iDreamPost
android-app
ios-app

Up – ఉత్తరప్రదేశ్‌… అస్థిరత్వం నుంచి స్థిరత్వం వైపు…

  • Published Dec 03, 2021 | 3:02 PM Updated Updated Mar 11, 2022 | 10:32 PM
Up – ఉత్తరప్రదేశ్‌… అస్థిరత్వం నుంచి స్థిరత్వం వైపు…

దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో పూర్తికాలం పదవీ కాలంలో ఉన్న ముఖ్యమంత్రులు కేవలం ముగ్గురు మాత్రమే. ఇప్పటి వరకు 21 మంది ముఖ్యమంత్రులు కాగా, వీరిలో మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌, యోగి ఆదిత్యనాథ్ లు మాత్రమే పూర్తి కాలం సీఎంలుగా ఉన్నారు. మిగిలిన వారు ఒక ప్రభుత్వంలో పూర్తికాలం ముఖ్యమంత్రులు గా చేయలేకపోయారు. దేశానికి ప్రధానమంత్రులుగా చేసిన చౌదరి చరణ్‌ సింగ్‌, వి.పి.సింగ్‌లు సైతం యూపీ ముఖ్యమంత్రులుగా పూర్తి కాలం పనిచేయలేకపోయారు. ఒకరిద్దరు ముఖ్యమంత్రులు ఐదేళ్లు పదవిలో ఉన్నా ఒక ప్రభుత్వకాలంలో కాకపోవడం గమనార్హరం.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలి ముఖ్యమంత్రి గోవింద్‌ వల్లభ్‌పంత్‌ ఎన్నికయ్యారు. ఆయన 1950 నుంచి 1952 వరకు ప్రొవిన్షియల్‌ అసెంబ్లీకి ముఖ్యమంత్రి గా పనిచేశారు. 1952 నుంచి 1954 వరకు తొలిసారి జరిగిన సాధారణ ఎన్నికల్లో విజేతగా నిలిచిన కాంగ్రెస్‌ పార్టీ తరపున మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక రోజు తక్కువ ఐదేళ్లు సీఎంగా ఉన్నా ఒకే ప్రభుత్వ హాయాంలో ఆయన పూర్తి కాలం పనిచేయలేదు. ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోగా ఆయన స్థానంలో సంపూర్ణానందా ఎన్నికయ్యారు. స్వాతంత్ర సమరయోధుడైన వల్లభ్‌ పంత్‌ స్వాతంత్య్రం రాకముందు కూడా 1937 నుంచి 1939 వరకు ముఖ్యమంత్రిగా చేయడం గమనార్హం.

సంపూర్ణానందా 1954 నుంచి 1957 వరకు మూడేళ్ల పాటు తొలి ప్రభుత్వంలోను, తరువాత జరిగిన ఎన్నికల్లో మరోసారి ఏర్పడిన ప్రభుత్వంలో రెండవసారి 1957 నుంచి 60 వరకు సీఎంగా ఉన్నారు. మొత్తం మీద ఆయన ఐదేళ్ల 344 రోజులు సీఎంగా ఉండి రికార్డు సృష్టించారు. అయితే ఒక ప్రభుత్వంలో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగలేకపోయారు. ఆ తరువాత ముఖ్యమంతిగ్రా నియమితులైన చంద్రభాను గుప్త సైతం యూపీలో రెండు, మూడు, నాలుగు, ఐదు ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించారు. గుప్తా 1960 నుంచి 63 వరకు రెండేళ్ల 298 రోజులు, 1967లో కేవలం 19 రోజులు, 1969 నుంచి 70 వరకు 349 రోజులు పనిచేశారు. మధ్యలో సుచేతా కృపాలనీ 1963 నుంచి 1967 వరకు మూడు సంవత్సరాల 162 రోజులు పనిచేశారు.

దేశ ప్రధానిగా పనిచేసిన చౌదరి చౌరణ్‌ సింగ్‌ సైతం రెండుసార్లు యూపీకి ముఖ్యమంత్రి అయినా ఐదేళ్లు ఏకకాలం పనిచేయలేకపోయారు. 1967 నుంచి 1968 వరకు 328 రోజులు, తిరిగి 1970లో 225 రోజులు సీఎంగా ఉన్నారు. మధ్యలో త్రిభువన్‌ నారాయణ సింగ్‌ 1970 నుంచి 1971 వరకు 167 రోజులు, కమలాపాటి త్రిపాఠి 1971 నుంచి 1973 వరకు రెండేళ్ల 69 రోజులు సీఎంగా ఉన్నారు. హేమావతి నందన్‌ బహుగుణ సైతం రెండుసార్లు సీఎం అయ్యారు. 1973 నుంచి 75 వరకు రెండేళ్ల 21 రోజులు 1973 నుంచి 1975 వరకు ఆ పదవిలో ఉన్నారు. నారాయణదత్‌ తివారీ 1976 నుంచి 1977 వరకు ఏడాది మీద 99 రోజులు, రెండవసారి 1984 నుంచి 1985 వరకు ఏడాది మీద 52 రోజులు, తిరిగి 1988 నుంచి 1989 వరకు ఏడాది మీద 163 రోజులు సీఎంలుగా పనిచేశారు. తివారీ మధ్యలో రామ్‌ నరేష్‌ యాదవ్‌ 1977 నుంచి 1979 వరకు ఏడాది మీద 249 రోజులు, బాబూ బనారసి దాస్‌ 1979 నుంచి 1980 వరకు 354 రోజులు, విశ్వనాధ్‌ ప్రతాప్‌ సింగ్‌ 1980 నుంచి 82 వరకు రెండేళ్ల 39 రోజులు, ఎస్‌.మిశ్రా 1982 నుంచి 84 వరకు రెండేళ్ల 14 రోజులు, బహుదూర్‌ సింగ్‌ 1985 నుంచి 89 వరకు రెండేళ్ల 274 రోజులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు.

