Idream media
Idream media
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి 23 మంది సీనియర్లు పార్టీ లోని లోపాలపై లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖతో పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. అయితే ఆ లేఖ దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని యూపీ కాంగ్రెస్ లిఖింపురి జిల్లా యూనిట్ తీర్మానించింది. శశి థరూర్ పై కూడా నిరసన సెగ వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీని ఎలా నడపాలో, పార్టీ పరిధిలోనే పార్లమెంటరీ కార్యకలాపాలు ఎలా నిర్వహించాలే ఆయన (థరూర్) నేర్చుకోలేదు. అందువల్లే ఆయన ఆలోచన లేకుండా కార్యాచరణలోకి దూకాడు. ఆయనకు గ్లోబల్గా పేరు ఉండొచ్చు. తెలివైనవాడు కూడా కావచ్చు. అయితే ఆయన ప్రతి చర్యా ఆయనలోని అపరిపక్వతనే చాటుతుంది. తానేదో గ్లోబల్ సిటిజిన్ అన్నట్టుగా పార్టీకి భిన్నమైన వైఖరిని ప్రదర్శించడం సరికాదు’ అని కేరళ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్లో ఒకరైన సురేష్ వ్యాఖ్యానించారు. ఒకవైపు ఇలా సోనియా మద్దతు దారులు లేఖ రాసిన సీనియర్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండగా.. మరోవైపు సోనియా పరోక్షంగా పార్టీలో వారి ప్రాధాన్యాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
సోనియా కీలక నిర్ణయం
పార్టీలో అసమ్మతి స్వరాలను అణచివేసేందుకే అన్నట్లుగా సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అసమ్మతి లేఖ సూత్రధారులైన రాజ్యసభలో పార్టీ నేత, ఉపనేతలైన ఆజాద్, ఆనంద శర్మలతో పాటు లోక్ సభలో పార్టీ సీనియర్లు శశి థరూర్, మనీశ్ తివారీలకు గట్టి షాక్ ఇచ్చారు. అనుభవం, వాగ్దాటి ఉన్న వీరిని కాదని తనకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న జైరాం రమేశ్ ను రాజ్యసభలో చీఫ్ విప్ గా నియమించారు. రాజ్యసభ లో పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఓ కమిటీని వేశారు. ఆ కమిటీకి ఆమె రాజకీయ సలహాదారు కాగా, ఏఐసీసీ కోశాధికారి అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ సభ్యులుగా నియమితులయ్యారు. అలాగే లోక్ సభలో పార్టీ ఉపనేతగా గౌరవ్ గొగోయ్ ను, విప్ గా రవనీత్ సింగ్ బిట్టూను నియమించారు. వాస్తవానికి థరూర్, తివారీ మంచి వక్తలు. పార్టీ విధానాలను స్పష్టంగా సభలో చాటే సత్తా వారికుంది. అయినప్పటికీ అసమ్మతి లేఖపై సంతకం చేసినందుకు వారిని పక్కనబెట్టినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.