iDreamPost
android-app
ios-app

ఏక‌గ్రీవాల‌పై నిఘా.. ఎవ‌రి కోసం..?

ఏక‌గ్రీవాల‌పై నిఘా.. ఎవ‌రి కోసం..?

మ‌రో రెండు రోజుల్లో ఏపీలో తొలి ద‌శ పంచాయ‌తీ పోరు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్రారంభం కానుంది. నామినేష‌న్ల దాఖ‌లుకు ఆఖ‌రి తేదీ జ‌న‌వ‌రి 31. ఈ నేప‌థ్యంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌ల పూర్త‌య్యేలా ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ప్ర‌జ‌ల‌కు, నేత‌ల‌కు త‌గిన సూచ‌న‌లు చేస్తోంది. పార్టీ రహితంగా జ‌ర‌గాల్సిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో గ్రూపులు, ఘర్షణలకు తావు లేకుండా ఏకగ్రీవాలను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వ భారీ న‌జ‌రానాల‌ను కూడా ప్ర‌క‌టించింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవమైతే ఊరు అభివృద్ధికి ప్రభుత్వం నుంచి గరిష్టంగా రూ.20 లక్షలు వరకు ప్రోత్సాహకంగా అందనున్నాయి. పచ్చని పల్లెల్లో ఎన్నికలు కక్షలు, కార్పణ్యాలకు కారణం కాకూడదని, గ్రామీణుల సర్వశక్తులు అభివృద్ధికి దోహద పడాలని ప్రభుత్వం కోరుకుంటోంది. మ‌రోవైపు ఎస్ఈసీ ఈ ఏక‌గ్రీవాల‌పై నిఘా పెట్ట‌డం గ్రామాల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది.

ఎన్నికల వల్ల ప్రజలు వర్గాలుగా విడిపోయి గ్రామాభివృద్ధిని ఇబ్బందుల్లోకి నెట్టరాదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2020 మార్చి 12వ తేదీన ఈ ప్రోత్సాహకాలను ప్రకటించిన విషయం విదితమే. ఒక గ్రామానికి ఏడాది వ్యవధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే అన్ని రకాల గ్రాంట్లు, ఇంటి పన్ను రూపంలో వసూలయ్యే డబ్బుల కంటే ఏకగ్రీవమయ్యే గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాల ద్వారా అధికంగా నిధులు అందనున్నాయి. నిధుల కొరతతో సమస్యల మధ్య కొట్టుమిట్టాడే గ్రామాలు పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా ప్రోత్సాహకంగా భారీగా నిధులను పొందే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్ర హయాం నుంచే ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను అమలు చేస్తున్నారు. మొదటి దశ ఎన్నికలకు ఈనెల 29వతేదీ నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పల్లెల్లో శాంతియుత వాతావరణం వెల్లివిరిసేందుకు ఏకగ్రీవ గ్రామాలకు అందచేసే ప్రోత్సాహక నిధుల గురించి సమాచార శాఖ ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 73, 74వ రాజ్యాంగ సవరణల తర్వాత ఇప్పటివరకు నాలుగు సార్లు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఐదోసారి జరగనున్నాయి. 2001 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, విభజన తర్వాత కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రోత్సాహకాలను అందించడం ఆనవాయితీగా వస్తోంది.

గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాలలోనూ ఎన్నికల కారణంగా గ్రామాల్లో వైషమ్యాలు చెలరేగకూడదనే ఉద్దేశంతో ఏకగ్రీవమయ్యే చోట్ల ప్రోత్సాహక నిధులు అందచేస్తున్నారు. గుజరాత్‌లో పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకునే గ్రామాలకు ‘సమ్రాస్‌’ పథకం పేరుతో రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ప్రత్యేక పోత్సాహక నిధులను అందజేస్తోంది. తెలంగాణలోనూ రెండేళ్ల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికలల్లో ఈ తరహా ప్రోత్సాహకాలను అందచేశారు. ప్ర‌స్తుతం ఏపీలో గ్రామపంచాయతీల ఏకగ్రీవానికి రూ.2 ల‌క్ష‌ల నుంచి రూ.20లక్షల వరకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 2వేలలోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.5లక్షలు, 2 నుంచి 5వేల జనాభా కలిగిన పంచాయతీలకు రూ.10 లక్షల ప్రోత్సాహకం ఇవ్వనుంది. అలాగే 5వేల నుంచి 10వేల జనాభా కలిగిన పంచాయతీలకు రూ.15 లక్షలు, 15వేల జనాభా దాటిన పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ.20 లక్షల ప్రోత్సాహకం ఇవ్వనుంది.

ఇదిలా ఉండ‌గా.. ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా నిఘా చేపట్టే బాధ్యతలను పోలీసు ట్రైనింగ్‌ ఐజీ ఎన్‌.సంజయ్‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ అప్ప‌గించింది. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆయన్ను నియమించగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కూడా ఆమోదముద్ర వేశారు. పరిషత్‌, పురపాలక ఎన్నికల్లో రాష్ట్ర పోలీసులు కొందరు అధికార పార్టీ తరపున ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరించడం, మరికొన్ని చోట్ల ఏకగ్రీవాలకు పరోక్షంగా సహకరించడం, అధికార పార్టీ అక్రమాలను పట్టించుకోకపోవడంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. పంచాయతీ ఎన్నికల్లో అటువంటివి పునరావృతం కాకుండా రాష్ట్ర పోలీసులపై నిఘా పెట్టడం, అవసరం మేరకు కేంద్ర బలగాలను రప్పించడంపైనా ఆలోచన చేయాలని కమిషనర్ ఆయ‌న‌కు సూచించారని సమాచారం. ఐజీ ఎన్‌.సంజయ్ మాట్లాడుతూ ఏకగ్రీవాలను అడ్డుకోవడం తమ బాధ్యత కాదని.. వాటి వెనుక ప్రలోభాలు, ఒత్తిళ్లు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవడమే తమ కర్తవ్యమని స్పష్టం చేశారు. దీంతో ఏక‌గ్రీవాల‌పై నిఘా కొన‌సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.