ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రాలకు అక్రమంగా తరలించే ఇసుక రవాణాని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టి పెట్టింది. ఇసుకను అక్రమంగా తరలించే మార్గాలను గుర్తించి వాటిని అరికట్టడానికి ఎక్కువ నిఘా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సన్నాహకాలు మొదలు పెట్టింది. ముఖ్యంగా కృష్ణ, గుంటూరు జిల్లాల నుండి హైదరాబాద్, తెలంగాణ జిల్లాలకు, రాయలసీమలో చిత్తూరు, కర్నూలు అనంతపురం జిల్లాలనుండి బెంగుళూరు మరియు కర్ణాటకలో వివిధ ప్రాంతాలకు ఇసుకని అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ అక్రమ రవాణాని అరికట్టడానికి, జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులపై నూతనంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 70 చెక్ పోస్టులను నూతనంగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. చెక్ పోస్టుల వద్ద పంచాయితిరాజ్ శాఖ ద్వారా సిబ్బంది విధులు నిర్వహించేందుకు వీలుగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో ఇప్పటికే 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేయగా మరో 14 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ప్రతి చెక్ పోస్ట్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.