సంక్రాంతి బరిలో పెద్ద పుంజులన్నీ దిగిపోయాయి. ఇక బాలన్స్ కళ్యాణ్ రామ్ ఒక్కడే. ఎల్లుండి ఎంత మంచివాడవురాతో పలకరించబోతున్నాడు. ఇదిలా ఉండగా టాక్ కు సంబంధించి సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో రెండూ ఎవరి టార్గెట్ ఆడియన్స్ ని అవి శాటిస్ఫై చేయగా ఏది పెద్ద రేంజ్ కు వెళ్తుందనేది తెలియాలంటే మాత్రం ఇంకో వారం దాటితే కానీ క్లారిటీ రాదు. ఈలోగా ఫస్ట్ డే వసూళ్లను హై లైట్ చేసుకుంటూ పోస్టర్లు వదులుతున్నాయి సదరు యూనిట్లు.
ఇప్పటికే మహేష్ మూవీకి మొదటి రోజు 46 కోట్ల పైచిలుకు షేర్ వచ్చినట్టుగా పబ్లిసిటీ ఇచ్చేశారు. నిన్న మీడియాతో జరిపిన సక్సెస్ మీట్ లో నిర్మాత అనిల్ సుంకర సగం పైగా బయ్యర్లకు అమౌంట్ వచ్చేసిందని అనౌన్స్ చేశారు. జరిగిన థియేట్రికల్ బిజినెస్ 120 కోట్లకు పైగా ఉంటె సగం అంటే కనీసం 55 కోట్లయినా రావాలి. కానీ వాస్తవానికి అది వేరుగా ఉంది. రెండో రోజే బన్నీ మూవీ వచ్చింది కాబట్టి ఫిగర్స్ లో తేడా రావడం సహజం
మరోవైపు అల వైకుంఠపురములో టీమ్ న్యూజిలాండ్,ఆస్ట్రేలియాలలో బాహుబలి కంటే ఎక్కువ ప్రీమియర్ కలెక్షన్ వచ్చిందని ప్రమోషన్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చిందనే దాని గురించి ఇవాళ సాయంత్రం లోపు ఏదో ఒకటి వదిలేలా ఉన్నారు. నిన్న రెండు షోలు పూర్తవ్వడం ఆలస్యం సంక్రాంతి విన్నర్ అంటూ ఏకంగా వీడియో టీజర్ కూడా వదిలారు. ,మరోవైపు సరిలేరు కూడా దీనికి ధీటుగా ముందే కట్ చేసిన వీడియో ప్రోమోలతో బాగానే హడావిడి చేస్తున్నారు. మరోవైపు అభిమానులు వీటి గురించి సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్స్ చేసుకుంటున్నారు. పండగ సీజన్ ని రెండు వాడుకుంటూ మంచి వసూళ్లు సాధిస్తున్న మాట నిజమే. అయితే రియల్ స్టామినా బయట పడాలి అంటే మాత్రం ఇంకో వారమైనా ఆగాల్సిందే.