రామ్‌ నరేష్‌ యాదవ్‌, బహు బనారసి దాస్‌లు జనతా పార్టీ తరపున సీఎంలుగా ఉన్నారు. చరణ్‌ సింగ్‌ భారతీయ క్రాంతి దల్‌ తరపున సీఎంగా ఉండగా, నారాయణసింగ్‌ ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఓ) తరపున ఉన్నారు. మిగిలినవారంతా కాంగ్రెస్‌ పార్టీ తరపున సీఎంలుగా చేసినవారే. నెహ్రూ నుంచి రాజీవ్‌ గాంధీ వరకు ముఖ్యమంత్రులను ఇష్టానుసారం మార్చే ఆనవాయితీనని కొనసాగించారు.

1989లో జరిగిన పదవ అసెంబ్లీ ఎన్నికల నుంచి యూపీలో కాంగ్రెస్‌ పాలన ముగిసింది. అయినప్పటికీ 1989 నుంచి 2007 వరకు అస్థిర ప్రభుత్వాల ఆనవాయితీ యూపీలో కొనసాగుతూనే వచ్చింది. ముఖ్యమంత్రులు తరచూ మారుతూనే వచ్చారు. ఎన్నికల్లోను ఏ పార్టీలోను పూర్తిస్థాయి మెజార్టీలు రాకపోవడం, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం, పొత్తులు తరచూ విఫలం కావడం వంటి కారణాల వల్ల ములాయం సింగ్‌ యాదవ్‌, మాయవతి, కళ్యాణ్‌సింగ్‌ల మధ్య సీఎం పదవి మూడు ముక్కలాటగా సాగింది.

1989లో జనతాదళ్‌ కేంద్రంలోను, యూపీలోను అధికారంలోకి వచ్చింది. ములాయం సింగ్‌ యాదవ్‌ తొలిసారి ముఖ్యమంత్రిగా 1989 నుంచి 1991 వరకు ఏడాది మీద 201 రోజులు, తరువాత సొంతంగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) ఏర్పాటు చేసి 1993 నుంచి 1995 వరకు ఏడాది మీద 181 రోజులు, మూడవసారి 2003 నుంచి 2007 వరకు మూడేళ్ల 257 రోజులు ఆయన సీఎంగా ఉన్నారు. బీఎస్సీ తరపున మాయావతి 1995లో 137 రోజులు, 1997లో 184 రోజులు, మూడవ సారి 2002 నుంచి 2003 వరకు ఏడాది మీద 118 రోజుల పాటు పనిచేశారు. నాల్గవసారి మాత్రం ఆమె పూర్తి కాలం పదవిలో ఉన్నారు. బీజేపీ నుంచి కళ్యాణ్‌ సింగ్‌ తొలిసారిగా 1991 నుంచి 1992 వరకు ఏడాది మీద 165 రోజులు, రెండవసారి 1997 నుంచి 1999 వరకు రెండేళ్ల 52 రోజులు పనిచేశారు. బీజేపీ తరపున రామ్‌ ప్రకాష్‌ గుప్తా 1999 నుంచి 2000 వరకు 351 రోజులు వరకు, రాజ్‌నాథ్‌ సింగ్‌ 2000ల నుంచి 2002 వరకు ఏడాది మీద 131 రోజులు పనిచేశారు.


మూడు దఫాలుగా స్థిరత్వం:

2007 ఎన్నికల నాటి నుంచి యూపీలో సీన్‌ మారింది. ఆ ఎన్నికల్లో బీఎస్పీ పూర్తిస్థాయి మెజార్టీ సాధించింది. పార్టీ అధినేత్రి మాయావతి పూర్తికాలం పదవిలో ఉన్నారు. 2007 నుంచి 2012 వరకు నాలుగేళ్ల 307 రోజులు పనిచేసినా ఆమె 2007 నుంచి 2012 ఎన్నికల వరకు ఉన్నారు. తరువాత ఎస్పీ తరపున అఖిలేష్‌ యాదవ్‌ పూర్తిమెజర్టీ సాధించారు. ఆయన 2012 నుంచి 2017 వరకు ఐదేళ్ల నాలుగు రోజులు పదవిలో ఉన్నారు. 2017 ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ సాధించడంతో సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్‌ త్వరలో జరిగే ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా పూర్తికాలం పనిచేయనున్నారు. మొత్తం మీద యూపీలో గడిచిన మూడు ఎన్నికల తరువాత ముఖ్యమంత్రులు పూర్తికాలం పదవుల్లో కొనసాగే ఆనవాయితీ వచ్చింది. వచ్చే ఎన్నికల తరువాత ఇది కొనసాగుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది.