iDreamPost
android-app
ios-app

సోముకు సీమ నేత‌ల ఝ‌ల‌క్‌?

సోముకు సీమ నేత‌ల ఝ‌ల‌క్‌?

ఏపీలో వైసీపీకి ప్ర‌త్యామ్నాయం బీజేపీయే అని ఆ పార్టీ నాయ‌కులు ప‌దే ప‌దే చెబుతున్నారు. సోము వీర్రాజు ఏపీ చీఫ్ అయ్యాక ఆ దిశ‌గా గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేశారు. టీడీపీకి ఎక్క‌డిక‌క్క‌డ చెక్ పెడుతూ ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించేందుకు య‌త్నించారు. వ‌రుస ఎన్నిక‌ల్లో ఓడిపోయిన టీడీపీ ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో పోటీ చేసే సాహ‌సం చేయ‌లేక‌పోతే, ఎన్నిక‌ల ప‌రంగా బీజేపీది కూడా అదే ప‌రిస్థితి అయిన‌ప్ప‌టికీ, ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం రాజ‌కీయ పార్టీగా త‌మ ధ‌ర్మం అంటూ పోటీకి సిద్ద‌మైంది. ఏపీలో తామే ప్ర‌తిప‌క్షం అని ప్ర‌క‌టించుకుంది. కానీ, తిరుప‌తి ఉప ఎన్నిక‌లో ఘోర ఓట‌మి త‌ర్వాత ప్ర‌త్య‌క్షంగా కాస్త దూకుడు త‌గ్గించిన సోము పార్టీ బ‌లోపేతానికి స‌మీక్ష‌ల‌పై దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలోనే జిల్లాల వారీగా పార్టీ నేత‌ల‌తో వ‌ర్చువ‌ల్ గా భేటీ అవుతున్నారు.

త‌ప్పు మీదంటే మీదే..

ఈ క్ర‌మంలోనే ఇటీవల సీమ నేత‌ల‌తో కూడా సోము ఆన్ లైన్ స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాయలసీమ నేతలతో సోము మాట్టాడుతూ..“మీ ప్రాంతంలో బీజేపీకి పట్టు ఎక్కువగా ఉంది. నేను చేసిన పర్యటనల్లోనూ ఇది స్పష్టం గా కనిపించింది. ఇక మీదే ఆలస్యం. ఈ ప్రాంతంలో వచ్చే ఎన్నికలకు ముందుగానే పార్టీ బలపడాలి. లేకపోతే.. మీదే తప్పు!“అని అనేసి చేతులు ముడుచుకున్నారు. దీంతో సీమ బీజేపీ నేతలు రివ‌ర్స్ లో సోము వీర్రాజు నే ప్ర‌శ్నించార‌ట‌. తమదే తప్పు అన్న మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశార‌ట‌. అంతేకాదు క‌ర్నూలు లో హైకోర్టు ఏర్పాటు గురించి ప‌ట్టుబ‌ట్టార‌ట‌.

మ‌న‌మిచ్చిన హామీ ఏమైంది..

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని మనం గత ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని.. కానీ ఇప్పటి వరకు దీని పై ఒక్కమాట కూడా మాట్లాడడం కానీ.. ఒక్క అడుగు ముందుకు వేయడం కానీ చేయలేక పోయామని లేవ‌నెత్తార‌ట‌. మరి.. దీనికి ఎవరిని బాధ్యులను చేయాలని ప్ర‌శ్నించార‌ట‌. ఈ విష‌యంపై ప్రభుత్వాన్ని విమ‌ర్శించ‌లేమ‌ని పేర్కొన్నార‌ట‌. ఈ విషయంలో ఎవరిపై చర్యలు తీసుకోవాలో చెప్పాలని నిలదీసేసరికి.. సోము అర్ధాంతరంగా మీటింగ్ ముగించుకుని వెళ్లిపోయిన‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ విషయం ఇప్పుడు ఆ నోటా ..ఈ నోటా మిగిలిన బీజేపీ నేతల చెవిన పడేసరికి దీని గురించే వారు ప్రధానంగా చర్చించుకుంటున్నారట.