iDreamPost
android-app
ios-app

సేఫ్ గేమ్ చూస్తున్న మల్టీ స్టారర్

  • Published Jun 09, 2021 | 5:49 AM Updated Updated Jun 09, 2021 | 5:49 AM
సేఫ్ గేమ్ చూస్తున్న మల్టీ స్టారర్

టాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇంకో పది శాతం మాత్రమే బాలన్స్ ఉందని విశ్వాసనీయ వర్గాల సమాచారం. లాక్ డౌన్ క్రమంగా సడలించడంతో పాటు ఈ నెల 10 నుంచి సాయంత్రం దాకా కార్యకలాపాలు నిర్వహించుకునేలా తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఇకపై పోస్ట్ ప్రొడక్షన్ ని ఇంకా వేగవంతం చేయబోతున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కరోనా బారిన పడినా త్వరగా కోలుకుని నెగటివ్ రిపోర్ట్స్ తెచ్చేసుకున్నారు. రాజమౌళితో సహా దాదాపు టీమ్ అందరూ వైరస్ ని పలకరించి సురక్షితంగా బయట పడిన వాళ్ళే.

ఇక విడుదల విషయంలో నెలకొన్న సందిగ్దతకు జక్కన్న త్వరలోనే చెక్ పెట్టబోతున్నట్టు తెలిసింది. అక్టోబర్ 13 రిలీజ్ చేయడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. సంక్రాంతికి కూడా పరిస్థితి దేశవ్యాప్తంగా నార్మల్ గా ఉంటుందో లేదో అన్న సందేహం నెలకొన్న నేపథ్యంలో ఈ గొడవేది లేకుండా 2022 ఏప్రిల్ కి ఫిక్స్ అయిపోవాలని అనుకుంటున్నారట. అది కూడా బాహుబలి 2 వచ్చిన 28న, అంటే సెంటిమెంట్ గా కూడా కలిసొచ్చేలా ఇలా ప్లాన్ చేశారని అర్థమవుతోంది. తొందరపడి ప్రకటన ఇవ్వకుండా కేవలం వాయిదా గురించి మాత్రమే చెప్పి తర్వాత సమయానుకూలంగా కొత్త తేదీని చెప్పాలని నిర్ణయించుకున్నారట.

మొత్తానికి ఎంత ఎదురు చూస్తే ఆర్ఆర్ఆర్ అంత ఆలస్యం అవుతోంది. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ సపోర్ట్ చాలా అవసరం. పిల్లల మీద కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఉంటుందని వార్తలు వస్తున్న తరుణంలో ఫ్యామిలీస్ తమ పిల్లలను థియేటర్లకు తెచ్చేందుకు జంకుతున్నారు. ఇంకో అయిదారు నెలలు ఈ భయాలు ఇలాగే ఉండొచ్చు. అలాంటప్పుడు ఆర్ఆర్ఆర్ వసూళ్ల మీద ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ అంటే ఆలోగా దాదాపు దేశం మొత్తం వ్యాక్సిన్ చేసుకుని ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి నిర్భయంగా రిలీజ్ చేసుకోవచ్చు. చూద్దాం ఏమేం జరగబోతోందో.