iDreamPost
iDreamPost
“ప్రస్థానం” అనే సినిమా ఒకటి వచ్చింది. రాజకీయం కథా నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. రాజకీయం అంటేనే మోసం, దగా, కుట్ర, ఎత్తులు, జిత్తులు, పై ఎత్తులు. ఇదే విషయంపై సాయికుమార్ ఓ అద్భుతమైన డైలాగ్ ఉంది.
“ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాలకోసం దార్లు తొక్కే పాత్రలు తప్ప, హీరోలు, విలన్లు లేరీ నాటకంలో. మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే… అహం. ప్రతిపురుగునూ కదిలించే నిజం ఒక్కటే… ఆకలి. తపించే యాత్మనేలా శాసించే శక్తి ఒక్కటే … ఆశ.” అలా ముగుస్తుంది ఆ భారీ డైలాగ్.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే “అవసరాలకోసం అడ్డదారులు తొక్కే విలన్లే” చుట్టూ ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, ఆంధ్ర జ్యోతి మీడియా బహిరంగంగా, బరితెగించినట్టే కుట్రలు చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి.
Also Read:జగన్ పై దీర్ఘకాలిక కుట్రకు తెరలేపిన ఆంధ్రజ్యోతి, బరితెగించిన ఆర్కే
మొదట్లో అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్ళలో, అంటే 1990 దశకం చివర్లో జగన్ పై “అహంభావి” అనే ముద్ర వేశారు. ఆ తర్వాత 2000 దశకంలో అదే జగన్ పై “ఫ్యాక్షనిస్టు” ముద్ర వేసి పరిటాల రవి హత్యకేసులో నిందితుడిగా ప్రచారం చేశారు.
ఇక 2010 దశకంలో “అవినీతిపరుడు” అనే ముద్ర వేసి “లక్షకోట్లు అవినీతికి పాల్పడ్డాడు జగన్” అంటూ ప్రచార అంశం మార్చారు. నిత్యం జగన్ పై లక్ష కోట్లు అంటూ, ఆ తర్వాత ఆయన్ను జైలుకు పంపి, తిరిగొచ్చిన తర్వాత “చిప్పకూడు” అంటూ అవహేళన చేశారు. ఇంత చేసినా 2014 ఎన్నికల్లో “చావుదప్పి కన్నులు లొట్టపోయి” అన్న చందంగా జగన్ ను ఓడించి అధికారం చేజిక్కించుకున్నారు.
జగన్ “అహంభావి” అన్నా, “ఫ్యాక్షనిస్టు” అన్నా జనం నమ్మలేదు. జగన్ “అవినీతి పరుడు” అంటే కూడా జనం నమ్మలేదు. “లక్షకోట్ల అవినీతి” అంటూ ప్రచారం చేస్తే లక్షల ఓట్లు ఇచ్చి తిరుగులేని ఆధిపత్యంతో 2019 ఎన్నికల్లో అధికారం కట్టబెట్టారు. అయినా “అవసరాలకోసం దారులు తొక్కే… ” అంటూ సాగిన సాయికుమార్ డైలాగ్ లాగా వీరు అవసరాలకోసం అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టారు.
మొదట జగన్ అరెస్టు తప్పదు అన్నారు. అప్పుడు ఆయన జైలుకు వెళతారు అన్నారు. పార్టీ చీలిపోతుంది అంటూ ప్రచారం మొదలు పెట్టారు. రఘురామ కృష్ణంరాజు వంటి వాళ్ళను అడ్డం పెట్టుకుని ఆరోపణలపర్వం నడిపించారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని కుట్రలు చేశారు.వ్యవస్థలో టీడీపీ సానుభూతిపరుల మద్దతుతో జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై ఎన్నడూ లేనన్ని కేసులు వేసి అడ్డుకున్నారు.
