iDreamPost
android-app
ios-app

ఆ టీడీపీ ఎమ్మెల్యే మౌనానికి కార‌ణాలేంటి?

ఆ టీడీపీ ఎమ్మెల్యే మౌనానికి కార‌ణాలేంటి?

గుంటూరు జిల్లా ఒక‌ప్పుడు టీడీపీ కంచుకోట‌. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఏకపక్ష విజయాలను నమోదు చేసింది. జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు ఉండగా 12 స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. ఓడిపోయిన వాటిలో మూడింట మంగళగిరిలో పదిహేడు ఓట్లు, గుంటూరు తూర్పులో మూడు వేల ఓట్లు, మాచర్లలో 3,500 ఓట్లు బాపట్లలో ఐదు వేల ఓట్ల తేడా మాత్ర‌మే.

అలాంటిది 2019లో వైసీపీ అధినేత జ‌గ‌న్ దెబ్బ‌కు సీన్ పూర్తిగా మారిపోయింది. కేవ‌లం 2 స్థానాల్లో మాత్ర‌మే గెలుపొందింది. చంద్ర‌బాబు అమ‌రావ‌తి క‌థ‌ల‌ను చెంత‌నే ఉన్న గుంటూరు వాసుల‌కు కూడా నమ్మలేదు. 17 స్థానాల‌కు గాను కేవ‌లం రెండు స్థానాల్లోనే టీడీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒక‌రు మద్దాలి గిరి పార్టీకి దూరం జరగగా,జిల్లాలో ఏకైక టీడీపీ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మౌనం అంతుచిక్క‌డం లేదు.

గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి పార్టీ మారిన‌ప్ప‌టి నుంచీ స‌త్య‌ప్ర‌సాద్ పేరు కూడా వినిపిస్తూ వ‌స్తోంది. రాజ‌కీయాల్లో ఆ త‌ర‌హా ప్ర‌చారం సాధార‌ణ‌మే. దీనిపై స‌త్య‌ప్ర‌సాద్ కూడా స్పందించి తాను పార్టీని వీడేది లేద‌ని గ‌తంలో స్ప‌ష్టం చేశారు. వైసీపీ ప్ర‌భుత్వంపైన‌, జ‌గ‌న్ పై కూడా విమ‌ర్శ‌లు చేసేవారు. వేదికలపై వైసీపీ సర్కారును టార్గె ట్ చేస్తూ.. తీవ్రస్థాయిలోవిమర్శలు గుప్పించారు.

రాజధాని ఉద్యమం విషయంలోనూ తన వాయిస్ను బలంగానే వినిపించారు. అయితే. ఇది ఆరు నెలల కిందటి ముచ్చట. కట్ చేస్తే.. ఇప్పుడు అనగాని ఎక్కడా కనిపించడం లేదు. వాయిస్ వినిపించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు.

అన‌గాని మౌనం కొద్ది రోజులుగా నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. నియోజకవర్గం పరిధిలో గతప్రభుత్వ హయాంలో నిర్వహించిన కాంట్రాక్టులు ఇతర త్రా పనుల్లో అవినీతి జరిగిందని, అందుకు సంబంధించిన నివేదిక ప్రభుత్వం వ‌ద్ద ఉంద‌ని తెలుస్తోంది. త‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డం, ఒక‌వేళ ఏదైనా జ‌రిగితే గ‌ట్టిగా పోరాడే స్థితిలో టీడీపీ లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో సైలెన్స్ గా ఉంటేనే మేల‌నే రీతిలో ఆ ఎమ్మెల్యే ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో వాస్త‌వం ఎంతో, ఎందుకు నిశ్శ‌బ్దం వ‌హిస్తున్నారో తెలియాలంటే ఆయ‌నే నోరువిప్పాలి.