోతే కొంచెం ఆలోచించుకుని చెప్తానని అన్నట్టు వినికిడి.
మాధవన్ తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేసి చాలా కాలమయ్యింది. ఆ మధ్య నాగ చైతన్యతో సవ్యసాచి చేశాడు కానీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అనుష్కతో చేసిన నిశ్శబ్దం అక్టోబర్ 2న రాబోతోంది. ఇది కాకుండా తన చేతిలో ఉన్నది స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఉన్న రాకెట్రీ ఒక్కటే. ఐదు భాషల్లో చాలా ప్రతిష్టాత్మకంగా మాధవన్ దీన్ని రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదలకు ప్లానింగ్ జరుగుతోంది. మరి పుష్ప కోసం ఎక్కువ డేట్లు ఇవ్వగలడా అనేది వేచి చూడాలి. తెలుగు బాష సరిగా రాకపోవడం వల్లే ఇక్కడ ఎక్కువ చిత్రాలు చేయలేదని చెబుతున్న మాధవన్ ఇకపై స్వంతంగా డబ్బింగ్ కూడా రెడీ అంటున్నాడు. కథ నచ్చితే పాజిటివ్ క్యారెక్టరా నెగటివా అనేది ఆలోచించడం లేదు ఈ టాలెంటెడ్ యాక్టర్
సఖి, చెలి, యువ లాంటి మూవీస్ తో ఇక్కడా మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న మాధవన్ కనక పుష్పలో తోడైతే ఖచ్చితంగా మార్కెట్ పరంగా చాలా హెల్ప్ అవుతుంది. ఎలాగూ పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నారు కాబట్టి 3 ఇడియట్స్ తో నేషనల్ వైడ్ గుర్తింపు ఉన్న మాధవన్ నార్త్ ఆడియన్స్ పరంగా ప్లస్ గా మారతాడు. అధికారికంగా ప్రకటించే దాకా దీన్ని ధృవీకరించలేం కాని దర్శకుడు సుకుమార్ మాత్రం చిన్న ఆప్షన్స్ పెట్టుకోవడం లేదు. వచ్చే వేసవి విడుదలకు ప్లాన్ చేసుకుంటున్న పుష్పలో రష్మిక మందన్న హీరోయిన్ కాగా ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ సిద్ధం చేసి ఉంచాడు. దీని షూటింగ్ కోసమే రష్మిక హైదరాబాద్ వచ్చేసింది. బన్నీతో మొదటి కాంబినేషన్ కావడంతో మంచి ఎగ్జైట్మెంట్ తో ఉంది. ఆచార్యలో రామ్ చరణ్ సరసన చేయాల్సిన పాత్రకు సంబంధించిన చర్చలు కూడా రేపో ఎల్లుండో జరగబోతున్నాయట