ఈ అడ్డదారులు ఎలాంటివంటే… జగన్ ప్రభుత్వం ఎన్నికలు జరుపుతాం అంటే నో అంటూ కోర్టుకెళ్ళడం… ఎన్నికలు జరపలేం అంటే జరపాల్సిందే అంటూ కోర్టుకెళ్ళడం. పరీక్షలు జరుపుతాం అంటే నో అంటూ కోర్టుకెళ్ళడం. పరీక్షలు జరపం అంటే మాదే విజయం అనడం… ఇలా ఒక్కటేమిటి… ప్రభుత్వ నిర్ణయాలపై చరిత్రలో ఎన్నడూ లేనన్ని కేసులు ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో ఉన్నాయి.
Also Read:బద్వేల్ ఉప ఎన్నిక -ఆమె మౌనం.. టీడీపీకి కష్టం
ఇవన్నీ ఒక ఎత్తైతే, జగన్ పై, జగన్ నాయకత్వంలోని ప్రభుత్వంపై పరోక్ష కుట్రలు మరో ఎత్తు. దేవాలయాలపై దాడులు చేయించడం. దేవతల విగ్రహాలు ధ్వంసం చేయించడం… ఇవన్నీ ఓ రెండుమూడు నెలలు నిరంతరంగా చేయించి హిందూ సెంటిమెంట్ రెచ్చగొట్టి, ప్రభుత్వం వైఫల్యం అయిందని, రాజ్యాంగ సంక్షోభం వచ్చిందని ప్రచారం చేయడం, జగన్ ఫెయిల్డ్ సీఎం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఒక ఉద్యమంగా నిర్వహించారు.
హిందూ దేవాలయాలపై దాడులు చేయించి జగన్ క్రిస్టియన్ అని, క్రైస్తవ మత మార్పిడులు, మత ప్రచారం విస్తృతంగా జరుగుతోందని ప్రచారం చేయడం తద్వారా కేంద్రంలోని బీజేపీ నాయకత్వాన్ని రెచ్చగొట్టి జగన్ బెయిలు రద్దయ్యేలా చేయడం ఈ వ్యూహంలో భాగం. దీనికి పరాకాష్టే ఈరోజు ఆంధ్ర జ్యోతి పత్రికలో దాని యజమాని వేమూరి రాధాకృష్ణ రాసిన “కొత్త పలుకు” సారాంశం.
జగన్ ప్రతిరోజూ రాత్రి జీసస్ తో మాట్లాడతారని, అలాగే 2009లో చనిపోయిన తన తండ్రి రాజశేఖర్ రెడ్డితో మాట్లాడతారని, ఆ విషయాలు గత యేడాది మార్చిలో జరిగిన ఒక సమావేశంలో అధికారులతో జగన్ అన్నారని ఓ సరికొత్త ప్రచారం మొదలుపెట్టారు. జగన్ కు మతాపిచ్చి ఎక్కువని ఓ అభిప్రాయం ప్రజల్లో కలిగించడమే ఈ కుట్ర లక్ష్యం.
Also Read:పీసీసీ పదవి – ఓటుకు నోటులాంటిదే అంటున్న కాంగ్రెస్ ఎంపీ
ఇలా వారానికొకటిగా, యేడాదికొకటిగా కుట్రలపై కుట్రలు చేస్తూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ అదే జగన్ పై యుద్ధం అనే భ్రమలో ఉంటున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఈ కుట్రలు ఇప్పటికే అర్ధం అయ్యాయి. అందుకే వారు ఇలాంటి వ్యాఖ్యలను చూసి, విని నవ్వుకుంటున్నారు తప్ప నమ్మడం లేదు.
అయినా అవసరాలకోసం అడ్డదారులు తొక్కే విలన్ల లాగానే వారి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కొనసాగుతాయి కూడా. అయితే జగన్ రాజకీయం వేరు. ఆ పాఠశాల సిలబస్ వేరు. ఆ సిలబస్ గురించి తెలియకపోతే, ఆ సిలబస్ ను పఠించకపోతే జగన్ తో యుద్ధం చేయడం, జగన్ పై గెలవడం సాధ్యం కాదు. ఇలా వారం వారం కొత్తపలుకులు రాసుకుంటూ, ఊహాలోకాల్లో తేలుకుంటూ కాలక్షేపం చేయడమే. అంతకు మించి ఫలితం ఏమీ ఉండదు.