iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో అన్నదాతల లోగిళ్లు ధనధాన్యాలతో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది అంచనాలకు మించి పంట దిగుబడులు రావడం, మద్దతు ధర పలుకడంతో రైతుల ఇంట నిజమైన సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. సాగుకాలంలో అడుగడుగునా ప్రభుత్వం అండగా నిలవడంతో ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి రికార్డు స్థాయి దిగుబడులు సాధించిన రైతన్నలు రెట్టించిన ఉత్సాహంతో పెద్ద పండుగ వేడుకల్లో నిమగ్నమయ్యారు. సకాలంలో పడిన వర్షాలతో గోదావరి, కృష్ణ నదులు పరవళ్లు తొక్కడంతో రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి. దీనికి తోడు రైతాంగాన్ని అన్ని విషయాల్లో ప్రభుత్వం చేయి పట్టుకుని నడిపించి వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించింది.
ఆదుకున్న రైతు భరోసా..
ప్రభుత్వం రైతు భరోసా కింద మూడేళ్లలో 50.58 లక్షల కుటుంబాలకు రూ.6,899.67 కోట్ల సాయం అందించింది. ఆర్బీకేల ద్వారా సకాలంలో నాణ్యమైన విత్తనాలు, కావాల్సినన్ని ఎరువులతో పాటు సబ్సిడీపై పురుగు మందులను అందించింది. కూలీల కొరత అధిగమించేందుకు అద్దె ప్రాతిపదికన యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచింది. ఇలా అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో రైతులు గత మూడేళ్ల కంటే గరిష్టంగా 94.80 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటలు సాగు చేశారు. కోత కొచ్చిన వేళ వైపరీత్యాలు కొంత కలవరపెట్టినప్పటికీ మొక్కవోని ధైర్యంతో సిరుల పంట పండించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన నల్ల తామర వల్ల మిరప పంట దెబ్బతిన్నప్పటికీ మిగిలిన పంటల దిగుబడి బాగుండటంతో రికార్డు స్థాయిలో కోటి 74 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులను రైతులు సాధించారు.
ఆర్బీకేల ద్వారా కొనుగోళ్లు..
రాష్ట్రంలో 40.77 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వగా, గతంలో ఎన్నడూ లేని విధంగా 80.46 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు సాధించారు. ఇందులో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంతో 8,651 ఆర్బీకేల్లో ప్రభుత్వం పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఇప్పటి వరకు 2.70 లక్షల మంది రైతుల నుంచి రూ.3,756 కోట్ల విలువైన 19.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. దాదాపు 1,00,283 మంది రైతులకు రూ.1,470 కోట్ల జమ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 21 రోజుల్లోనే సేకరించిన ధాన్యానికి చెల్లింపులు చేస్తున్నారు. అకాల వర్షాలు, తుపాన్ వల్ల దెబ్బతిని రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తూ అండగా నిలవడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఏడాది పత్తి, మిరప, మినుము, కందులు, వేరుశనగ, పసుపు, మొక్కజొన్న, టమాట తదితర ప్రధాన వాణిజ్య పంటలన్నీ కనీస మద్దతు ధరకు మించి ధర పలకడంతో రైతుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పత్తి రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.10 వేల మార్క్ను అందుకుంది. ఈ నేపథ్యంలో రైతులు సంక్రాంతి పండుగను రెట్టించిన ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఇళ్లతో పాటు వ్యవసాయానికి తోడుగా నిలిచే కాడెద్దులు, యంత్ర పరికరాలను ముస్తాబు చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్న బంధువులు, కుటుంబ సభ్యుల రాకతో పల్లెల్లో కొత్త సందడి నెలకొంది. రైతు మోమున విరిసిన నవ్వులతో పల్లెకు సంక్రాంతి శోభ వచ్చింది.
జగన్ శ్రద్ధతో సత్ఫలితాలు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయ రంగంపై తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ సత్ఫలితాలిస్తోంది. ఆయన అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా రైతులు సంక్రాంతి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఆరుగాలం శ్రమించిన రైతు నష్టపోకూడదని సీఎం అనేక పథకాలతో వారికి అండగా నిలిచారు. దీంతో అధిక దిగుబడి సాదించి రైతులు రెట్టించిన ఉత్సాహంతో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. ఈ సంతోషానికి కారణం అయిన సీఎం జగన్మోహనరెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నారు.